JUBILEE HILLS|జూబ్లీ గెలిస్తే సాధ్యమేనా?
క్లియర్ మెజార్టీలో కాంగ్రెస్|CONGRESS
10 MLAS|పది మంది జంప్ జలానీలు
గండికొట్టిన సొంత ఎమ్మెల్యేలు
BRS|బీఆర్ఎస్ సమీకరణాలేంటి?
KTR|కేటీఆర్ వ్యాఖ్యల మర్మమేంటి?
‘జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ గెలిస్తే, అది కేవలం ఒక ఉప ఎన్నిక విజయం మాత్రమే కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులకు దారితీసి, అధికార మార్పిడి జరుగుతుంద’ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఒక్క జూబ్లీని గెలిస్తేనే అధికార మార్పిడి సాధ్యమేనా? అధికార మార్పిడికి ప్రమాణాలేంటి? సంకేతాలేంటి? అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీయే మారడమా? లేక సీఎం మారడమా? ఆ స్థాయి మార్పులు నిజంగానే వస్తాయా? ఆ అవకాశాలున్నాయా? కేటీఆర్ అలా ఎందుకన్నారు? ఆయన వద్ద ఉన్న సమాచారమేంటి? సమీకరణలేంటి? ‘అడుగు’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
హైదరాబాద్, నవంబర్ 1 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
నిజంగానే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలుపు, తెలంగాణలో రాజకీయాల్లో అధికార మార్పిడికి సంకేతమా? రాష్ట్ర జనాభాలో ఒక వంతు ప్రజలు హైదరాబాద్ లో ఉంటారు. వాళ్ళంతా మన రాష్ట్రం నలుమూలల నుండేగాక, దేశంలోని ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు చెందినవాళ్ళు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మినీ ఇండియా అన్న మాట. ఇక జూబ్లీ హిల్స్ విషయానికి వస్తే, బీసీలు, ముస్లింలు సగానికిపైగా అత్యధికంగా ఉండగా, ప్రభావిత సామాజిక వర్గాలుగా ఆంధ్రా, కమ్మ, ఎస్సీలున్నారు. మాస్, క్లాస్ కలగలుపు నియోజకవర్గం.
అయితే, ఒక్క జూబ్లీ ఉప ఎన్నిక రాష్ట్ర రాజకీయాలను, అధికారాన్ని శాసిస్తుందా? అన్నదే ఆసక్తి గొలిపే అంశం. ఒక్క హైదరాబాదే మొత్తం రాష్ట్ర రాజకీయాలను శాసించలేదు కానీ, ప్రభావితం చేయగలదు. తాజా ఉప ఎన్నికను ఆ తరహా సంకేతాలు పంపేవిధంగా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. పరిపాలనలో సమస్యలు, ప్రజల్లో అసంతృప్తి, కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో అంతర్గత విభేదాలు కలగలిసి ప్రజానీకంలో అస్థిరతను సృష్టిస్తున్నాయని ఒక విశ్లేషణ. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ విజయం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక పెద్ద సవాల్ గా నిలిచింది. హెచ్చరికగా మారే అవకాశముంది.
జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ జరిగిన అభివృద్ధి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, మౌలిక సదుపాయాల పెంపు వంటివి నగర ఓటర్లలో ఆ పార్టీకి ఇప్పటికీ ఒక స్థిరమైన సానుభూతి ఉందని కేటీఆర్, బీఆర్ఎస్ భావిస్తున్నది. దీంతోపాటు, గోపీనాథ్ మరణం, సునీత అభ్యర్థిత్వం సానుభూతి తమను విజయ తీరాలకు చేరుస్తుందని ఆ పార్టీ నమ్మిక.
ఈ ఉప ఎన్నికను బీఆర్ఎస్ గెలిస్తే, కేవలం నగర పరిధిలోని ఓటర్ల మద్దతు గెలుచుకోవడమే కాక, అది గ్రామీణ ప్రాంతాలకు కూడా బలమైన సంకేతమవుతుందని గులాబీల భావన. గత ఎంపీ ఎన్నికల్లో చతికిల పడినప్పటికీ, ఆ పది మంది ఎమ్మెల్యేల ఫిరాయింపులు మినహా, బీఆర్ఎస్ కేడర్ ఇప్పటికీ దాదాపు అలాగే ఉంది. జూబ్లీహిల్స్ విజయం ద్వారా కేసీఆర్ నేతృత్వానికి మళ్లీ కొత్త ఊపిరి లభిస్తుంది. దీనివల్ల జిల్లా, మండల స్థాయిలో ఉన్న నేతలు తిరిగి చురుకుగా మారి, కాంగ్రెస్ లోని అంతర్గత అసమ్మతిని తమకనుకూలంగా మలుచుకునే అవకాశం బీఆర్ఎస్ కి లభిస్తుందని కూడా గులాబీ పార్టీ ఆలోచిస్తోంది.
బీఆర్ఎస్ గెలిస్తే కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు ముదురుతాయి. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంపై అసంతృప్తి స్వరాలు పెరుగుతాయి. అధికారంలో ఉండీ ఓడిపోవడంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతాయి. దాంతో సీనియర్ నాయకులు పార్టీ వ్యూహాలను ప్రశ్నించే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ లో రాజకీయ అస్థిరత ఏర్పడి, కాంగ్రెస్ జాతీయ నేతల దృష్టి తెలంగాణపై మళ్ళుతుంది. ఫలితంగా, రేవంత్ రెడ్డి నాయకత్వంపై పునరాలోచన జరిగి, పార్టీ, ప్రభుత్వ పునర్వ్యవస్థీకరణ జరగడం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చు. ఇది, దీర్ఘకాలంలో రాష్ట్ర రాజకీయ దశ, దిశను పూర్తిగా మార్చే అవకాశం కలిగిస్తుందని బీఆర్ఎస్ తలపోస్తోంది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బీజేపీ కూడా జాగ్రత్తగా గమనిస్తోంది. బీఆర్ఎస్ గెలిస్తే, కాంగ్రెస్ బలహీన పడుతుందని అనుకుంటోంది. ఇది బీజేపీకి భవిష్యత్ ఎన్నికల వ్యూహాల్లో తమకు అనుకూలంగా, అవసరమైతే బీఆర్ఎస్ తో సర్దుబాటుకు మార్గం సుగమం చేస్తుందని బీజేపీ ఆలోచనగా ఉంది. బీఆర్ఎస్ మళ్లీ బలపడితే, తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా బీజేపీ కన్నా బీఆర్ఎస్ నే ప్రజలు గుర్తించే అవకాశం ఉంటుంది. అదే సమయంలో బీజేపీకి మరో సవాల్ ఎదురయ్యే అవకాశం ఉంది. నగర ఓటర్లు బీఆర్ఎస్ వైపు మొగ్గితే, ఇప్పటి నగరంలోనే కాస్త బలంగా పుంజుకుంటున్న బీజేపీ జాతీయ పార్టీగా తన పట్టును కోల్పోవచ్చు.
నిజానికి ఒక జూబ్లీ ఉప ఎన్నిక ఫలితాల్లో గెలుపోటములకు సంబంధించి ఇవన్నీ ఊహాత్మక అంశాలే. అలా జరగనూ వచ్చు. జరగకపోవనూ వచ్చు. కానీ ఏదైనా జరిగే అవకాశాలను మాత్రం పూర్తిగా కొట్టిపారేయలేం. అయితే, కాంగ్రెస్ ఓడితే అది ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి, వ్యతిరేకతగా ప్రచారం జరుగుతుంది. లేదంటే బీఆర్ఎస్, బీజేపీలు చేస్తాయి. ఈ ఎన్నికల ఫలితం రానున్న స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.
అందుకే కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తమ శక్తివంచన లేకుండా గెలుపు కోసం పని చేస్తున్నాయి. బీజేపీ మాత్రం గెలుపోటములతో సంబంధం లేకుండా, ఆ ఫలితాలను తమకు అనుకూలంగా మార్చుకోవడం ఎలా? అని ఈ ఎన్నికను ప్రేక్షకపాత్రలో చూస్తోంది. అందువల్ల, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బీఆర్ఎస్ కి సజీవ, పునరుజ్జీవ పరీక్ష అయితే, కాంగ్రెస్ కిది అధికార స్థిరత్వం కోసం పోరాటం.

