పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోదనేది సామెత. అయితే ఇది పాకిస్తాన్ విషయంలో అక్షరాలా వాస్తవం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వేళ, కలిసి ఉండలేని కుత్సిత బుద్ధి, అధికార లాలసతో పాకిస్తాన్ వేరుపడింది. ఆనాటి నుండి నేటి దాకా, అకారణంగా పాక్ పాలి పగతోనే రగిలిపోతోంది. కుయుక్తులు, కుట్రలకు, కుతంత్రాలకు పాల్పడుతోంది. ఉగ్రవాదాన్ని పెంచి, పోషించి, రక్షిస్తూ, భారత్ పైకి ఉసి గొల్పుతోంది. ఉగ్రవాదులను కాపాడుతున్నది. దాయాది తనను తాను దహించుకుంటున్నది.
ఒక్క ‘ఆపరేషన్ సిందూర్’తో పాక్ సంస్కరించలేం. ఉగ్రవాదులకు శిక్షణ ఇస్తున్న తీరును దారికి తేలేం. దాని వక్ర బుద్దిని మార్చలేము. భారత్తో పెట్టుకుంటే భవిష్యత్తే ఉండదన్న రీతిలో తగిన బుద్ధి చెప్పాలి. ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేయాలి. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్ళతో తుద ముట్టించాలి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ను సంపూర్ణంగా శాశ్వతంగా స్వాధీనం చేసుకోవాలి. మరోసారి పాక్ మన తెరువు రాకుండా చేయాలి.
పదవీ లాలస లక్ష్యంగా సాగిన నాటి సమీకరణల్లోనే ఆనాడు భారత్ నుండి విడివడింది. ఆంగ్ల వలస పాలకులు కూడా ఇదే అదనుగా దేశాన్ని అడ్డ దిడ్డంగా విభజించేసి చేతులు దులుపుకున్నారు. దేశ విభజన ఓ చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. విభజన సందర్భంగా ప్రజ్వల్లిన హింస, ఆనాటి ఊచకోతల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇలా ఊచకోతలు, బలవంతపు మత మార్పిళ్లతో ఇస్లామిక్ రాజ్యంగా అవతరించిన పాక్ ఆదినుంచీ భారత్ వ్యతిరేకతను నరనరాన జీర్ణించుకుంది. కశ్మీర్లో కొంత భాగాన్ని ఆక్రమించింది. దానిని ఆనాడే పరిష్కరించలేక పోయిన దేశ నాయకత్వం, 370 ఆర్టికల్తో కొత్త సమస్యలు తెచ్చి పెట్టింది.
ఇప్పుడు పాక్ ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి స్వాధీన పర్చుకుంటే తప్ప పాక్ కోరలు పీకలేం. భారత్ అంతర్భాగమైన కశ్మీర్తో మన అనుబంధం విడదీయలేనిది. పాకిస్తాన్ పాలకులు తమ మనుగడకోసం, రాజకీయాల కోసం మతాన్ని, కశ్మీర్ను ఉపయోగించుకుంటూనే ఉన్నారు. అంతర్జాతీయంగా యాగీ చేస్తున్నారు. పివోకెలో ఉగ్రశిబిరాలను ఏర్పాటు చేసి దాడులకు ఉసిగొల్పుతున్నారు. చివరకు ‘ఆపరేషన్ సిందూర్’లో హతమైన ఉగ్రవాదుల శవాలకు పాక్ సైనికులు సలాం కొట్టారు. అంటేనే ఆ దేశ దుర్నీతిని అర్థం చేసుకోవచ్చు. భారత దేశాన్ని శత్రువుగా, ముస్లింల వ్యతిరేకిగా చిత్రిస్తూ పబ్బం గడుపు కోవడమే పనిగా పెట్టుకుని ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్కు వైఖరిని ఏమనాలి? భారతదేశం తమకు శత్రువని పదేపదే రుజువు చేసుకుంటోంది. పాక్ సైనికాధికారులు ఎప్పుడూ భారత వ్యతిరేకతను నూరిపోస్తున్నారు. ఇటీవల పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. ‘భారత వ్యతిరేకతే పాకిస్తాన్ జాతీయ వాదం’గా ప్రజల్ని ప్రభావితం చేసేందుకు పాక్ ప్రభుత్వాలు, సైన్యం, ఇంటలిజెన్స్ సంస్థలూ నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాయి.
1971లో జరిగిన యుద్ధంతో బంగ్లాదేశ్ ఆవిర్భావం జరిగినా…పాక్ వంకర బుద్ధిని మార్చుకోలేదు. 1999లో కార్గిల్లో చొరబాటుకు పాల్పడి దెబ్బతిన్నా పాకిస్తాన్ పాలకుల మనస్తత్వం మారడంలేదు. ఉగ్రవాదులను పెంచి పోషించడంతో పాటు అబోటాబాద్లో లాడెన్కు ఆశ్రయమిచ్చి దాచి పెట్టాయి. అమెరికన్ దళాలు ఒసామాబిన్ లాడెన్ను హతమార్చిన తర్వాత కూడా పాక్ సైన్యం బుద్ధి మారడం లేదు. పొరుగు దేశాల్లో హింసాత్మక చర్యలను ప్రోత్సహించడం ద్వారా పాకిస్తాన్ తన అంతర్గత భద్రతకే ముప్పు తెచ్చుకుంటుందని తెలిసి కూడా కుక్కతోక వంకరలా వక్రబుద్ధిని మార్చుకోవడం లేదు. పాక్ బడ్జెట్లో 30శాతానికి పైగా సైన్యానికి ఖర్చుపెడుతున్నారు. విద్య, ఆరోగ్యం, సంక్షేమ రంగాల్లో నిధులు తగ్గిపోయాయి. ఆర్థిక ప్రగతి కునారిల్లింది. ఆసియాలోనే అత్యంత ఎక్కువ స్థాయిలో పెరుగుతున్న జనాభాలో దాదాపు 41 శాతం పేదరికంలో మగ్గుతున్నారు. ఆర్థిక స్థితి అత్యంత దయనీయంగా ఉంది. పక్క దేశాలు బిచ్చమేస్తే తప్ప మనుగడ కష్టమవుతున్న దశలోనూ, ఆ దేశ పాలకులు, సైన్యం తమ మనుగడకోసం మతాన్ని ఆయుధంగా వాడుకుని ప్రజల్ని మభ్యపెడుతూ, భారత్లో హింసాత్మక చర్యలకు పాల్పడుండటం అత్యంత హేయం.
పాక్ పిచ్చి పన్నాగాల ఫలితమే పహల్గామ్ ఊచకోత. పర్యాటకుల్లోని కుటుంబాల నుంచి పురుషులను వేరు చేసి, హిందువుల పేరుపెట్టి క్రూరంగా చంపిన ఘటన భారత్ పట్ల పాక్ వైఖరికి పరాకాష్ట. యావత్ భారతీయుల రక్తం మరిగేలా చేసిన దుర్ఘటన అది. అందుకే ఇప్పుడు ఆపరేషన్ సిందూర్ ని పాక్ ప్రజలపై దాడిగా చూడకూడదు. పాక్ వైఖరిపై దాడి. ఉగ్రవాదంపై భారత్ ఆగ్రహం. చర్యకు ప్రతి చర్య. పాక్ పై ప్రతీకారం కాదు పాక్ ప్రతీ చర్యపై ప్రతీకారం. సహనానికి సుదీర్ఘ పరీక్ష కూడా సరికాదు. శాంతికి కూడా ఒక హద్దు ఉంటుంది. ఉండాలి. శాంతి సహనం భారతీయ సంస్క్రుతిలో, జీవన విధానంలో ఇమిడి ఉన్నాయి. వాటిని పరీక్షించాలనుకుంటే ఇదిగో ఇలా ఈ ఆపరేషన్ సిందూర్ లాగే ఉంటుందనేది పాక్ కు తెలిసి వచ్చేట్లు చేయాలి. మరోసారి మన భూభాగంలో, మన వ్యవహారాల్లో, మన సార్వభౌమాధికారంలో వేలు పెట్టాలంటేనే కాదు మనవైపు కన్నెత్తి చూడాలన్నా వెన్నులో వణుకు పుట్టాలి. అంత భీకరంగా బుద్ధి చెప్పాలి.
పహల్గాం ఉగ్రదాడి ఉచ్చు తన చుట్టూ బిగుస్తోందని, భారత్ నుంచి ప్రతీకార దాడి తప్పదని లోలోపల పాక్ బెంబేలెత్తుతున్నా పైకి మాత్రం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శి స్తోంది. పిచ్చి ప్రేలాపనలతో రెచ్చగొడుతోంది. అన్నింటికీ సమాధానమే ఆపరేషన్ సిందూర్ అని, ఇది అంతంకాదు, ఆరంభమనేది నిజం కావాలి. రుజువు కావాలి.

