లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పిన కెసీఆర్.. నాలుగేళ్లల్లో చేసిన మాఫీ రూ.16,143 కోట్లు అని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వడ్డీ పోగా వీళ్లు మొదటి ఐదేళ్లల్లో చేసిన రుణమాఫీ 13,514 కోట్లు మాత్రమేనన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక నాలుగేళ్లు రైతుల రుణమాఫీకి రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. చివరి ఏడాదిలో 21,35,557 మంది రైతులకు రూ.11,909 కోట్లు మాత్రమే మాఫీ చేశారన్నారు. అలాగే పదేళ్లలో బీఆర్ఎస్ చేసిన రుణమాఫీ రూ.16,908 కోట్లు మాత్రమేనని చెప్పారు. బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని రుణమాఫీ చేయలేదని మాట్లాడుతున్నారన్నారు. పది నెలల్లో మేం 25,35,964 మంది రైతులకు రూ. 20,616,89 కోట్లు మాఫీ చేశామన్నారు. అలాగే పదేళ్లలో మీరు చేసింది ఎంత? పది నెలల్లో మేం చేసింది ఎంత? చూడండి అంటూ సవాల్ చేశారు. BRS పార్టీని ప్రజలు ఉరి తీసినా మీ ఆలోచనా విధానంలో మార్పు రాలేదన్నారు. వాళ్లు ఎగ్గొట్టిన రైతు బంధు రూ.7,625 కోట్లు మా ప్రభుత్వం చెల్లించింది అన్నారు. అలాగే రూ.4666.59 కోట్లు రెండో విడత రైతు భరోసా అందించాం అని చెప్పారు. రైతు భరోసాను రూ. 10 వేల నుంచి రూ. 12 వేలకు పెంచామన్నారు. అలాగే వరి వేస్తే ఉరి అని చెప్పిన వాళ్లు ఫామ్ హౌస్ లో పండిన వడ్లను క్వింటాల్ రూ.4500 చొప్పున కావేరి సీడ్స్ కు అమ్ముకున్నారన్నారు. కానీ మేం రూ.11 వేల 61 కోట్లు సన్న వడ్లకు బోనస్ ఇచ్చామని గర్వంగా చెప్తున్నాం అన్నారు. ఉచిత కరెంట్ కాంగ్రెస్ పేటెంట్ హక్కు అని చెప్పారు. రాష్ట్రంలో 29,14,692 మంది రైతులకు రూ.15,332 కోట్లు వెచ్చించామన్నారు. గత ప్రభుత్వం పెట్టిన రైతు బీమాను కొనసాగిస్తున్నాం అన్నారు. మీరు పదేళ్లు చేయలేనివి మేం పదినెలల్లో చేస్తే అభినందించాల్సింది పోయి కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు అని దుయ్యబట్టారు. అలాగే నన్ను అభినందించకపోయినా ఫరవాలేదు… ప్రభుత్వాన్ని అభినందించవచ్చు కదా అని అన్నారు. అలాగే 16 మంది ముఖ్యమంత్రులు చేసిన అప్పు 2014 నాటికి మొత్తం అప్పు రూ.90,160 కోట్లు అని చెప్పారు. పదేళ్లలో వాళ్లు చేసిన అప్పు 1.12.2023 నాటికి రూ. 6,69,257 కోట్లు అని చెప్పారు. ఇది కాకుండా 40 వేల 154 కోట్లు పేమెంట్స్ పెండింగ్ లో పెట్టారని విమర్శలు చేశారు. ఇవి కలిపితే వాళ్లు పదేళ్లలో చేసిన మొత్తం అప్పు రూ. 8,19,151 కోట్లు అని మొత్తం లెక్కలు చెప్పారు.ఇక వాళ్లు సాధించిన ఘనత ఏమిటో వాళ్లే చెప్పాలన్నారు.పదేళ్లలో ఒక పార్టీ, ఒక కుటుంబం చేసిన అప్పు ఏడున్నర లక్షల కోట్లు అని బల్లగుద్ది చెప్పారు.మేం వచ్చిన పదిహేను నెలల్లో చేసిన రూ.1,58,041 కోట్లు, ఇందులో డిసెంబర్ 2023 నుంచి 28 ఫిబ్రవరి 2025 వరకు చెల్లించిన అసలు మొత్తం రూ. 88,591 కోట్లు, డిసెంబర్ 2023 నుంచి 28 ఫిబ్రవరి 2025 వరకు చెల్లించిన వడ్డీ మొత్తం రూ. 64,768 కోట్లు చెల్లించామని చెప్పారు. పదేళ్లలో వాళ్లు చేసిన అప్పులకు అసలు, వడ్డీ కలిపి మేం తిరిగి చెల్లించిన మొత్తం రూ. 1,53,359 కోట్లు అని పూర్తి లెక్కలు వివరించారు. అలాగే వాళ్లు చేసిన అప్పులకు చెల్లించినవి పోగా… 15 నెలల్లో మా ప్రభుత్వం చేసిన నికర అప్పు రూ.4,682 కోట్లు మాత్రమేనని చెప్పారు.

