పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏర్పాటు సమయంలో ఎప్పుడు.. ఎప్పుడాని కండ్లల్లో వొత్తులేసుకొని సూడాల్సిన స్థితి వొచ్చింది. యెందుకంటే గతంలో కరోనా సమయంలో ముందొకసారి, ఆ తర్వాతొకసారి, మళ్లీ రెండు సమయాల్లో మా ఆత్మీయ కలయిక వాయిదా పడింది. దీంతో ఈసారి కూడా కలుస్తామా! లేదా? అనే అనుమానాల మధ్య ప్రయాణం ముందుకు సాగింది. పాలకుర్తి, బమ్మెర, లక్ష్మీనారాయణ పురం గ్రామాల మిత్రుల చొరవ, పట్టుదల సంకల్పంతో కృషి ఫలించింది.
పదిహేను రోజుల వ్యవధిలోనే కార్యక్రమ ఏర్పాట్లతో ఊహించని రీతిలో కనుల విందుగా ప్రారంభమైంది. సెప్టెంబర్ 28న పాలకుర్తిలోని భాషరత్ గార్డెన్లో 1999 – 2000 పూర్వ విద్యార్థులు కలుసుకున్నారు. 25 ఏండ్ల తర్వాత ఆత్మీయుల కలయిక అంబరాన్ని అంటింది. ఆనాటి విద్యార్థుల మనసులు నిండుతనంతో పులకించినట్లు పరవశించిపోయాయి. ఒక్కొక్కరి కండ్లల్లో వారి ముఖాల్లో కనిపించిన ఆ చిత్రాల దరువు, ఆనందపు ఛాయలు మాటల్లో చెప్పలేం కదా! ఆపాత మధురాన్ని వర్ణించడం సాధ్యం కావడం లేదు. తొలుత రాజీవ్ చౌరస్తా నుంచి ఉపాధ్యాయ బృందాన్ని భాషరత్ గార్డెన్ వరకు పూల జల్లులతో తీసుకొచ్చి ప్రత్యేకతను చాటారు. కొద్ది మంది మిత్రులు వివిధ కారణాలతో రాలేకపోయినా వారిని మరచిపోలేదు. తమ తమ జ్ఞాపకాల దొంతరల్లో నెమరేసుకున్నారు.
సభ ప్రారంభంలో ఒక్కో గురువును 10 మంది విద్యార్థులు వేదికపైకి తోలుకువచ్చి స్వాగతించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం విద్యాబోధన చేసి భౌతికంగా దూరమైన పలువురు ఉపాధ్యాయులకు నిండు మనసుతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా మరణించిన తోటి విద్యార్థులను తలుచుకొని తల్లడిల్లారు. తమకు విద్యాబుద్ధులు సెప్పిన ఉపాధ్యాయులను వారి సేవలను, కొన్ని ఘటనలను యాజ్జేసుకున్నారు. వారిని సన్మానించి గౌరవించుకున్నారు. స్టేజీ మీద కొందరు సహచరులు మాట్లాడినప్పటికీ సారాంశం అంతా ఆనాటి స్మృతులను నెమరువేసుకోవడంతోనే సాగింది. సమయం లేక మాట్లాడక పోయినప్పటికీ, ప్రసంగించిన మిత్రుల మాటల్లో వారి తీపి గుర్తులు ప్రతిధ్వనించాయి. ఆనాటి ఉపాధ్యాయుల బోధనను, విలువలను గుర్తు చేసుకొని ఉల్లాసాన్ని, ఆనందాన్ని పొందారు.
ఆనాడు ఈ విద్యార్థుల జీవితాలకు దిశ దశా మార్గ నిర్దేశనం చేసిన ఉపాధ్యాయులు సైతం తమ అనుభవాలను చెబుతూ, పూర్వ విద్యార్థులకు ఉత్తేజాన్ని కలిగించారు. విలువైన సూచనలను అందించారు. అందరూ ప్రయోజకులు కావడం, వివిధ స్థాయిలలో స్థిర పడటాన్ని అభినందించారు. విద్యా, వైద్యం, సంఘటిత, అసంఘటిత, వ్యవసాయ అనుబంధ రంగాల్లో నిష్ణాతులుగా ఎదిగిన ఆనాటి పూర్వ విద్యార్థులు ఒకచోట సమూహంగా కనిపించారు. స్నేహానికి సరైన నిర్వచనాన్ని అందించిన తీరు అబ్బురపరుస్తుంది. వీరి అపూర్వమైన కలయిక చరిత్రలో తప్పక నిలిచిపోతుంది అనటంలో సందేహం లేదు. అక్కడి సన్నివేశాలు, ఆనందాలతో వేసిన స్టెప్పులు మైమరిపించాయి. అందరిలో ఐక్యత మరోసారి ప్రస్ఫుటమైంది. జిలుకర తిరుమల్, వినయ్ ల పాటలు జీరబోయిన గొంతుతో వినాల్సి వొచ్చింది.
ఒకే చోట అందరూ కూర్చొని వనభోజనాలకెళ్లినట్లుగా సహపంక్తి భోజనాలు చేశారు. వంద మందికి పైగా తరలొచ్చిన స్నేహితులు తమ ఆత్మీయత అనురాగాలను పంచుకున్నారు. మహిళా మిత్రులు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మొత్తం ఈ సమ్మేళనానికి మహిళలు నిండుతనాన్ని తీసుకువచ్చారు. సుదూర ప్రాంతాల్లో స్థిరపడిన మిత్రులు తరలి రావడం స్నేహితుల పట్ల వారికి ఉన్న గౌరవానికి, ఆప్యాయతకు సూచిక. మనసులో మలినం లేని స్వచ్ఛత కలిసిన ఆ స్నేహాన్ని చూసి, ఆనాటి బాల్య మిత్రులకు స్నేహమే సలాం చేసింది!

-మామిండ్ల రమేష్ రాజా
సెల్ : 78932 30218

