BC RISERVATIONS| బీసీ రిజర్వేషన్లపై BRS| బీఆర్ఎస్ లో భిన్నాభిప్రాయాలు!
ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్న బీఆర్ఎస్
మా వల్లే వచ్చిందంటూ సానుకూలంగా కవిత|KAVITHA KALVAKUNTLA
రంగులు చల్లుకుని సెలబ్రేట్ చేసిన తెలంగాణ జాగ్రుతి| TELANGANA JAGRUTHI
KAMAREDDY DECLERATION| కామారెడ్డి డిక్లరేషన్ అమలు కావాల్సిందేనంటున్న గులాబీలు
CONFUSION| కన్ఫ్యూజనా? క్లారిటీ మిస్సా? కన్విన్సింగా? కన్నింగా?
ఏది నమ్మాలో తెలియని అయోమయంలో పార్టీ శ్రేణులు
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలపడం బీఆర్ఎస్ లో చిచ్చు పెట్టిందా? రిజర్వేషన్లకు అనుకూలంగా వెళ్ళడమా? కాంగ్రెస్ నిర్ణయం కాబట్టి వ్యతిరేకించడమా? అన్న అంశంలో బీఆర్ఎస్ క్లారిటీ మిస్ అయిందా? కేసీఆర్ ఫ్యామిలీ కన్ఫ్యూజన్ లో పడిందా? కన్వీన్స్ కాలేక కన్నింగ్ కు పాల్పడుతోందా? ‘బీసీ రిజర్వేషన్లు బీసీలకు ద్రోహం చేయడమే, బీసీ రిజర్వేషన్లను బీఆర్ఎస్ పార్టీగా ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్నామ’ని శాసనమండలిలో ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ప్రకటించారు. ఆ పార్టీ నేతలు మరికొందరు ‘కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయాల్సిందే’నన్నారు. కానీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు, ఆ పార్టీ నేత, తెలంగాణ జాగ్రుతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాత్రం, ‘మేం ఒత్తిడి పెంచిన క్రమంలో వచ్చిన ఈ రిజర్వేషన్ల ప్రకటన కచ్చితంగా విజయంగానే భావిస్తున్నాం. ఆర్డినెన్స్ ఇస్తామని చెప్పినారు కాబట్టి మేం తలపెట్టిన రైల్ రోకోను కూడా నిరవధికంగా వాయిదా వేస్తున్నామ’ని ప్రకటించారు. ఈ రెండు ప్రకటనలూ బీఆర్ఎస్ నేతలు చేసినవేగాక, సమర్ధించినది కేసీఆర్ కూతురు, కేటీఆర్ చెల్లెలు కాగా, వ్యతిరేకించినది కేసీఆర్, కేటీఆర్ ల సూచనల మేరకు శాసన మండలిలో ప్రధాన ప్రతిపక్ష నేత. ఇద్దరూ ముఖ్య నేతలే వేర్వేరుగా విభిన్న ప్రకటనలు చేయడం వల్ల పార్టీ శ్రేణుల్లో కన్ఫ్యూజన్ మొదలైంది. ఇందులో ఏది నిజం? ఏది అబద్ధం? ఎవరిని ఫాలో కావాలో అర్థంగాని అయోమయంలో గులాబీలు పడ్డారు. కావాలనే ఇదంతా అనుకుంటున్న వారూ ఉన్నారు. ఫలితాలెలా ఉన్నా, దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికే ఇలా రెండు నాల్కల ధోరణలు అని మరికొందరు గొణుక్కుంటున్నారు. అదేంలేదు ఇదంతా సీఎం రేవంత్ ఎత్తులో చిత్తైన కల్వకుంట్ల ఫ్యామిలీ మైండ్ బ్లాంక్ అయిపోయి.. ఇలా అంటూ చెవులు కొరుక్కుంటున్నారు మరికొందరు. ఏమైనా పార్టీ శ్రేణులు మాత్రం ఓ క్లారిటీకి రాలేకపోతున్నారు.
హైదరాబాద్, జులై 11 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోదం తెలపడం బీఆర్ఎస్ ను గందరగోళంలో పడేసిందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఆ పార్టీలో ప్రధాన నేతలు ఒకరు అనుకూలంగా, మరికొరు ప్రతి కూలంగా పరస్పరం భిన్నమైన ప్రకటనలు చేయడంతో పార్టీ శ్రేణులు కన్ఫ్యూజన్ లో పడ్డాయి. బీసీ రిజర్వేషన్లను బీఆర్ఎస్ ముక్త కంఠంతో వ్యతిరేకిస్తుందని, తమ ఒత్తిడి మేరకు సాధించిన విజయంగా భావిస్తున్నామన్న ఆ రెండు ప్రకటనలు బీసీలకు 42శాతం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తున్నట్లా? సానుకూలంగా ఉన్నట్లా? అన్నది తేలడం లేదు. ఒకే పార్టీలో భిన్న వాదనలను అర్థం చేసుకోవచ్చు. కానీ, పార్టీలో ప్రధాన నేతలే ఇలా ఎందుకు క్లారిటీ మిస్ అయ్యారు. ఆ కన్ ఫ్యూజన్ పార్టీ నాయకత్వంలోనూ ఉందా? పార్టీ అధినేత కూతురు, వర్కింగ్ ప్రెసిడెంట్ చెల్లెలు తెలంగాణ జాగ్రుతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అనుకూల అభిప్రాయం వ్యక్తం చేయడం మరింత గందరగోళానికి దారితీసి, అసలుకే ఎసరు పెట్టేలా కనిపిస్తోందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. బయటకు కనిపిస్తున్నట్లు పార్టీలో, కల్వకుంట్ల ఫ్యామిలీలో వేర్వేరు కుంపట్లకు ఇది పరాకాష్టా? లేక అంతర్గతంగా అంతా ఒక్కటే కానీ, బయటకు మాత్రం వేర్వేరుగా ప్రకటిస్తున్నారా? తండ్రిని దేవుడిగా చూసే కవిత కేసీఆర్ ని, ఆయన నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీకి సానుకూలంగా లేకపోయినా సరే, వ్యతిరేకిస్తారనుకోలేం. కానీ, పార్టీ నిర్ణయానికి వ్యతిరేకమైన ప్రకటన ఆమె నోటి నుండి రావడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పైగా రేపు ఈ అంశంపై ఎలా ప్రతిస్పందించాలి? అన్న మీమాంసలో గులాబీలు పడ్డారు.
అయితే, బీఆర్ఎస్ పార్టీ కంటే ముందే, ఎన్నికలకు ముందే అంటే 2023 నవంబర్ 10న కాంగ్రెస్ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. అది అంత ఈజీ కాదని భావించిన కవిత ఈలోగా బీసీ రిజర్వేషన్ల సాధనకు పోరాటాన్ని ప్రారంభించారు. పోరాటాల సమాయత్తం జరుగుతున్న దశలోనే సీఎం రేవంత్ బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో పాస్ చేసి, కేంద్రానికి పంపించారు. అది ఆలస్యమయ్యే పరిస్థితి కనిపించడంతో మరోవైపు స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లకు కేబినెట్ ద్వారా ఆమోదం తీసుకున్నారు. ఆర్డినెన్స్ విడుదలకు సిద్ధమయ్యారు. దీంతో బీఆర్ఎస్ నాయకత్వం కన్ఫ్యూజన్ లో పడింది. సమర్ధించడం సాధ్యం కాదు కాబట్టి, ఈ కేబినెట్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే బీసీల రిజర్వేషన్లను వ్యతిరేకించినట్లు, కాంగ్రెస్ పార్టీ నిర్ణయంగా వ్యతిరేకించినా బీసీల నుంచి వ్యతిరేకతే వస్తుంది. అందుకని కామారెడ్డి డిక్లరేషన్ కు పట్టుపట్టాలని బీఆర్ఎస్ నాయకత్వం భావిస్తున్నట్లుంది. ఒక్కదెబ్బకు రెండు పిట్టల్లా స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడమేగాక, బీఆర్ఎస్ నోరు మూయించే పనికి సీఎం పూనుకున్నారు. దీంతో కుడితో పడ్డ ఎలకలా బీఆర్ఎస్ పరిస్థితి మారిపోయిందని తల పండిన రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. ఏమైనా మొన్న రైతుకు సాయంపై చర్చకు ఏకంగా ఫాం హౌస్ కే వస్తానని కేసీఆర్ కే షాకిచ్చిన సీఎం, నిన్న స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోదంతో కేసీఆర్ ఫ్యామిలీకి, బీఆర్ఎస్ కీ మరో షాక్ ఇచ్చినట్లయిందని రాజకీయ పరిశీలకులు చర్చిస్తున్నారు. మరి ఈ అంశంలో కేసీఆర్ ఫ్యామిలీ, బీఆర్ఎస్ ఏం చేయనుంది? చూడాలి మరి.
బీసీలకు ద్రోహం!
బీసీ రిజర్వేషన్లను ప్రభుత్వం తూతూ మంత్రంగా చేస్తోంది. బీసీలకు ద్రోహం చేసే దుర్మార్గంగా కాంగ్రెస్ పార్టీ వైఖరి కనిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీగా ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాం. మీరిచ్చిన హామీని అమలు చేయమంటున్నాం.

-సిరికొండ మధుసూదనాచారి, శాసన మండలి (బీఆర్ఎస్) ప్రతిపక్షనేత
విజయంగా భావిస్తున్నాం!
మేం ఒత్తిడి పెంచిన క్రమంలో వచ్చిన ఈ రిజర్వేషన్ల ప్రకటన కచ్చితంగా విజయంగానే భావిస్తున్నాం. ఆర్డినెన్స్ ఇస్తామని చెప్పినారు కాబట్టి మేం తలపెట్టిన రైల్ రోకోను కూడా నిరవధికంగా వాయిదా వేస్తున్నాం.


