కుంభమేళాకు ‘టెంట్ సిటీ!’
మేడారానికి ‘ఆటవిక ట్రీటీ’?
జాతీయ గుర్తింపే లేదాయె?
కాంట్రాక్టర్లకు భోజ్యంగి తాత్కాలిక పనులు
గద్దెల చుట్టూ భూ సేకరణ ఎప్పుడు?
శాశ్వత పనులకు మోక్షం ఎప్పుడు?
మరో కుంభమేళా మేడారంకు నేడు సీఎం|CM
ఏర్పాట్లను పరిశీలించనున్న ముఖ్యమంత్రి|REVANTH REDDY
వరంగల్, సెప్టెంబర్ 22 (అడుగు ప్రత్యేక ప్రతినిధి): మేడారం సమ్మక్క-సారలమ్మ వన దేవతల జన జాతర. ఆదివాసీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే అడవి పండుగ. వాళ్ళ ఆత్మగౌరవ పండుగ. కాలక్రమేణా సకల జనుల పండుగగా మారింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆదివాసీ పండుగ మేడారం జాతర. భారత దేశంలో కుంభమేళా తరువాత అత్యధికులు హాజరయ్యే పండుగ ఇదే. అందుకే దీన్ని తెలంగాణ కుంభమేళా అంటారు. కేవలం నాలుగు రోజుల్లోనే దేశం నలుమూలల నుంచి కోట్లాది మంది హాజరయ్యే, అభయారణ్యంలో జరిగే అద్భుత జన జాతర. అయితే, ఏడాదికేడాది పెరుగుతున్న భక్తుల తాకిడి తట్టుకోలేక, రెండేళ్ళకోసారి నిర్వహిస్తున్న మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించి నిర్వహిస్తున్నది. ఎన్ని డిమాండ్లు వచ్చినా, కేంద్ర ప్రభుత్వం మాత్రం నేటికీ జాతీయ పండుగగా ప్రకటించలేదు. 836 ఏళ్ళుగా జరుగుతున్నా, నేటికీ ఆదరణ తగ్గకపోగా, నానాటికీ జన సందర్శన పెరుగుతున్న ఏకైక జాతర మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర. మేడారం, పూర్వపు వరంగల్ జిల్లా, నేటి ములుగు జిల్లా, తాడ్వాయి మండలంలోని మేడారం అనే గ్రామంలో జరుగుతున్నది.
అడవి బిడ్డల అస్తిత్వ ఆత్మగౌరవమే సమ్మక్క. ఆమె కుటుంబమే సారలమ్మ, పగిడిద్ద రాజు, జంపన్న తదితరులు. కాకతీయుల కాలంలో ప్రతాపరుద్రుడి కాలంలో క్రీ.శ.-1158 నుండి 1195ల మధ్య రాజుకు కప్పం కట్టే విషయంలో వచ్చిన యుద్ధం, ఆ యుద్ధంలో సమ్మక సహా, ఆమె సైన్యం, కుటుంబం మొత్తం తుడిచి పెట్టుకుపోగా, ఆమె చిలుకల గుట్టలో అంతర్థానం అవడం జరిగిపోయాయి. ఆ గుర్తుగానే ఆమెను ప్రతి ఏటా మేడారం గద్దెల మీదకు తెచ్చి కొలిచే జాతర, కాస్తా, రెండేండ్ల కోసారి జరిగే మహా జాతరగా, వన జాతరగా, రెండో కుంభమేళాగా ప్రసిద్ధి చెందింది.
1940కి ముందు బయ్యక్కపేటలో జరిగేదని, అక్కడి వడ్డె (పూజారు)లు వృద్ధాప్యంతో పూజలు నిర్వహించలేని పరిస్థితుల్లోనే మేడారంకు జాతర మారిందని కూడా మరో చరిత్ర ప్రాచుర్యంలో ఉంది. 1940 నుంచి చిలకలగుట్టపైనే ఆదివాసీలు మాత్రమే జాతరను జరిపేవారు. 1946నుంచి జాతరను మేడారంలో నిర్వహించడం మొదలైంది. ఆ తర్వాత 1962లో సారలమ్మను కీకారణ్యంలోని మేడారం గద్దెలపై ప్రతిష్ఠించారు. 1968లో జాతర దేవాదాయ శాఖ పరిధిలోకి వచ్చింది. 1998లో ఈ జాతరను అప్పటి ఉమ్మడి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. వైభవోపేతంగా నిర్వహిస్తోంది. అయితే, 1998లో రాష్ట్ర పండుగగా ప్రకటించినా, కేంద్రం జాతీయ పండుగగా ప్రకటించకపోయినా, నానాటికీ మేడారానికి జనాదరణ పెరుగుతూనే ఉంది. కానీ, ఏర్పాట్లు మాత్రం శాశ్వత ప్రాతిపదినక కాకుండా, కేవలం తాత్కాలిక ప్రాతిపదికనే జరుగుతున్నాయి. కుంభమేళాకు టెంట్ సిటీని వేసి మరీ కోట్ల కోట్ల రూపాయలను కేంద్రం ఖర్చు చేస్తున్నది. కానీ, మేడారం జాతరను మాత్రం గిరిజనులను లాగే నిర్లక్ష్యం చేస్తూ నామమాత్రం నిధులతో, తాత్కాలిక పనులతో కమిషన్లకు అలవాటు పడి కాంట్రాక్టర్లను మాత్రమే బతికిస్తున్నాయి.
శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులేవి?
ఉమ్మడి రాష్ట్రంలో అరకొర నిధులతో నిర్వహించే జాతరకు తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2016లో తొలిసారిగా స్వరాష్ట్రంలో జరిగిన జాతరకు రూ.136 కోట్లు మంజూరయ్యాయి. 2018 లో రూ. 80 కోట్లు కేటాయించగా 2020లో కేవలం రూ. 75 కోట్లు కేటాయించారు. ఈసారి సీఎం రేవంత్ రెడ్డి రూ.150 కోట్లు కేటాయించారు. 2018 జాతరకు కోటి 30లక్షల మంది భక్తుల రాగా, గత ఏడాది కోటిన్నర దాటారు. ఈ సంఖ్య ఈ ఏడాది 2 కోట్లు కూడా దాటే అవకాశం ఉందని అంచనా.
మరోవైపు భక్తుల కోసం మేడారం జాతరలో 24 గంటలపాటు విద్యుత్, తాత్కాలిక మరుగుదొడ్లు, మంచినీటి వసతి, స్నానఘట్టాలు, రవాణా సదుపాయాలను ప్రభుత్వం భారీ ఎత్తున కల్పిస్తున్నది. కానీ, కేవలం ఆ నాలుగైదు రోజుల కోసమే కావడంతో అవన్నీ తాత్కాలికంగానే జరుగుతున్నాయి. ఇందుకు ముందుగా మేడారం గద్దె చుట్టూ ఉన్న స్థలాన్ని ప్రభుత్వం సేకరించాల్సి ఉంది. ఆ స్థలాల్లోనే శాశ్వత పనులు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం ఆ అడవంతా జనమయమైపోడంతో ఆ జన తాకిడిలో పనులన్నీ కొట్టుకుపోతున్నాయి. మరో రెండేండ్లు వస్తే తప్ప, ఆ జాతరను అటు ప్రభుత్వం, ఇటు వడ్డెలు, జనం కూడా పట్టించుకోవడంలేదు. మేడారం పనులను పరిశీలించడానికి వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి శశ్వత పనుల విషయమై స్పష్టమైన ఆదేశాలిస్తారన్న ఆశతో అటు భక్తులు, వడ్డెలు, ఆదివాసీ గిరిజనులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.మరి సీఎం ఏ విధంగా స్పందిస్తారో చూడాలి?

