ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల గణన (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024) దేశంలోనే చారిత్రాత్మక నిర్ణయంగా నిలిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా ఈ సర్వే ఫలితాలను ప్రకటిస్తూ, దీన్ని సమాజ అభివృద్ధికి దిక్సూచి లాంటి మోడల్ డాక్యుమెంట్ గా అభివర్ణించారు. గత ఏడు దశాబ్దాలుగా బలహీన వర్గాలు, మైనారిటీలు ఎదురుచూస్తున్న డేటాను ప్రభుత్వ పరంగా ఖచ్చితంగా అందించేందుకు చేపట్టిన ఈ సర్వే ఏడాది కాలంలో విజయవంతంగా పూర్తయిందని ఆయన తెలిపారు. ఈ నివేదికను మంత్రిమండలి ఆమోదించిందని, రాష్ట్రంలో అమలు చేయబోయే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఉపాధి, రాజకీయ అవకాశాలకు ప్రాతిపదికగా ఉపయోగిస్తామని ప్రకటించారు.
ఈ సర్వే ద్వారా 46.25 శాతం బీసీలు, మైనారిటీల్లోని బీసీలు కలిపితే 56.33 శాతం బీసీలు ఉన్నట్లు వెల్లడైంది. ప్రభుత్వం వీరందరికీ సముచిత గౌరవం, అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించిందని సీఎం తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే బలహీన వర్గాల జనాభా గణాంకాలపై చర్యలు చేపట్టామని, ఈ నివేదికకు చట్టబద్ధత కల్పించేందుకు మంత్రిమండలి ఉపసంఘం ఆమోదం తెలిపిందని వివరించారు. సర్వే పూర్తయిన తర్వాత, వెనుకబడిన తరగతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృద్ధికి అవసరమైన సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన, ఉపాధి మరియు రాజకీయ అవకాశాల కోసం ప్రణాళిక రూపొందించి అమలు చేయాలన్న లక్ష్యంతో ఈ సర్వే చేపట్టామని స్పష్టం చేశారు.
ఈ సర్వే 2024 నవంబర్ 6న గవర్నర్ గారి సమక్షంలో ప్రారంభమై, డిసెంబర్ 25న పూర్తయింది. 50 రోజుల్లో 1,12,15,137 కుటుంబాలను (96.09 శాతం) నమోదు చేశామని వెల్లడించారు. ఫలితాల ప్రకారం, ఎస్సీలు 17.43 శాతం (61,84,319), ఎస్టీలు 10.45 శాతం (37,05,929), బీసీలు 46.25 శాతం (1,64,09,179), ముస్లిం మైనారిటీల్లో బీసీలు 10.08 శాతం (35,76,588) ఉన్నారని తెలిపారు. ముస్లిం మైనారిటీ బీసీలను కలుపుకుంటే మొత్తం బీసీల సంఖ్య 56.33 శాతంగా ఉన్నట్లు వెల్లడైంది. మైనారిటీ జనాభా 12.56 శాతం (44,57,012) ఉండగా, ముస్లిం మైనారిటీల్లో ఓసీలు 2.4 శాతం (80,424), హిందూ ఓసీలు 13.31 శాతం ఉన్నట్లు వెల్లడైంది. ముస్లిం మైనారిటీల్లోని ఓసీలను కలుపుకుంటే మొత్తం ఓసీల జనాభా 15.79 శాతం గా ఉందని తెలిపారు.
ఈ సర్వే డేటా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఇతర బలహీన వర్గాల సంక్షేమానికి అవసరమైన విధానాలను రూపొందించేందుకు ప్రభుత్వం ఉపయోగించనుందని ముఖ్యమంత్రి తెలిపారు. గత 75 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం చేపట్టని ఈ చర్యను తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసి దేశానికే ఆదర్శంగా నిలిచిందని వ్యాఖ్యానించారు. 2023 డిసెంబర్ 7న ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 4 ఫిబ్రవరి 2024న మంత్రిమండలి ఆమోదం పొంది, 6 ఫిబ్రవరి 2024న శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టామని వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లో జరిగిన ప్రయత్నాలు న్యాయపరంగా నిలవకపోవడంతో, తెలంగాణ ప్రభుత్వం సర్వే పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకున్నామని వివరించారు.
ఈ సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024 తెలంగాణకు కొత్త దశను అందించనుందని, ప్రభుత్వం సమాన అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.

