ముచ్చటగా మూడో‘సారీ!’
అలా వచ్చారు! ఇలా వెళ్ళారు!!
2వ తేదీన మళ్ళీ సారొస్తారా?
కేసీఆర్ సారు… అసెంబ్లీకి అలా వచ్చారు.. ఇలా వెళ్ళారు. గత రెండేళ్ళల్లో రెండుసార్లు, ముచ్చటగా ఇది మూడో‘సారీ!’… కేసీఆర్ అసెంబ్లీకి రావాలని ప్రభుత్వం పట్టుపట్టడం, ఆయన అలా రావడం. ఇలా వెళ్ళడం పరిపాటైంది. కానీ, గతానికి భిన్నంగా ఈ సారి కేసీఆర్, ‘తోలు తీస్తా… నేనే రంగంలోకి దిగుతా’నని అసెంబ్లీ సమావేశాలకు కొద్ది రోజుల ముందు ప్రభుత్వానికి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. కానీ, యథావిధిగా ఆయన వెనక్కి వెళ్ళారు. తిరిగి ఆయన ఈ సమావేశాలకు 2వ తేదీన మళ్ళీ వస్తారా? నీళ్ళపై నిజానిజాల నిగ్గు తేల్చి ప్రభుత్వాన్ని నిలదీస్తారా?
హైదరాబాద్, డిసెంబర్ 29 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడో ఏడాది మొదటి శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్, అందరికంటే ముందే వచ్చారు. కొద్దిసేపు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో సభ్యులకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా తనకు కేటాయించిన సీట్లో కూర్చుకున్నారు. సభలో ప్రార్థనా గీతం, అనంతరం సంతాప తీర్మానాలు ముగిసి, సభ మొదలవుతుండగానే వెనుదిరిగారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఇలా రావడం, అలా వెళ్ళడం కొత్తేమీ కాదు. కానీ, గతానికి భిన్నంగా ఈ సారి సభలో ప్రభుత్వం తోలు తీస్తా. నీళ్ళపై నిలదీస్తా… ప్రాజెక్టులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఉరిమారు. తానే ముందుండి నడుపుతామని చెప్పారు. కానీ, పాత పద్ధతిలోనే తిరిగి వెళ్ళారు.
కేసీఆర్ సభ నుంచి వెళ్ళిన అంశం మాత్రం తీవ్రమైన చర్చకు దారి తీస్తోంది. అధికారపక్షంపై, ప్రభుత్వంపై రాజకీయ యుద్ధానికి సిద్ధమని జంగు సైరన్ ఊదిన కేసీఆర్, ‘అలా వచ్చి, ఇలా వెళ్ళిపోయే’ వైఖరి సహజంగానే ప్రశ్నలను రేపుతోంది.
ప్రజాస్వామ్యంలో అసెంబ్లీ అత్యున్నత పరిపాలన, విధి విధానాల రూపకల్పన వేదిక. ప్రజల సమస్యలు, ప్రభుత్వ విధానాలు, లోపాలు వంటివన్నీ అక్కడే చర్చకు వస్తాయి. 1983 మిహనా, 1985 నుండి నేటి వరకు ఓటమి ఎరుగని నేతగా, కేసీఆర్ ది నాలుగు దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం. ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్రమంత్రిగా, డిప్యూటీ స్పీకర్ గా, కేంద్ర మంత్రిగా, రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయనకు పాలనపై పట్టు అపారం. రాజకీయ వ్యూహాల దిట్ట. ఇంతటి సుదీర్ఘ అనుభవం ఉన్న కేసీఆర్ అసెంబ్లీలో ఉండటం ప్రతిపక్షానికి మాత్రమే కాదు, ప్రజలకు కూడా మేలు చేస్తుంది.
‘ప్రభుత్వాన్ని నిలదీస్తా’, ‘ప్రజల పక్షాన అసెంబ్లీని దద్దరిల్లేలా చేస్తా’, ‘నేనే ముందుండి పోరాడతా’నన్న కేసీఆర్, ఇప్పుడు ఎందుకు అసెంబ్లీకి ముఖం చాటేస్తున్నారు? ఆయన మాటలకు చేతలకు పొంతన ఎందుకు లేదు? ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చగా నిలుస్తోంది.
కొందరు బీఆర్ఎస్ మద్దతుదారులు దీనిని వ్యూహాత్మక నిర్ణయంగా సమర్థించేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘ప్రస్తుత సభా వాతావరణం అనుకూలంగా లేద’ని, ‘ప్రతిపక్ష నేతకు తగిన గౌరవం ఇవ్వడం లేద’ని, ‘సభను ప్రభుత్వమే దిగజార్చింద’ని వాదిస్తున్నారు. ఇవన్నీ సాధారణ రాజకీయ విమర్శలే. అయినా, సభలో ఉండి పోరాడితేనే ఈ వాదనలకు బలం చేకూరుతుంది.
ప్రతిపక్ష పాత్ర కేవలం బయట విమర్శించడమే కాదు, సభలో ఉండి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, నిలదీయడం, ప్రజల సమస్యలను లేవనెత్తడం, విధానపరమైన ప్రత్యామ్నాయాలను సూచించడం. ఈ తరహా వ్యవహార శైలి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతుంది. మరి ఈ బాధ్యతల నుంచి తప్పించుకోవడం, లేదా దూరంగా ఉండడం, ప్రజలకు తప్పుడు సంకేతాల్ని ఇస్తోంది. ముఖ్యంగా కేసీఆర్ లాంటి అనుభవజ్ఞుడి నుంచి ప్రజలు ఆశించేది రాజకీయ పరిపక్వత, స్థిరత్వం, నిలకడైన పోరాటం.
ప్రస్తుత కేసీఆర్ వైఖరి ఆయన వ్యక్తిగతం కావచ్చు. కానీ, అది బీఆర్ఎస్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ పరిణామాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది. ‘ప్రతిపక్షం పారిపోయింది. మమ్మల్ని ఎదుర్కోనే ధైర్యం లేదు’ వంటి ఆరోపణలు రాజకీయంగా సహజమే. కానీ ఈ ఆరోపణలకు అవకాశం ఇవ్వకుండా నిలదీయాల్సిన బాధ్యత ప్రతిపక్ష నేతదే. రాజకీయ పోరాటం బయట మాటలతో కాదు, లోపల నిలబడి చేసే వాదనలతో గెలవాలి. నిజానికి మాటలకంటే చేతలే రాజకీయ నాయకుడి నిజమైన బలమని గుర్తించాలి.

