‘సై’నిక ఆపరేషన్ లో వ్యోమిక, ఖురే‘షీ’లు!!
న్యూ ఢిల్లీ, మే 8 (అడుగు న్యూస్ ప్రత్యేక ప్రతినిధి):
జమ్మూ కశ్మీర్లోని ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ మెరుపు దాడి చేసింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో నిర్వహించిన ఈ దాడులపై భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాకు వివరాలు వెల్లడించారు. మిస్రీతో పాటు ఇద్దరు మహిళా అధికారులు కూడా మాట్లాడారు. భారత చరిత్రలోనే తొలిసారిగా ఇద్దరు మహిళా అధికారులు సైనిక ఆపరేషన్పై అధికారిక విలేకరుల సమావేశానికి నాయకత్వం వహించారు. ఇప్పుడు వీరిద్దరి గురించే యావత్ దేశమంతా చర్చించుకుంటోంది. ఆ ఇద్దరే కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్.
ఈ ఇద్దరు మహిళా అధికారుల వివరాలు ఆసక్తిగా ఉన్నాయి. గుజరాత్లోని వడోదరకు చెందిన ఖురేషి సోఫియా1990లో భారత సైన్యంలో చేరారు. లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్నారు. ప్రస్తుతం ఆమె సిగ్నల్ కార్ప్స్ లో సేవలందిస్తున్నారు. భారత సైన్యంలో తొలి మహిళా అధికారిణి ఖురేషి సోఫియా. 2016లో నిర్వహించిన ఎక్సర్సైజ్ ఫోర్స్ 18 అనే అంతర్జాతీయ సైనిక గ్రూపులో ఆమె భారత బలగాలకు నాయకత్వం వహించారు. అందులో పాల్గొన్న 18 దేశాల బృందాల్లో ఆమె ఒక్కరే మహిళా నాయకురాలు కావడం విశేషం. ఐక్యరాజ్యసమితి శాంతి బలగాల్లో కూడా ఆరేళ్ల పాటు సోఫియా ఖురేషి తన సేవలందించారు. 2006లో కాంగోలో జరిగిన మిషన్లో ఆమె కీలక పాత్ర పోషించారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత మీడియాలో మాట్లాడిన ఖురేషి ‘పహల్గామ్ మృతులకు న్యాయం చేసేందుకే ఈ ఆపరేషన్’ అన్నారు.
మరోవైపు వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్. ‘వ్యోమిక’ పేరుకు అర్థం ‘ఆకాశంలో నివసించేది’ లేదా ‘ఆకాశం కుమార్తె’ పేరుకు తగ్గట్లుగా ఆమె వింగ్ కమాండర్ అయింది. ఆమె నేషనల్ క్యాడెట్ కార్ప్స్ లో చేరడం ద్వారా తన లక్ష్యాన్ని సాధించి, తరువాత ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఇండియన్ నేవీలో హెలికాప్టర్ పైలట్గా నియమితులయ్యారు. డిసెంబర్ 18, 2019న ఫ్లయింగ్ బ్రాంచ్లో శాశ్వత కమిషన్ పొందారు.
వ్యోమిక 2,500 కంటే ఎక్కువ గంటలు విమాన ప్రయాణాన్ని నమోదు చేశారు. జమ్మూ కశ్మీర్, ఈశాన్య ప్రాంతాలతో సహా కొన్ని కఠినమైన భూభాగాలలో ఆమె చేతక్, చీతా వంటి హెలికాప్టర్లను నడిపింది. ఆమె బహుళ రెస్క్యూ మిషన్లలో కీలక పాత్ర పోషించింది. ఆమె నాయకత్వం వహించిన ప్రధాన మిషన్లలో ఒకటి నవంబర్ 2020లో అరుణాచల్ ప్రదేశ్లో జరిగింది. ఈ ఆపరేషన్లు అధిక ఎత్తు, క్లిష్ట వాతావరణం, మారుమూల ప్రాంతాలలో నిర్వహించారు. వింగ్ కమాండర్ సింగ్ అధిక-ధైర్య మిషన్లలో కూడా పాల్గొన్నారు. 2021లో ఆమె 21,650 అడుగుల ఎత్తులో ఉన్న మౌంట్ మణిరాంగ్కు ట్రై-సర్వీసెస్ ఆల్-ఉమెన్ పర్వతారోహణ యాత్రలో చేరారు. అటువంటి మిషన్లలో ఆమె పాల్గొనడం భారతదేశ రక్షణ సేవలలో నాయకత్వం, క్షేత్ర పాత్రలలో మహిళల ప్రమేయాన్ని ప్రతిబింబిస్తోంది. మహిళల పసుపు, కుంకుమలను తుడిచేసిన ఉగ్రవాదాన్ని అణచే ఆపరేషన్ సిందూర్ ను మహిళలే ముందుండి నడపడం మహిళలకే కాదు మనందరికీ గర్వకారణం.

