భారత్ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా ఉన్న ఇంధన భద్రత ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని, సవాళ్లను ఎదుర్కొంటోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు మార్కెట్ను అస్థిర పరుస్తున్నాయి. ఈ పరిణామాలు దిగుమతులపై అధికంగా ఆధారపడే భారత్ వంటి దేశాలను ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశం అప్రమత్తంగా ఉండడం మాత్రమే కాక, దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకు సాగడం అత్యవసరం.
భారత్ తన చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. రోజుకు సగటున 5 మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురు వినియోగించే దేశంగా భారత్, ప్రపంచంలో మూడవ అతిపెద్ద వినియోగదారుగా ఉంది. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఏ చిన్న ఉద్రిక్తత, కల్లోలం కలిగినా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగి, దేశీయ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ద్వారా రవాణా ఖర్చులు అధికమవుతాయి. దాని ప్రభావం అన్ని వస్తువుల ధరలపై పడుతూ ద్రవ్యోల్బణాన్ని వేగవంతం చేస్తోంది.
మొత్తం చమురు వినియోగంలో రవాణా రంగం 40 శాతం వాటాను కలిగి ఉంది. ఈ రంగంలో ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం ఇంకా ఆశించిన స్థాయికి చేరలేదు. విద్యుదీకరణ పెరిగినా, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మొత్తం వాహనాల్లో 2–3 శాతం వరకు మాత్రమే. ఇదే సమయంలో వ్యవసాయ రంగంలో 30 శాతం పంపుసెట్లు ఇంకా డీజిల్పై ఆధారపడి ఉన్నాయి. ఇవి చమురు వినియోగాన్ని తగ్గించడంలో పెద్ద అడ్డంకిగా నిలుస్తున్నాయి.
విద్యుత్ ఉత్పత్తిలో కూడా పరిస్థితి పూర్తిగా అనుకూలంగా లేదు. దేశంలో మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 70 శాతం బొగ్గు ద్వారానే జరుగుతోంది. సహజ వాయువు వినియోగం పెరుగుతున్నా, అందులో 50 శాతం వరకు దిగుమతుల ద్వారానే లభిస్తోంది. పునరుత్పాదక ఇంధనాల్లో భారత్ పురోగతి సాధించినా, మొత్తం విద్యుత్ అవసరాల్లో సోలార్, పవన విద్యుత్ లు కలిపి 25 శాతం మాత్రమే అందిస్తున్నాయి. అంటే స్వాతంత్ర్యం సిద్ధించి ఇన్నేళ్లైనా, సంపూర్ణ ఇంధన స్వయం సమృద్ధి దిశగా ప్రయాణిస్తున్నామని చెప్పుకోవడమే తప్ప, సాధించిందేమీ లేదు.
వ్యవసాయ రంగంలో ఎరువుల తయారీకి అవసరమైన ముడి పదార్థాలు, రసాయనాలు కూడా పెద్ద మొత్తంలో విదేశాల నుంచే దిగుమతి అవుతున్నాయి. ఇది ఆహార భద్రతపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. చమురు ధరలు పెరిగితే ఎరువుల ధరలు పెరుగుతాయి. దాని ప్రభావం రైతులపై పడుతుంది. ఉత్పత్తి ఖర్చులు పెరిగి, చివరికి వినియోగదారులపై భారం పడుతుంది.
ప్రస్తుతం ప్రపంచ రాజకీయ పరిణామాలు కూడా ఈ సంక్షోభాన్ని మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి. మధ్యప్రాచ్య దేశాల మధ్య ఉద్రిక్తతలు, శక్తివంతమైన దేశాల జోక్యం వల్ల పరిస్థితులు మరింత అస్థిరంగా మారుతున్నాయి. గతంలో కూడా ఇలాంటి పరిస్థితుల్లో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేశాయి. ఈసారి కూడా అదే పరిస్థితి పునరావృతం కావచ్చనే ఆందోళన ఉంది.
ఈ నేపథ్యంలో భారత్ ముందుచూపుతో వ్యవహరించాలి. తక్షణ చర్యలతో పాటు దీర్ఘకాలిక వ్యూహాలు రూపొందించాలి. మొదటగా చమురు వినియోగాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలి. రవాణా రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగంగా పెంచాలి. 2030 నాటికి కనీసం 30 శాతం వాహనాలు ఎలక్ట్రిక్గా మార్చే లక్ష్యాన్ని కచ్చితంగా అమలు చేయాలి.
పునరుత్పాదక ఇంధనాలపై పెట్టుబడులు పెంచాలి. ప్రస్తుతం ఉన్న 180 గిగావాట్ల పునరుత్పాదక సామర్థ్యాన్ని 2030 నాటికి 500 గిగావాట్లకు పెంచే లక్ష్యాన్ని వేగవంతం చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో సోలార్ పంపుసెట్లను విస్తృతంగా ప్రవేశపెట్టాలి. దీని ద్వారా వ్యవసాయ రంగంలో డీజిల్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.
వ్యూహాత్మక చమురు నిల్వలను పెంచుకోవాలి. ప్రస్తుతం భారత్ వద్ద 5–6 మిలియన్ టన్నుల నిల్వలు మాత్రమే ఉన్నాయి, ఇవి 9–10 రోజుల అవసరాలకు సరిపోతాయి. కనీసం 30 రోజుల అవసరాలను తీర్చగల స్థాయికి నిల్వలను పెంచడం అవసరం. దేశీయ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలి.
దిగుమతులపై ఆధారపడకుండా స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించాలి. “ఆత్మనిర్భర్ భారత్” లక్ష్యాన్ని వాస్తవ రూపంలో అమలు చేయాలి. అంతిమంగా ప్రజల్లో అవగాహన పెంపొందించడం కూడా అంతే ముఖ్యం. అవసరం లేని ఇంధన వినియోగాన్ని తగ్గించడం, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వినియోగాన్ని పెంచడం వంటి అలవాట్లు పెంపొందించాలి.
ప్రస్తుత ఆయిల్ సంక్షోభం భారత్కు ఒక హెచ్చరిక. ఇది కేవలం తాత్కాలిక సమస్య మాత్రమే కాదు, భవిష్యత్తులో మరిన్ని, మరింత పెద్ద సవాళ్లకు సంకేతం. ఈ సంక్షోభమే సావకాశంగా ఇంధన స్వయం సమృద్ధి దేశంగా దృఢంగా సాగడానికి, ఎదగడానికి సానుకూల సమయం ఇది.

