పార్లమెంటు ముందుకు పలు కీలక సమస్యలు!
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల రెండో సెషన్ సోమవారం నుంచి జరుగనున్నది. ఈ సమావేశంలోనే పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ప్రధానంగా జనగణన, అందులోనే కులగణన చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. జనగణన చేపట్టేందుకు ఇప్పటికే అధికార బిజెపి సానుకూల సంకేతాలు ఇచ్చింది. అయితే కులగణకు మాత్రం ససేమిరా అంటోంది. దేశంలో కులచిచ్చు రగల్చడం సరికాదని బిజెపి వాదిస్తోంది. నిజానికి దేశంలో ఇంకా కుల నిచ్చెనమెట్ల వ్యవస్థే వేళ్ళూనుకొని ఉంది. కుల, మత ప్రాతిపదికన ఓట్లు, సీట్లు, పదవులు, చదువులు, ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు అసలు కులమే లేదు. ఉన్నా కులాల కుంపట్లు అంటూ వదిలేయడం ఇంకెంత కాలం? ఇది సమంజసమేనా!? సుదీర్ఘ కాలంగా జనాభా తక్కువ ఉన్న కొన్ని కులాలే ఎక్కువ ప్రతిఫలాలు పొందుతుంటే, ఎక్కువ జనాభా ఉన్న తక్కువ కులాల పరిస్థితి ఏంటి? కొన్నింటికే కాకుండా అన్ని కులాలకు అవకాశాలింకెప్పుడు? ఎప్పటికైనా పాలకులు పాలకులే!, పాలితులు పాలితులే? అనే పరిస్థితి ఇంకెంత కాలం? ఇవ్వాళ కుల చిచ్చులని వదిలేస్తే రేపు ఇవే చిచ్చులు, చిచ్చుబుడ్లై, బాంబులై, బద్ధలై దేశాన్నే అంతర్గత విచ్ఛిన్నానికి దారి తీయవచ్చు(?)కదా! విజ్ఞులు ఆలోచించాలి.
ఇక నియోజకవర్గాల పునర్విభజనపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుత జనాభా ఆధారంగా నియోజకవర్గాల గణన చేస్తే తాము నష్టపోతామని దక్షిణాది రాష్టాల్రు గగ్గోలు పెడుతున్నాయి. సీట్లు తగ్గవని అంటున్న బిజెపి..ఏయే రాష్ట్రాల సీట్లు తగ్గవో స్పష్టంగా చెప్పడం లేదు. ఇప్పటికే తమిళనాడు సిఎం స్టాలిన్ దీనిపై యుద్ధమే ప్రకటించారు. దక్షిణాది రాష్ట్రాల సిఎంలకు లేఖలు రాశారు. ఉత్తరాదికంటే దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గిన జనాభా కారణంగా నియోజకవర్గాల కుదింపు కుట్రలు జరుగు తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే విషయాన్ని సమర్ధిస్తున్నారు. సీట్ల తగ్గింపు జరగదంటున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాటల్లోనూ స్పష్టత లేదు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఇదే విపక్షాలకు ప్రధాన ఎజెండా కానుంది. సాధారణంగా లోక్సభ, శాసనసభల నియోజక వర్గాల సంఖ్య జనాభా ప్రాతిపదికన నిర్ణయిస్తారు. దేశంలో భిన్నత్వాన్ని, ప్రజాస్వామిక స్ఫూర్తిని చాటేలా చట్టసభల్లో అన్ని ప్రాంతాలకు ప్రాతినిధ్యం లభించేలా సీట్ల కేటాయింపు ఉంటుంది. అన్ని వర్గాలకు కూడా సరైన ప్రాతినిధ్యం దక్కాలంటే జన, కుల గణన కూడా తప్పనిసరి.
జనగణన, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల అమలు, ఉమ్మడి పౌరస్మృతి వంటివి రానున్న ఒకటి రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని బిజెపి ఆలోచిస్తోంది. ఆ తరవాత జమిలి ఎన్నికలకు వెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జమిలి జరిపి తీరుతామన్న పట్టుదలలో మోడీ ప్రభుత్వం ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతమని విపక్షాలు వాదిస్తున్నాయి. జమిలిపై పట్టులుగా ఎవరి లెక్కలు వారికున్నాయి. అయితే తరచూ ఎన్నికల వల్ల సమయం వృధా, దేశ ఖజానా ఖర్చే తప్ప మరేం లేదు. నిత్యం ఎన్నికలతో ప్రజా సమస్యలు కొట్టుకు పోతున్నాయి.
ప్రధానంగా జమిలికి ముందే జనాభా గణన జరగాలి. అందులో కుల గణన ఉండి తీరాలి. ఉమ్మడి పౌరస్మృతి అమల్లోకి రావాలి. ఒకే దేశం, ఒకే చట్టం అమల్లోకి రావాలి. జాతి, మత, కుల, ప్రాంత, రాష్ట్రాలకతీతంగా పెరుగుతున్న జనాభాను కట్టడి చేయాలి. నియోజకవర్గాల పునర్విభజనపై దక్షిణాది రాష్ట్రాల్లో పెరుగుతున్న అనుమానాలను తెరదించాలి. పనిలోపనిగా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిన గవర్నర్ వ్యవస్థతో పాటు శాసన మండలులు, కార్పొరేషన్ల చైర్మన్లు వంటి వాటిని శాశ్వతంగా ఎత్తేస్తే మంచిది.
ఇక చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టాన్ని ఆమోదించారు. దీనికి జనగణను లంకె వేశారు. 2023లోనే ఈ బిల్లు 106వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టంగా మారింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం జనగణన పూర్తయిన వెంటనే దాన్ని అమల్లోకి తీసుకుని వస్తామని హావిూ ఇచ్చింది. ఆ మేరకు చట్టంలో కూడా పొందుపరిచింది. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు అమలులోకి రావాలంటే కచ్చితంగా జన, కుల గణన జరిగితీరాలి. అప్పుడే మహిళల దశాబ్దాల కల సాకారమవుతుంది. చట్ట సభల్లో 50శాతం అందాల్సిన మహిళలకు కనీసం 33శాతం రిజర్వేషన్లు అయినా దక్కుతాయి. మరి ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఏం తేలనుందనేదానిపై దేశమంతా ఎదురుచూస్తున్నది. సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

