మనది గ్రామీణ భారతం. గ్రామాలతోనే దేశం బాగుపడుతుంది. అభివృద్ధి అనగానే “ట్రిలియన్ డాలర్ ఎకానమీ”, “ఫ్యూచర్ సిటీలు” వంటి ఆకర్షణీయమైన లక్ష్యాలు ముందుకు వస్తున్నాయి. అయితే, ఈ లక్ష్యాలు సాధ్యమవ్వాలంటే గ్రామాలు బలపడటం అత్యవసరం. చంద్రబాబు, రేవంత్ రెడ్డి వంటి నాయకులు రాష్ట్రాల అభివృద్ధిని ప్రపంచస్థాయి లక్ష్యంగా ఆలోచిస్తున్నా, గ్రామాలను విస్మరిస్తే అది సాధ్యం కాదనేది గుర్తుంచుకోవాలి.
భారతదేశంలో 65% జనాభా గ్రామాల్లోనే నివసిస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా ఇది 55–60% వరకు ఉంటుంది. గ్రామాలు అభివృద్ధి చెందకపోతే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం ఉండదు. వ్యవసాయం ఇంకా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పునాది. దేశ జీడీపీకి వ్యవసాయం 15–18% వరకు వాటా ఇస్తోంది, అయితే ఉపాధిలో ఇది 40% పైగా ప్రజలను ఆధారపడే విధంగా ఉంది. ఈ తేడానే గ్రామాల్లో ఆదాయ అసమానతలను స్పష్టంగా చూపిస్తోంది.
ప్రస్తుతం గ్రామాలు ఎదుర్కొంటున్న సమస్యలు గంభీరంగా ఉన్నాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, కొన్ని ప్రాంతాల్లో ఇంకా 30% కుటుంబాలకు నిరంతర తాగునీటి సౌకర్యం లేదు. గ్రామీణ ఆరోగ్య రంగంలో, ప్రతి 10,000 మందికి అవసరమైన వైద్య సిబ్బంది లోపం ఉంది. విద్యారంగంలో కూడా పరిస్థితి మెరుగుపడాల్సి ఉంది. గ్రామీణ పాఠశాలల్లో డ్రాప్ఔట్ రేటు 15–20% వరకు నమోదవుతోంది.
పారిశుధ్యం, చెత్త నిర్వహణ, పచ్చదనం వంటి అంశాల్లో కూడా ఇంకా వెనుకబాటు స్పష్టంగా కనిపిస్తోంది.
ఇక పట్టణాల అభివృద్ధి వేగంగా జరుగుతోంది. హైదరాబాద్ వంటి నగరాలు ఐటీ, సేవా రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే, గ్రామాల నుంచి పెద్దఎత్తున వలసలు రావడం వల్ల పట్టణాలపై ఒత్తిడి పెరుగుతోంది. రహదారులు, నీటి సరఫరా, నివాస సౌకర్యాలు హైదరాబాద్ లో కష్టంగా మారుతోంది. గ్రామాల్లోనే ఉపాధి అవకాశాలు పెరిగితే ఈ ఒత్తిడి తగ్గుతుంది.
గ్రామాల్లో కూలీల కొరత మరో ముఖ్య సమస్యగా మారింది. ఉచిత పథకాల విస్తరణతో పాటు, ఇతర రంగాల్లోకి వలసలు పెరగడం వల్ల వ్యవసాయంలో పని చేసే కూలీలు తగ్గుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వ్యవసాయ పనుల ఖర్చు గత ఐదేళ్లలో 25–30% వరకు పెరిగింది. రైతులు దీనివల్ల తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చే విధానాలు అవసరం.
మరి పరిష్కారాలేంటి? గ్రామాలను అభివృద్ధి యూనిట్గా తీసుకుని ప్రణాళికలు రూపొందించాలి. ప్రతి గ్రామానికి 100% తాగునీటి సరఫరా, 24 గంటల విద్యుత్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నాణ్యమైన పాఠశాల వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. వ్యవసాయాన్ని ఆధునీకరించాలి. డ్రిప్ ఇరిగేషన్, యాంత్రీకరణ, నిల్వ సదుపాయాలు వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వ్యవసాయ ఆధారిత చిన్న పరిశ్రమలను ప్రోత్సహించాలి. అగ్రో-ప్రాసెసింగ్ యూనిట్లు గ్రామాల్లో ఏర్పడితే రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది.
యువతను గ్రామాల్లోనే ఉండేట్ల చేయడం అత్యంత కీలకం. ప్రస్తుతం గ్రామీణ యువతలో నిరుద్యోగం 10–12% వరకు ఉంది. స్కిల్ డెవలప్మెంట్, స్టార్టప్ ప్రోత్సాహకాలు, డిజిటల్ కనెక్టివిటీ వంటి చర్యలు తీసుకుంటే ఈ పరిస్థితి మారుతుంది. గ్రామాల్లో ఇంటర్నెట్, ఈ-కామర్స్ అవకాశాలు పెరిగితే కొత్త వ్యాపారాలు పుట్టుకొస్తాయి.
ఇక ప్రజల భాగస్వామ్యం కూడా అంతే ముఖ్యం. “నా గ్రామాన్ని నేనే అభివృద్ధి చేస్తాను” అనే భావన పెంపొందించాలి. సర్పంచ్లు, స్థానిక సంస్థలు బలోపేతం కావాలి. ప్రస్తుతం పంచాయతీలకు వచ్చే నిధుల్లో చాలా భాగం పరిమిత అవసరాలకు మాత్రమే వినియోగం అవుతోంది. వీటిని సృజనాత్మకంగా ఉపయోగిస్తే గ్రామాల్లో పెద్ద మార్పులు తీసుకురాగలవు.
నిధుల వినియోగంలో కూడా ప్రాధాన్యతలు మారాలి. వేల కోట్లు ఖర్చు చేసే అనవసర పథకాల కంటే, గ్రామీణ మౌలిక వసతులపై పెట్టుబడులు పెట్టడం ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది. ఒక అంచనా ప్రకారం, గ్రామాల్లో మౌలిక సదుపాయాలపై పెట్టిన ప్రతి రూ.1 పెట్టుబడి, దీర్ఘకాలంలో రూ.2–రూ.3 వరకు ఆర్థిక లాభాన్ని తీసుకువస్తుంది.
గ్రామాలు బలపడితేనే రాష్ట్రం బలపడుతుంది. వ్యవసాయం, చిన్న పరిశ్రమలు, సేవా రంగం వంటివన్నీ సమన్వయంతో సాగితేనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది. నాయకులు గ్రామాలను అభివృద్ధి కేంద్రంగా తీసుకుని కార్యాచరణ చేపడితే, 2047 నాటికి భారతదేశాన్ని శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టే లక్ష్యం సాధ్యమవుతుంది.

