పుష్కరాలకు సిద్ధమవుతున్న భక్తులు
భారతదేశ చరిత్రలోనే కాక, పురాణాలలోను సరస్వతీ నది అపారమైన ప్రాముఖ్యతను సంతరించుకుంది. త్రివేణి సంగమంలో గంగ, యమునాలతో పాటు సరస్వతీ కూడా భాగమైనట్లు పురాణాలు తెలుపుతున్నాయి. అయితే ఈ నది ప్రస్తుతం ప్రత్యక్షంగా కనిపించకపోయినా, కొన్ని ప్రాంతాల్లో మాత్రం భూగర్భ స్థాయిలో కనిపిస్తుందని నమ్మకం. త్వరలో జరగనున్న సరస్వతీ నది పుష్కరాల నేపథ్యంలో, ఈ పవిత్ర నది చరిత్ర, ప్రాధాన్యత, ప్రస్తుత పరిస్థితులు తెలుసుకోవడం ఆసక్తికరమైనది. నీటిని పంచభూతాలలో ఒకటిగా భావించే భారతీయ సంస్కృతిలో, నదులకు అత్యంత పవిత్ర స్థానం కలదు. వాటిలో సరస్వతీ నది విశిష్టమైనది. రుగ్వేదంలో ఈ నదిని “అంబితమే, నదీతమే, దేవీతమే” అని మహత్త్వంగా పేర్కొన్నారు. శాస్త్రవేత్తల అభిప్రాయాల ప్రకారం, సరస్వతీ నది ఒకప్పుడు హిమాలయాల శివాలిక్ కొండల్లోని హర్కీదూన్ హిమానీనదం నుంచి ప్రవహించి పంజాబ్, హర్యానా, రాజస్తాన్, గుజరాత్ రాష్ట్రాల గుండా వెళ్లి అరేబియా సముద్రంలో కలిసేదని భావిస్తున్నారు. ఇవే ఆధారంగా సరస్వతీ నది ఆధునిక కాలంలో గగ్గర్-హక్రా నదిగా గుర్తించబడింది. ఈ నది సుమారు 4000–5000 ఏళ్ల క్రితం భూగర్భ మార్పులు, వాతావరణ ప్రభావాల వల్ల ఎడారుల్లో దాగిపోయిందని, కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు. ఉత్తరాఖండ్లోని మానా గ్రామం వద్ద అలకనంద నదిలో కలిసే సరస్వతీ నది, భూమిపై కనిపించే కొన్ని అరుదైన ప్రాంతాల్లో ఒకటి. పురాణాల ప్రకారం సరస్వతీ నది బ్రహ్మదేవుని కమండలం నుంచి ప్రవహించిందని చెబుతారు. శాస్త్రీయంగా చూస్తే ఈ నది హిమాచల్ ప్రదేశ్ లేదా ఉత్తరాఖండ్లోని బందర్పూంచ్ మాసిఫ్ ప్రాంతం నుంచి ఉద్భవించి ఉండొచ్చని చెబుతారు. హరప్పా నాగరికతకు సరస్వతీ నది జీవనాధారంగా ఉండేదని, అక్కడి ప్రజలు ఈ నదిని జ్ఞానదాయక దేవతగా పూజించారన్న ఆధారాలు ఉన్నాయి. ఈ నది పుష్కరాలకు కూడా ఆధ్యాత్మిక ప్రాధాన్యత అధికంగా ఉంటుంది. మిగతా నదుల మాదిరిగా 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే సరస్వతీ నది పుష్కరాలు ఈసారి 2025 మే 15 నుంచి మే 26 వరకు జరగనున్నాయి. గురు గ్రహం మిథునరాశిలోకి ప్రవేశించినప్పుడు ఈ పుష్కరాలు జరగడం ఆనవాయితీగా ఉంది. లక్షలాది మంది భక్తులు ఈ కాలంలో పుణ్యస్నానాలు చేయడానికి తరలివస్తారు. ఈ సందర్భంగా భక్తులు ఆధ్యాత్మిక శుద్ధిని పొందుతారని, మోక్షం దక్కుతుందని నమ్మకం. చారిత్రక, భౌగోళిక విశేషాలతో పాటు ధార్మికంగా ఎంతో ప్రాధాన్యం కలిగిన సరస్వతీ నది, భారత సాంస్కృతిక వారసత్వానికి అద్దంపట్టే నది అని చెప్పవచ్చు.

