(2025 ఏప్రిల్ 7: ప్రపంచ ఆరోగ్య దినోత్సవం)
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు ఎచ్ ఓ) ఏటా ఒక ప్రాధాన్యత అంశాన్ని తీసుకొని ప్రపంచవ్యాప్తంగా చైతన్య పరచి లక్ష్య సాధనకు కృషి చేస్తున్న విషయం తెలిసిందే! 2025 సంవత్సరానికి “ఆరోగ్యకర ప్రారంభాలు: ఆశావహ భవిష్యత్తులు” (హెల్దీ బిగినింగ్స్ : హోప్ ఫుల్ ఫ్యూచర్స్) నినాదంతో మాతా శిశు ఆరోగ్యాన్ని ప్రధాన అంశంగా స్వీకరించింది. ఇందులో మహిళలకు కాన్పు ముందు, కాన్పు సమయంలో, కాన్పు తర్వాత, దీర్ఘకాలిక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, శిశు సంరక్షణ కోసం నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వాలను చైతన్య పరుస్తుంది.
మహిళలకు కాన్పు పునర్జన్మ వంటిది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ప్రపంచంలో దురదృష్టవశాత్తు సంవత్సరానికి 3 లక్షల స్త్రీలు గర్భధారణ, ప్రసవం మూలంగా ప్రాణాలు కోల్పోతున్నరు. దీనిలో భారత దేశం వాటా 18%. అదేవిధంగా 20 లక్షల పైగా శిశువులు కాన్పు సమయంలో, 20 లక్షల శిశువులు పుట్టిన నెల లోపు మరణిస్తున్నరు. ఇది చాలా విచారకరం.
భిన్న భౌగోళిక, నైసర్గిక, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక స్థితిగతులు కలిగిన సువిశాల దేశం భారత్. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన రెండవ దేశం. జనాభా నియంత్రణకు ప్రజలు సహకరించాలంటే ఉన్న వారి సంక్షేమానికి ధీమా ఉండాలె. కనుక, భారత దేశం ఆరోగ్య శాఖలో కుటుంబ సంక్షేమంను చేర్చు కొన్నది. మాతా శిశు ఆరోగ్యం (ఎం సి ఎచ్) కోసం మొదటి నుంచి ప్రణాళికా బద్ధంగా కృషి చేస్తూ వస్తున్నది. స్త్రీ శిశు సంక్షేమ శాఖ కింద 1975లో సమీకృత శిశు అభివృద్ధి సేవలు (ఐ సి డి ఎస్) ప్రారంభించింది. ఆరు సంవత్సరాల లోపు పిల్లలకు, కాబోయే తల్లులు, పాలిచ్చే తల్లులు, కిశోర బాలికలకు పోషణ అందిస్తున్నది.
మాతా శిశు ఆరోగ్యం కోసం ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ గ్రామ స్థాయి ప్రాథమిక సేవల నుంచి ప్రత్యేక వైద్యశాలల దాకా పటిష్టమైన వ్యవస్థను కలిగి ఉంది. ప్రతి అంశాన్నీ, ప్రతి సందర్భాన్ని రెప్రొడక్టివ్ అండ్ చైల్డ్ హెల్త్ పోర్టల్ లో నమోదు చేస్తున్నరు. మహిళలకు ఆర్థిక లేమి అవరోధం కాకుండా పోషకాహారం కోసం, ఇతర అవసరాలకు ప్రభుత్వం సంపూర్ణ మద్దతు అందిస్తుంది. ఆరోగ్య కార్యకర్త, నర్స్ లకు గర్భిణి సంరక్షణ, కాన్పు చేయుట, ప్రసవానంతరం తల్లీ బిడ్డల సంరక్షణ విషయంలో ఎప్పటికప్పుడు శిక్షణ ఇచ్చి వారి దక్షతను నవీకరిస్తున్నరు. నాణ్యమైన నిర్వహణ కలిగిన కాన్పు గదులు, నవజాత శిశువులకు ఒంటి వెచ్చదనం కాపాడే పెట్టెలు, ఆపత్కాలంలో 102, 108 అంబులెన్స్ సేవలు అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో అందుబాటులో ఉన్నయి. ఆశా కార్యకర్త నుండి స్త్రీ, పిల్లల వైద్య నిపుణులు వరకు సేవలు అందిస్తున్నరు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ డివిజనల్, జిల్లా కేంద్ర వైద్యశాలలు, బోధనా వైద్యశాలలు, ప్రభుత్వ రంగ ఇతర వైద్యశాలలు అన్నింటిలో ప్రసవ సేవలు లభిస్తున్నయి. మాతా శిశు సంరక్షణ కేంద్రాలు, ప్రసూతి వైద్యశాలలు పనిచేస్తున్నయి. దేశంలోని 1054 ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ విభాగాలు (ఎస్ ఎన్ సి యు) పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా లేని యెడల వారి ప్రాణాలు కాపాడుతున్నయి. బిడ్డను కాపాడుకోవడంలో నవజాత శిశు సంరక్షణ, వ్యాధి నిరోధక టీకాలు, తల్లి పాలు, పోషణ, అతిసారం, శ్వాసకోశ వ్యాధుల నిర్వహణ, ఆపత్కాలంలో నిపుణుల సేవలు వంటి అంశాలు ఇమిడి ఉంటయి.
జాతీయ ఆరోగ్య మిషన్, జనని శిశు సురక్ష కార్యక్రమం, జనని సురక్ష యోజన, ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్, రాష్ట్రీయ బాల స్వస్త కార్యక్రమం, ఐ సి డి ఎస్ వంటి ఎన్నో పథకాలు మాతా శిశు సంరక్షణ కోసం కృషి చేస్తున్నయి. ప్రైవేట్ రంగంలో కూడా మాతా శిశు సంరక్షణ కోసం నాణ్యమైన సేవలు అందించే వనరులు ఉన్నయి.
ఉపాధి వేటలో పడి స్త్రీ పురుషులు ఇద్దరూ వివాహాలను ఆలస్యం చేస్తున్నరు. దాని వల్ల కూడా గర్భధారణ సమస్యలు వస్తున్నయి. రక్త సంబంధీకుల మధ్య వివాహాలు, జన్యపరమైన వ్యాధులు, జెండర్ సెన్సిటైజేషన్, పునరుత్పాదక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, జీవన శైలి వంటి చాలా విషయాలలో యువతకు, సమాజానికి అవగాహన కల్పించడం నిరంతర ప్రక్రియగా కొనసాగాలె. అప్పుడే మాతా శిశు ఆరోగ్యం, తద్వారా భావి తరాల ఆరోగ్య సౌభాగ్యం బాగుంటుంది.
ఆరోగ్య శాఖ ప్రభావశీల పనితనం, సకాలంలో నిధులు, వనరుల కల్పన, సమాచార ప్రసారం, ఆరోగ్య రంగ నిపుణుల అంకితభావం, నిర్వహణ నైపుణ్యాలు, పర్యవేక్షణ, రాజకీయ సంకల్పం, ప్రజా చైతన్యం సక్రమంగా ఉంటే సత్ఫలితాలు సాధ్యమే!

డాక్టర్ రాపోలు సత్యనారాయణ
(వ్యాసకర్త ఫార్మసిస్ట్ & పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్)
ఫోన్: 9440163211

