రాస్ట్రం దివాళా తీయడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం
సిఎం రేవంత్ పై విరుచుకుపడ్డ మాజీ మంత్రి హరీష్ రావు
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పాలనపై మాజీ మంత్రి హరీశ్రావు తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్రావు మాట్లాడుతూ, “రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టి వచ్చిన హామీలను అమలు చేసే స్థితిలో లేరు” అని పేర్కొన్నారు. ‘‘People who blame others for their failures never overcome them, they simply move from problem to problem’’ అనే జాన్ సి. మాక్స్వెల్ రాసిన మాటలను ఉటంకిస్తూ, ‘‘ప్రతి ఒక్కరు తమ విఫలతలకు ఇతరులను నిందిస్తే, వారు ఎప్పటికీ ఆ విఫలత నుంచి బయటపడలేరు’’ అని హరీశ్రావు వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా, ‘‘రేవంత్ రెడ్డి ఒక్కసారిగా భయంతో హామీలను అమలు చేయడం మానేశాడు’’ అంటూ హరీశ్రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి, ‘‘రాష్ట్రమే దివాళా తీసింది’’ అని ప్రచారం చేస్తూ ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారు అని ఆరోపించారు. ‘‘7 లక్షల కోట్ల అప్పుతో కాదు, 4 లక్షల 17 వేల కోట్ల అప్పుతో రాష్ట్రం వుందని అసెంబ్లీలో కూడా చెప్పాను’’ అని హరీశ్రావు చెప్పారు.
హరీశ్రావు విమర్శిస్తూ, ‘‘రేవంత్ రెడ్డి అంతటా ప్రజలకు హామీలు ఇచ్చి, వాటిని అమలు చేయకుండానే రాష్ట్రాన్ని దివాళా తీస్తున్నాడు’’ అని అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు రావడం లేదు, నిరుద్యోగం పెరిగింది, ఉద్యోగాల అవకాశాలు తగ్గాయి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిలిపివేయబడ్డాయని సీఎం రేవంత్ పై విరుచుకుపడ్డారు.
కేటీఆర్ పై పెట్టిన తప్పుడు కేసు గురించి మాట్లాడుతూ…., ‘‘ఫార్ములా ఈ రేసు నిర్వహించడం, హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా మార్చడం అనేది కేటీఆర్ చేసిన గొప్ప ప్రాజెక్ట్. 2023లో రూ. 30 కోట్ల ప్రభుత్వ ఖర్చుతో జరిగిన ఈ రేసు రాష్ట్రానికి రూ. 700 కోట్ల జీఎస్డీపీగా లాభం కలిగించింది’’ అని హరీశ్రావు చెప్పారు. కానీ, రేవంత్ రెడ్డి ‘‘ఇంటి రంగు మార్చి, మధ్యంతరంలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేసి ఒలింపిక్స్ నిర్వహిస్తామని ప్రకటనలు చేస్తున్నాడు’’ అంటూ రేవంత్ పై సెటైర్లు వేశారు.
రేవంత్ రెడ్డి ‘‘మూసీ బ్యూటిఫికేషన్’’ పేరుతో లూటిఫికేషన్ చేస్తున్నారని, ఈ అంశంపై ప్రజల ముందు ఆధారాలతో తప్పిదాలను చూపించారని హరీశ్రావు ఆరోపించారు. అలాగే, ‘‘కేటీఆర్ పై వ్యతిరేకంగా కొంతకాలంగా కేసులు పెట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి’’ అని ఆయన మండిపడ్డారు.
హరీశ్రావు, ‘‘రేవంత్ రెడ్డి దేశంలోని ప్రఖ్యాత ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన సీఈఓను జైలులో వేయాలని అంటున్నారు అని, ఇది ఎంత వరకు సరైన చర్య’’ అని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ‘‘రేవంత్ రెడ్డి గర్వంగా చెప్పుకోవడమేంటో’’ రేవంత్ కే తెలియాలి అన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వ విధానాలపై మరోసారి విమర్శలు చేస్తూ, ‘‘రైతులపై, విద్యార్థులపై, ఆటో డ్రైవర్లపై, అంగన్వాడీ ఉద్యోగులపై కేసులు పెట్టడం సాధారణంగా మారిపోయింది’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘మా నాయకులు మాత్రం ఎప్పటికీ వెనకడుగు వేయరు, కేసీఆర్ నాయకత్వంలో పోరాటం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నాం’’ అని హరీశ్రావు చెప్పారు.
అంతేకాక, ‘‘రేవంత్ రెడ్డి నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రతిష్ఠ గాయపడింది’’ అని ఆయన తేల్చి చెప్పారు. ‘‘కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ జాతీయ పటంలో శక్తివంతమైన రాష్ట్రంగా ఎదగాలనే ఆశతో ముందుకు సాగిందని తమ ప్రభుత్వం వున్న రోజులను హరీశ్రావు గుర్తు చేశారు.

