మొక్కులు తీర్చుకున్న ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి
ఘనంగా ఆలేటి ఎల్లమ్మ జాతర
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల బందోబస్తు
పాలకుర్తి నియోజకవర్గం లో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి ఏడాది జరిగే అలేటి ఎల్లమ్మ జాతర గత 3 రోజులుగా కన్నుల పండువగా జరిగింది. ఈ జాతరకు భారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ జాతరను ప్రజలు తమ కష్టాలు తీర్చే అమ్మవారుగా, కొంగు బంగారం గా ఎల్లమ్మ ను కొలుస్తారు. జాతరలో పాల్గొన్న ప్రజలు ఆలేటి ఎల్లమ్మను మొక్కులు తీర్చుకుంటూ, పూజలు చేశారు. జాతరలో కీలక ఘట్టమైన బోనాలతో ఈ జాతర పూర్తయింది.



జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కఠినమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. డిసిపీ రాజా మహేంద్ర నాయక్, ఎసిపి నర్సయ్య, సీఐ మహేందర్ రెడ్డి, ఎస్సై దూలం పవన్ కుమార్ ల ఆధ్వర్యంలో పోలీసులు ముమ్మరంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. జాతరకు భారీ భద్రతను అందించారు. అలాగే, ఆలయ నిర్వహణ కమిటీ కూడా జాతర విజయవంతంగా నిర్వహించేందుకు అహర్నిశలు కృషి చేసింది.

ఈ సందర్భంగా జాతరకు స్థానిక ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి ఆలేటి ఎల్లమ్మ అమ్మవారికి బోనం సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. ఆమె ఆలయ అభివృద్ధికి తాను పూర్తిగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆలయ కమిటీ వారు ఎమ్మెల్యే ను అమ్మవారి వస్త్రాలతో సత్కరించారు. ఎమ్మెల్యే వెంట తొర్రూరు మార్కెట్ చైర్మన్ హనుమాండ్ల తిరుపతి రెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు వున్నారు. అలాగే, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ జాతర పాలకుర్తి నియోజకవర్గంలో ప్రజల విశ్వాసానికి, భక్తి భావనకు ప్రతీకగా నిలిచింది.

