పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో సభాధ్యక్షుడి స్థానం అత్యంత గౌరవనీయమైంది. బాధ్యతతో కూడింది. అసెంబ్లీ అయినా, పార్లమెంట్ అయినా సభను నడిపే వ్యక్తి వ్యవహారశైలి మొత్తం ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రతిష్ఠను ప్రతిబింబిస్తుంది. అందుకే స్పీకర్ నిష్పక్షపాతంగా, సమవర్తిగా ఉండాలంటారు. సభలో అర్థవంతమైన, సమర్థవంతమైన చర్చలు సాగాలంటే, అధికార, విపక్షాలకు సమాన అవకాశాలు లభించాలంటే స్పీకర్ పాత్ర కీలకం.
భారత పార్లమెంటరీ చరిత్రలో పలువురు స్పీకర్లు తమ నిష్పక్షపాత వైఖరితో సభాధ్యక్ష స్థానానికి వన్నె తెచ్చారు. అందులో మొదటివారు, భారత మొట్టమొదటి స్పీకర్ జీ.వీ. మావలంకర్. పార్లమెంటరీ సంప్రదాయాలకు బలమైన పునాది వేశారు. ప్రశ్నోత్తరాలు, చర్చల నిర్వహణలో క్రమశిక్షణ, స్పీకర్ నిష్పాక్షికతకు ఉన్నత ప్రమాణాలు నెలకొల్పారు. అందుకే ఆయనను “ఫాదర్ ఆఫ్ ది లోక్సభ”గా పిలుస్తారు. ఆ తర్వాత కాలంలో నీలం సంజీవరెడ్డి, బాలరాం జాఖడ్, శివరాజ్ పాటిల్, పీ.ఏ. సంగ్మా, సోమనాథ్ చటర్జీ వంటి అనేక మంది స్పీకర్లు ఆ ఒరవడిని కొనసాగించారు.
కానీ, ఇటీవల పార్లమెంట్ సమావేశాల నిర్వహణపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశాలే రావడం లేదని, వచ్చినా సభ్యుల మైక్లు కట్ చస్తున్నారని, ప్రశ్నోత్తరాలకే పరిమితమవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధాన సమస్యలపై సమగ్ర చర్చలు జరగడంలేదనే భావన బలపడుతోంది. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నా, వాటి సారాంశం ప్రజలకు చేరడం లేదనే విమర్శలూ ఉన్నాయి.
లోక్సభ ప్రస్తుత స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడం కూడా ఈ అసంతృప్తిలో భాగమే. ఇండియా కూటమికి చెందిన 118 మంది ఎంపీలు సంతకం చేసిన ఈ నోటీసు రాజకీయంగా ప్రాధాన్యమైన పరిణామమే. సభలో మాట్లాడేందుకు అవకాశాలు కల్పించడం లేదని విపక్షాల వాదన. అయితే, అధికార పక్షం మాత్రం సభా నియమాల ప్రకారమే వ్యవహరిస్తున్నామని చెబుతోంది. బలాబలాల పరంగా అధికార పక్షానికి స్పష్టమైన మెజారిటీ ఉంది. కాబట్టి అవిశ్వాసం ఆమోదం పొందే అవకాశాలే లేవు. కానీ, ఈ పరిణామం రాజకీయ చర్చకు దారితీసింది.
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని మాట్లాడనివ్వడం లేదని, ఎనిమిది మంది సభ్యుల సస్పెన్షన్, కాంగ్రెస్ మహిళా ఎంపీల నుంచి ప్రధాని మోదీకి ప్రమాదం పొంచి ఉందని స్పీకర్ సభలోనే ప్రకటించడం వివాదాస్పదమైంది. రాష్ట్రపతి ప్రసంగం, బడ్జెట్ సమావేశాలు వంటి సందర్భాలు ప్రభుత్వ విధానాలను సమీక్షించేందుకు, విమర్శించేందుకు, అత్యంత అనుకూలమైన వేదికలు. ఇలాంటి సందర్భాల్లో చర్చలకు ఆస్కారం లేకుండా అవరోధాలు ఏర్పడితే వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత స్పీకర్ దే.
సభలో క్రమశిక్షణ ఆవశ్యం. నిరంతర ఆందోళనలు, నినాదాలు, పోడియం వద్ద నిరసనలు సభా గౌరవాన్ని తగ్గిస్తాయి. కానీ, వాటి వెనుక ఉన్న అసంతృప్తిని కూడా నిర్లక్ష్యం చేయలేం. చర్చలకు సరైన అవకాశాలు లభిస్తే, ఆందోళనల అవసరం తగ్గుతుంది. ప్రభుత్వం తన విధానాలపై విమర్శలను స్వీకరించి సమాధానం చెప్పగలగాలి. అదే ప్రజాస్వామ్య బలం.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో సమ న్యాయం, సమన్వయం అవసరం. ఇది సంకీర్ణాల సమయం. పరస్పర సహకార రాజకీయాల సందర్భం. ప్రస్తుతం కేంద్రంలో ప్రభుత్వం ఎన్డీఏ మిత్రపక్షాల మద్దతుతో కొనసాగుతోంది. ప్రతిపక్షాలను పూర్తిగా పక్కన పెట్టే ధోరణి, అధికార పక్షానికి మేలు చేయదు. పార్లమెంట్ కేవలం అధికార పార్టీ అందలం కాదు, అది దేశ ప్రజల ప్రజాప్రతినిధుల సమిష్టి వేదిక. ఇటువంటి సమయాల్లోనే స్పీకర్ పాత్ర మరింత ప్రాముఖ్యంగా మారుతుంది. స్పీకర్ నిర్ణయాలు నిష్పాక్షికంగా ఉండాలి. చర్చల్లోనే ప్రజాస్వామ్యం ప్రాణం ఉంది.
పార్లమెంట్ సమావేశాలు సకల ఆలోచనల సంగమం కావాలి. ప్రభుత్వం తన విజయాలను వివరించుకోవాలి. ప్రతిపక్షం తన విమర్శలను వినిపించాలి. స్పీకర్ ఈ రెండింటినీ సమన్వయం చేయాలి. స్పీకర్ సమవర్తిత్వమే సభ గౌరవానికి మూలాధారం. అర్థవంతమైన చర్చలకు మార్గం సుగమం చేసినప్పుడే పార్లమెంట్ సమావేశాలకు నిజమైన అర్థం లభిస్తుంది.

