సీఎం రేవంత్ రెడ్డి హస్తిన పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. ఈ మేరకు ఇవాళ ఆయన మంత్రి శ్రీధర్ బాబు తో కలిసి ప్రధానమంత్రి మోడీ తో సమావేశం అయ్యారు. ఈ భేటీలో భాగంగా రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల కు చట్టబద్ధత, కులగణన తో పాటు ఎస్సీ ఉపకులాల వర్గీకరణ బిల్లులపై చర్చించారు. సెకండ్ ఫేజ్లో భాగంగా మెట్రో రైల్ కారిడార్ ను నగర శివారు ప్రాంతాలకు విస్తరించేందుకు చేపడుతోన్న డీపీఆర్ న్ను ప్రధానికి సీఎం వివరించారు. అయితే, ఇప్పటికే మెట్రో రైలును శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ముచ్చర్లలోని ఫ్యూచర్ సిటీ వరకు విస్తరించేందుకు ఇప్పటికే పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించారు.

ఈ మేరకు హెచ్ఎండీఏ (HMDA), టీజీఐఐసీ (TGIIC), (హెచ్ఎంఆర్) HMR కలిసి సర్వే నిర్వహించారు. దాదాపు 22 కి.మీ మేర మెట్రో రైలు ట్రాక్ నిర్మాణం కానుంది. మూసీ పునరుజ్జీవం, ట్రిపుల్ ఆర్తో పాటు ఫ్యూచర్ సిటీకి కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం చేయాలని కోరినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా రాష్ట్రంలో పెండింగ్ ఉన్న ప్రారంభించబోయే పలు ప్రాజెక్టులకు సంబంధించి నిధులు, రాష్ట్ర విభజన చట్టం (Law of Partition)లోని వివిధ పెండింగ్ సమస్యలను చర్చించినట్లుగా సమాచారం. చివరగా ఎస్ఎల్బీసీ (SLBC)లో ఇరుక్కుపోయిన కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు కొనసాగుతోన్న రెస్క్యూ ఆపరేషన్ వివరాలు ప్రధానమంత్రి కి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఈ సమావేశంలో సీఎస్ శాంతి కుమారితో పాటు డీజీపీ జితేందర్ కూడా పాల్గొన్నారు.

