అజ్ఞాతం వీడినా, అంతు చిక్కని ఆచూకీ
జనజీవన స్రవంతిలో కలిసినా జనంలోకి రాలే
వారం గడిచినా ఊరు, వాడ, కడప తొక్కలే
కనిపించినా, కనిపించకుండా పోయింది
కొత్త జీవితమా? పాత నరకమా?
GOVERNMENT|సర్కార్ గోప్యతా? POLICE|పోలీసుల భద్రతా?
శాంతికి సానుకూలమా? అశాంతికి అనుకూలమా?
ప్రభుత్వం, పోలీసులు వెంటనే సమాధానం చెప్పాలి
స్పష్టత కోసం ఎదురు చూస్తున్న రక్తసంబంధీకులు
మాజీ మావోయిస్టును చూపించండి: గ్రామస్థులు
పోరుబాట వీడి, జనంబాట పట్టిన POTHULA PADMA|పోతుల పద్మ ఎక్కడ?
45 ఏళ్ళ అజ్ఞాతవాసం ఆమెకు తిరిగి అజ్ఞాతవాసాన్నే మిగిల్చింది. అలుపెరుగని పోరాటంలో కుంగిపోకుండా, ఆమె లొంగిపోయినా… వన జీవనాన్ని వదిలి, జన జీవన స్రవంతిలో కలిసినా, ఆమె ఇంకా జన జీవనంలోకే రాలే! ఆమె లొంగిపోయి వారం గడిచినా… ఊరు, వాడ, కడప తొక్కలే!! ఇంత కాలంగా అగుపించని ఆమె కనిపించినా, ఎక్కడా కనిపించకుండా పోయింది. సమసమాజం కోసం, ఉరిమే ఉప్పెనైన ఆమె కోసం, ఊరుకు ఊరే ఎదురుచూస్తున్నది. రక్త సంబంధీకులు, బంధువులు ఆమె రాక కోసం నిలువెల్లా కనులై కాచుక్కూచుకున్నారు. కొత్త జీవితమా? పాత నరకమా? ఇది సర్కార్ గోప్యతా? పోలీసుల భద్రతా? ఈ అజ్ఞాతంలోంచి… అజ్ఞాతం దేనికి సంకేతం? శాంతికి సానుకూలమా? అశాంతికి అనుకూలమా? ప్రభుత్వం, పోలీసులు వెంటనే సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలను పోతుల పద్మ అలియాస్ సుజాతక్క అలియాస్ కల్పన సొంతూరు, జోగులాంబ గద్వాల జిల్లా, గట్టు మండలం, పెంచికలపాడు సంధిస్తోంది. తమ అనుమానాలను పటాపంచలు చేయాలని ఊరు, వాడా, కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. బరువెక్కిన గుండెలతో డిమాండ్ చేస్తున్నారు

గద్వాల, సెప్టెంబర్ 18 (అడుగు న్యూస్):
జోగులాంబ గద్వాల జిల్లా, గట్టు మండలం, పెంచికలపాడు గ్రామానికి చెందిన పోతుల పద్మ అలియాస్ సుజాతక్క అలియాస్ కల్పన ఇటీవల అజ్ఞాతవాసం వీడి తెలంగాణ డీజీపీ జితేందర్ ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. నాలుగున్నర దశాబ్దాల క్రితం అడవిబాట పట్టిన పద్మ, మావోయిస్టు ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించి పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలిగా ఎదిగారు. ఆమెపై ప్రభుత్వం ప్రకటించిన రూ.25 లక్షల రివార్డుతో పాటు, వందలాది కేసులు కూడా నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 13, 2025న డీజీపీ ఎదుట ఆమె అధికారికంగా లొంగిపోయినట్టు ప్రకటించగా, రాష్ట్రవ్యాప్తంగా ఇది పెద్ద చర్చనీయాంశమైంది.
అయితే లొంగిపోయి వారం రోజులు దాటినా పద్మ ఎక్కడ ఉన్నారన్న దానిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లభించకపోవడం కుటుంబ సభ్యుల్లో, గ్రామస్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఆమె లొంగిపోయిన వెంటనే స్వగ్రామానికి వస్తారని కుటుంబ సభ్యులు భావించినా ఇప్పటి వరకు ఇంటికి రాకపోవడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గ్రామంలోని ప్రజలు కూడా పద్మ మళ్లీ తమ ఊరికే వస్తారని భావించి ఆనందపడ్డారు. టీవీ చానల్స్, పత్రికలలో లొంగిపోయిన వార్తలు రావడంతో సంతోషించిన ఆమె బంధువులు, ఇప్పుడు ఆచూకీ తెలియక ఆవేదన చెందుతున్నారు.
45 ఏళ్ల క్రితం పద్మ గ్రామం విడిచి వెళ్లడంతో కుటుంబ సభ్యులు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఏదో ఒక రోజు తిరిగి వస్తుందని ఆశతో ఎదురుచూస్తూ ఉన్నారు. ఇప్పుడు లొంగిపోయిందనే వార్త విన్నప్పుడు వారు ఆనందబాష్పాలు రాల్చారు. కానీ వారం రోజులుగా ఆమె ఎక్కడ ఉన్నారన్న విషయంపై స్పష్టత లేకపోవడంతో గురువారం కుటుంబ సభ్యులు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. పద్మను తమకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ నేపథ్యంలో తహసీల్దార్ రాజు స్వయంగా పెంచికలపాడు గ్రామానికి చేరుకుని గ్రామస్తులతో, కుటుంబ సభ్యులతో మాట్లాడారు. గ్రామ పెద్దలు, పద్మ సోదరులతో సమావేశమై వివరాలు సేకరించారు. పంచానామా కూడా నిర్వహించారు. వారి వెంట వీఏఓ రంగన్న, సిబ్బంది గోపాల్, పరశురాములు, వడ్ల భీమప్ప, జంగిటి సుంకన్న, దెయ్యం చౌడప్ప, వుల్లి గోవిందు, గాజుల గంగప్ప, నర్సింహులు, గోవిందు తదితరులు వున్నారు. ఈ సందర్భంగా ముక్త కంఠంతో పద్మను గ్రామానికి తీసుకురావాలని అధికారులను కోరారు.
పోతుల పద్మ అలియాస్ సుజాతక్క అలియాస్ కల్పన లొంగుబాటు కీలకాంశం. ఇప్పుడామె భవిష్యత్తు ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపై, పోలీసుల చర్యలపై ఆధారపడి ఉంటాయి. ప్రభుత్వం పునరావాసం పేరుతో లొంగిపోయిన మావోయిస్టులకు కొత్త జీవితాన్ని కల్పిస్తుందని ప్రకటించినా, పద్మ లొంగుబాటు తర్వాత ఆమె ఆచూకీ రహస్యంగా ఉంచడంపై చర్చలు సాగుతున్నాయి. లొంగిపోయిన వారిని భద్రతా కారణాల దృష్ట్యా రహస్యంగా ఉంచడం సాధారణమే అయినప్పటికీ, ఆమె కుటుంబానికి ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం అసంతృప్తికి, మరిన్ని అనుమానాలకు దారితీస్తోంది.
గ్రామస్తులు మాట్లాడుతూ, ‘నాలుగు దశాబ్దాలుగా ఆమె కోసం ఎదురుచూస్తున్నాం. ఇప్పుడు లొంగిపోయింది అంటే మళ్లీ మా ఊరికి వస్తుందని భావించాం. కానీ ఎక్కడ ఉందన్న విషయం తెలియకపోవడంతో ఆందోళన చెందుతున్నాం. కనీసం అధికారుల ద్వారా అయినా ఆమెను ఒకసారి కలిసే అవకాశం కల్పించాల’ని డిమాండ్ చేస్తున్నారు.
లొంగుబాటు తర్వాత పద్మ కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. 40 ఏళ్లకు పైగా అడవిలో గడిపిన ఒక మావోయిస్టు నేత లొంగిపోవడం ఒక వైపు శాంతి ప్రక్రియకు అనుకూల పరిణామంగా భావిస్తుండగా, మరో వైపు ఆమెను స్వగ్రామానికి రానివ్వకపోవడం తిరిగి ఆశాంతికి దారి తీస్తాయా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భద్రతా కారణాల వల్లనే ఈ చర్యలు తీసుకుంటున్నారని అధికార వర్గాలు అంటున్నప్పటికీ, పద్మ కుటుంబం మాత్రం తమ కుటుంబసభ్యురాలిని వెంటనే తమకు అప్పగించాలని పట్టుబడుతోంది.
మొత్తం మీద పోతుల పద్మ లొంగిపోవడం రాష్ట్రంలో పెద్ద సానుకూల పరిణామంగా నిలిచినప్పటికీ, ఆమె ఆచూకీపై అధికారుల గోప్యత ఇప్పుడు కుటుంబ సభ్యులకు ఆవేదనగా, గ్రామస్తులకు ఆందోళనగా మారింది. త్వరలోనే ప్రభుత్వం ఈ విషయంపై స్పష్టతనివ్వాలని, ఆమెను స్వగ్రామంలో కుటుంబ సభ్యులను కలిసేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

