(2025 ఏప్రిల్ 30 : 892 వ బసవ జయంతి)
పన్నెండవ శతాబ్దంలో ప్రభవించిన గొప్ప సంఘ సంస్కర్త, సమసమాజ స్వాప్నికుడు బసవేశ్వరుడు (క్రీ.శ. 1134 – 1196). కర్ణాటక లోని విజయనగర జిల్లా బాగేవాడిలో మాదిరాజు – మాదాంబిక లకు జన్మించిండు. తన అక్కకు చేయని ఉపనయనాన్ని తానూ చేసుకోనని బాల్యంలోనే ఇల్లు విడిచిండు. కృష్ణా మలప్రభ నదుల కూడల సంగమ క్షేత్రం చేరుకొని లకులీశ శివ గురువు శిష్యరికంలో ఆధ్యాత్మికతను సామాజిక తాత్విక కోణంలో ఔపాసన పట్టిండు. విద్యార్జన ముగించుకొని బీదర్ జిల్లా కల్యాణ్ పట్టణం వచ్చిండు. కలచూరి బిజ్జల రాజు రాజ్యానికి రాజధాని అది. బసవేశ్వరుని మేనమామ రాజాస్థానంలో ఉన్నతోద్యోగి. మేనమామ కుమార్తె ను పెండ్లి చేసికొని, ఆస్థానంలో కొలువు సంపాదించిండు. ప్రతిభతో క్రమంగా బండారి, దండనాయక, ప్రధాని పదవులు పొందిండు.
సమాజంలోని వ్యత్యాసాలు, వివక్ష తనను బాధించేటియి. తన అధికార పీఠంతో సామాన్యులకు మేలు చేయాలని తలపోసిండు. అనుభవ మంటపం అనే నిత్య సభను ఏర్పాటు చేసిండు. నేటి పార్లమెంట్ కు పూర్వ రూపం అది. సమాజంలోని అన్ని వృత్తుల వారు, స్త్రీ లు కూడా అందులో సభ్యులు. అల్లమ ప్రభు అధ్యక్షతన అందులో చర్చలు జరిపే వారు.
అరివె గురు (అవగాహనయే గురువు), కాయకవే కైలాస (కాయకష్టమే కైలాసము) బసవన్న సిద్ధాంతాలు. ఆకొన్న వారికి దాసోహం (అన్న దానం) సామాజిక బాధ్యత. పుట్టుక కాదు, ప్రవర్తన; భక్తి కన్నా మంచి నడవడి ముఖ్యం; మనుషులందరూ ఒక్కటే అని ఆయన విశ్వాసం. భావజాల వ్యాప్తికి వచనాలు అనే ప్రక్రియను పరిచయం చేసిండు. వచనాలతో తత్వ సూక్ష్మాలను సులువుగా బోధ పరచే వాడు. ప్రస్తుతం దొరికిన బసవేశ్వర వచనాలు పది ఐదు వేలు. కానీ, బసవేశ్వరుడు “లాలితంబుగ నాల్గు లక్షల మీఁద/ నోలి నర్వదినాల్గు వేల గీతములు” అంటే 4,64,000 వచనములు వ్రాసినాడని పాల్కురికి సోమనాథుని
బసవ పురాణంలో చెప్పబడింది. బసవేశ్వరుని సహచరులు కూడా వచనాలు వ్రాసి సామాజిక చైతన్యానికి దోహదం చేసిండ్రు. సాహిత్యంలో వచనాలు ప్రత్యేక స్థానాన్ని సముపార్జించు కొన్నయి.
కొన్ని కులాలను గుడికి, దేవుడికి దూరం చేసిన దుర్మార్గపు వ్యవస్థ తనను బాధించింది. పరిష్కారంగా జనానికి లింగ దీక్షలు ఇచ్చిండు. పరమేశ్వరుని ప్రజల వద్దకు చేర్చిండు. దేహమే దేవాలయం అన్నడు. గుండెల మీద లింగం వేలాడే విధంగా మెడలో కట్టి, కరతలం పైన కపర్థి పూజ చేసుకునే సౌలభ్యం కల్పించిండు. స్వీయ రక్షణ, అవసరమైతే దుష్ట శిక్షణ కోసం లింగ పసాయితం (ప్రసాదితం) పేరిట ఖడ్గ ధారణకు అనుమతి ఇచ్చిండు. ఆధ్యాత్మికతను ఆలంబన చేసికొని అంతరాలు లేని సమాజ నిర్మాణానికి ఆరాట పడ్డడు.
భక్తి బసవన్న శక్తి. బసవేశ్వరుడు భక్తి భండారి. సోమనాథుడు అన్నట్టు “వడి సేయు బసవని కొడలెల్ల భక్తి”. శివ భక్తులు అందరినీ శరణులు అనే వారు. శరణులు ఎదురు పడితే శరణు శరణార్థి అని తనే ముందు అత్యంత వినయంతో నమస్కరించే వాడు. అందరినీ ఆదరించే ధీర ఉదాత్తుడు బసవేశ్వరుడు. బసవన్న సమ దర్శి. బసవేశ్వరుని చరిత్రను బసవ పురాణం గా వ్రాసిండు పాల్కురికి సోమనాథుడు (క్రీ.శ. 1160-1240). బమ్మెర పోతన తన వీరభద్ర విజయం లో బసవుని స్తుతించిండు. వేమన, వీరబ్రహ్మం తాత్వికత మూలాలు బసవన్న యే! కార్ల్ మార్క్స్ కంటే ముందే సామ్యవాద స్థాపనకు కృషి చేసిండు బసవన్న. భారత దేశ సంవిధాన మౌలికతకు అంబేడ్కర్ స్వీకరించింది బసవన్న ఆదర్శాలనే. సంచలనం సృష్టించిన ఎం ఎం కలబుర్గి రచన “మార్గ” కావ్యం బసవన్న నిజమైన సిద్ధాంతాల సంశోధన.
పార్లమెంట్ వ్యవస్థకు మూల పురుషుడు అయిన బసవేశ్వరుని విగ్రహాన్ని భారత ప్రభుత్వం సంసద ప్రాంగణంలో 2004 సంవత్సరంలో రాష్ట్రపతి అబ్దుల్ కలామ్ చేతుల మీదుగా ఆవిష్కరింప చేసింది. పాల్కురికి సోమనాథుని జన్మస్థలం పాలకుర్తిలో సోమనాథ కళా పీఠం బసవ జయంతిని ప్రతి ఏటా నిర్వహిస్తున్నది. కొండ బసవరాజు ప్రదానం చేసిన బసవేశ్వరుని విగ్రహాన్ని 2017 లో పాలకుర్తిలో ప్రతిష్ఠ చేసిండ్రు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బసవ జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నది. కర్ణాటక ప్రభుత్వం బసవన్నను తమ సాంస్కృతిక రాయబారిగా ప్రకటించు కొన్నది. ప్రపంచ వ్యాప్తంగా బసవ అనుయాయులు పెరుగుతూ ఉన్నరు. అటువంటి బసవేశ్వరుని ఆదర్శాలే భారత దేశానికి సదా ఆచరణీయాలు!


