ఇప్పటిదాకా నాలోని ఉత్తేజం, ఉద్వేగం ఇప్పుడు ఆయనలో ప్రవేశించాయి. నాచేయి బిగ్గరగా పట్టుకుని వదలకుండా, ఆనాటి ఊసులు నాతో కొద్దిసేపు కలబోసుకున్నారు. పాలకుర్తి ప్రాంత ఆనాటి, నేటి ప్రముఖులని, ప్రజలందరినీ కలుసుకుని, ఆలింగనం చేసుకున్నంత ఆనంద పడ్డారు. ‘ఇవ్వాళ నేను గొప్ప ఉద్యమ వైతాలిక వారసుడిని కలిశా’నంటే, ‘కాదు నేనే పాలకుర్తి ప్రాంత ప్రముఖుడిని కలిశాన’న్నారు. అది ఆయన అతి సాధారణ గొప్ప ఔన్నత్యానికి, అత్యంత నిరాడంబరతకు, సాయుధ పోరాట స్ఫూర్తికి, ఆయన ఉద్యమ నేపథ్య మూర్తికి తార్కాణాలు. సుర‘వరం’తో పాలకుర్తి ‘మార్గం’లో… కొన్ని జ్ఞాపకాలు! అడుగు చీఫ్ ఎడిటర్ డా.మార్గం లక్ష్మీనారాయణ ప్రత్యేక వ్యాసం
జోహార్! కామ్రెడ్ సురవరం సుధాకర్ రెడ్డి!
సుర‘వరం’తో పాలకుర్తి ‘మార్గం’లో… కొన్ని జ్ఞాపకాలు!
అది 2001వ సంవత్సరం. అప్పటికే నేను నాగర్ కర్నూలులో వార్త స్టాఫ్ రిపోర్టర్ గా ఉన్నాను. అనతి కాలంలోనే నేను రాసిన అనేక వార్తా కథనాలు నన్ను జర్నలిస్టుగా బాగా ఎస్టాబ్లిష్ చేశాయి. నల్లమలలో నక్సల్స్, పోలీసులు, వెనుకబాటుతనం, వలసలు, వారి వెతలు, అటవీ ప్రాంతాలు, ప్రజల సమస్యలు, పెండింగ్ ప్రాజెక్టులు, చారిత్రకాంశాలు, వాటి ఆధారాలు ఎన్నో రాసే అవకాశం ఇచ్చింది నాగర్ కర్నూలు. ‘నిన్న బండచాకిరీ కొండమ్మ, నేడు పాఠాల పంతులమ్మ’ శీర్షికతో వచ్చిన కథనం, ఆనాడు వార్తలో ‘జీవన విజయం’ అనే శీర్షిక ప్రారంభానికి ఆద్యమైంది. ఆతర్వాత కూడా అదే శీర్షికకు అనేక కథనాలు రాసే అవకాశం దక్కింది. నా ‘వార్త’లతోపాటు, నాక్కూడా మంచిపేరు వచ్చింది. పూర్తి అపరిచతమైన నాకు, ఆ మొత్తం ప్రాంతానికి ‘వార్త’లు నన్ను సుపరిచితుడిని చేశాయి. అక్కడ అప్పుడప్పుడే జర్నలిస్టుగా నిలదొక్కున్న సమయమది.
నాగర్ కర్నూలు పోస్టాఫీసు ఎదురుగా ఉన్న ఇంట్లో ఫస్ట్ ఫ్లోర్ లో మా ఆపీసుండేది. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలవుతోంది. కంప్యూటర్లో తల దూర్చి బిజీగా ఉన్న సమయంలో టౌన్ రిపోర్టర్ అహ్మదుల్లాఖాన్ పరుగున వచ్చాడు. ‘సార్ మీకీ విషయం తెలుసా? తెయదన్నాను. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి గారు వస్తున్నారట.’ యథాలాపంగా ‘ఎప్పుడు? ఎక్కడికి?’ అంటే, ‘నాగర్ కర్నూలుకే సార్, మరికొద్దిసేపటికే’ అన్నాడు. ఆ సమయంలో కార్యవర్గ సభ్యుడిగా ఉన్న లింగారెడ్డి గారి ఇంటికన్న సంగతీ చెప్పాడు. నాకు పెద్దగా పట్టించుకోవాల్సిన విషయంగా తోచలేదు. నా నిరాసక్తతని గుర్తించిన అహ్మద్, సార్ వెళ్ళి కలుద్దామా? అన్నాడు. అయినా పెద్దగా స్పందించలేదు. కానీ, లోలోపల ఏదో లాగుతోంది. వెళ్తే పోలా? అనిపించింది. చిన్నప్పుడు బహుషా 5వ తరగతి తెలుగు వాచకంలో అనుకుంటా, సురవరం ప్రతాప్ రెడ్డి గురించి చదువుకున్న పాఠం గుర్తుకు వచ్చింది. పత్రికా సంపాదకుడిగా, పరిశోధకుడిగా, పండితుడిగా, రచయితగా, ప్రేరకుడిగా, క్రియాశీల ఉద్యమకారుడిగా, బహుముఖాలుగా అనన్య సామాన్యంగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి గుర్తుకు వచ్చాయి. 1926లో అతను నెలకొల్పిన గోలకొండ పత్రిక తెలంగాణ సాంస్కృతిక గమనంలో మైలురాయి. అందులోని సంపాదకీయాలు నిజాంని సూటిగా ప్రశ్నించేవి. నిజాంకు కోపం వచ్చి, సంపాదకీయాలు సమాచార శాఖ అనుమతితోనే ప్రచురించాలని నిబంధన పెట్టాడు. దాన్ని తిప్పికొడుతూ ప్రతాప రెడ్డి ప్రపంచ మేధావుల సూక్తులను సేకరించి సంపాదకీయానికి బదులుగా ప్రచురించాడు. అది మరింత సమస్యగా నిజాం ప్రభుత్వం భావించిందట. అంతటి మేధావి, తెలంగాణ పత్రికలకు మొదటి, రెండో తరం మహా మనిషి, పైగా నేనూ పత్రికా రంగంలోనే ఉన్నాను. గ్రంథకర్త, జర్నలిస్టు రాపోలు ఆనంద భాస్కర్ గారి స్ఫూర్తితో అప్పటికే అప్పటి ‘ఆంధ్రజ్యోతి’లో, ఇప్పటి ‘సాక్షి’ మాతృక చెన్నూరి నాగరాజు గారి ‘సాక్షి’కి ఉప సంపాదకుడిగా పని చేసి, డాక్టర్ రాపోలు సత్యనారాయణ గారి చొరవతో సిరికొండ భాస్కర్ ‘ఓరుగల్లు టైమ్స్’, దాసరి యాకయ్య ‘అభిప్రాయం’, కమ్మగాని రమేశ్ ‘పాలకుర్తి వాణీ’ పత్రికలను సంపాదకుడిగా ప్రారంభించి ఉన్నాను. ‘జర్నలిస్టూ, ప్రతాపరెడ్డి వంశపారంపర్యుడు, పైగా కమ్యూనిస్టు నాయకుడు, సీపీఐకి రాష్ట్ర కార్యదర్శి.. కలుద్దామా?’ అనిపించింది.
అప్పట్లో 23 తెలంగాణ ఉద్యమవేదికలతో ఏర్పడ్డ తెలంగాణ ఐక్యవేదిక, తెలంగాణ సాధన సమితి, తెలంగాణ రాష్ట్ర సమితిలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని రగుల్ కొల్పుతున్నాయి. మిగతా అన్ని రంగాల్లో లాగే, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలోనూ పాలమూరు వెనుకబడి ఉంది. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమంపై ఆయనతో ఏదైనా మాట్లాడితే? సాలోచనగా అహ్మద్ తో ‘వెల్దాం పద’ అంటూ బయలుదేరాను.
దారి పొడవునా ఒకటే ఆలోచనలు. ఆయన్ని ఏమడగాలి? ఆయన స్పందనలెలా ఉంటాయి? నా నేపథ్యాన్ని గుర్తు చేస్తే కచ్చితంగా ఆయన సానుకూలంగా స్పందిస్తారు లే? అన్న ధైర్యంతో ఆయన ముందు నిలబడ్డాను. లింగారెడ్డి గారు నన్ను సుధాకర్ రెడ్డిగారికి పరిచయం చేశారు.
ముట్టుకుంటే కందిపోయేంత రంగుతేలి, సకుమారంగా, సాదా సీదా బట్టల్లో సాత్వికంగా, సూటిగా కళ్ళల్లోకే నవ్వుతూ కరచాలనం చేశారు. నా ఒంట్లో ఏదో తెలియని ఉత్తేజం. మనుసులో ముసురుకున్న ఉద్వేగం.. నేను సురవరం ప్రతాప్ రెడ్డి గారిని కలిశానా!? సుధాకర్ రెడ్డి గారినే కదా? అని లిప్తపాటు తడబాటు.. సర్, నా పేరు చెప్పి, ‘మాది పాలకుర్తి’ అన్నాను. అంతే, ఒక్కసారిగా ఆయన ‘పాలకుర్తా?’ అన్నారు. ‘అవును సర్, పాలకుర్తె.. తెలంగాణ సాయుధ పోరాటం, విసునూరు దేశ్ ముఖ్, చాకలి ఐలమ్మ, షేక్ బందగీ, దొడ్డి కొమురయ్య, నల్లా నర్సింహులు, వరదాచారి, పాల్కురికి సోమనాథుడు, బమ్మెర పోతన, వల్మీడి వాల్మీకిల పాలకుర్తే మా పాలకుర్తి’ అన్నాను. ‘ఆ ఊరి వాడివా?’ అణువంత ఆశ్చర్యంతో అడిగారు. ‘అవును. అదే ఊరు’ అన్నాను. అంతే, వెంటనే ఇద్దరి పాత్రలూ రివర్స్ అయ్యాయి. ఇప్పటిదాకా నాలోని ఉత్తేజం, ఉద్వేగం ఇప్పుడు ఆయనలో ప్రవేశించాయి. నాచేయి బిగ్గరగా పట్టుకుని వదలకుండా, ఆనాటి ఊసులు నాతో కొద్దిసేపు కలబోసుకున్నారు. పాలకుర్తి ప్రాంత ఆనాటి, నేటి ప్రముఖులని, ప్రజలందరినీ కలుసుకుని, ఆలింగనం చేసుకున్నంత ఆనంద పడ్డారు. ‘ఇవ్వాళ నేను గొప్ప ఉద్యమ వైతాలిక వారసుడిని కలిశా’నంటే, ‘కాదు నేనే పాలకుర్తి ప్రాంత ప్రముఖుడిని కలిశానని’ అన్నారు. అది ఆయన అతి సాధారణ గొప్ప ఔన్నత్యానికి, అత్యంత నిరాడంబరతకు, సాయుధ పోరాట స్ఫూర్తికి, ఆయన ఉద్యమ నేపథ్య మూర్తికి తార్కాణాలు.
అయితే, కొద్దిసేపటికే నాలోని జర్నలిస్టు ముందుకు వచ్చాడు. సురవరం సుధాకర్ రెడ్డిని ప్రశ్నలతో ముంచెత్తాడు? నల్లగొండ ఎంపీగా చేస్తున్న అభివృద్ధి, సీపీఐ ఉద్యమ కార్యాచరణ, తెలంగాణ ఉద్యమం పట్ల సీపీఐ వ్యతిరేకత, ఉదాసీనత, సాయుధ పోరాట ఉద్యమాల పార్టీ అయి ఉండీ తెలంగాణ ఉద్యమాలకు దూరంగా ఉంటడం, పట్టించుకోకపోవడం, ప్రజా సమస్యలపై పార్టీ ఉద్యమాల తగ్గుముఖం, కమ్యూనిస్టు పార్టీగా బూర్జువా పార్టీలతో పొత్తులు, ఎత్తులు, అవగాహనలు వంటి అనేక అంశాల మీద ప్రశ్నలతో ఆయనపై దాడి చేసినంత పనైంది. అయినా, ఆయన ఓర్పుతో నేర్పుగా, నెమ్మదిగా నవ్వుతూ, సాలోచనగా జవాబులిచ్చారు. ఎంతైనా ఆయనా ఒకప్పటి, ఇప్పటికీ రాస్తూ ఉన్న జర్నలిస్టే కదా!? ఆయనను కొద్దిసేపు కలిసిన ఆనాటి జ్ఞాపకాలతోపాటు అవన్నింటినీ మోసుకుని, దాసుకుని, ఒడబోసుకుని ఆరోజు, ఆతర్వాత అనేక కథనాలు, వార్తల్లో కూడా రాసుకున్నాను. ఇప్పటి ఈ జ్ఞాపకాల దాకా! అయితే ఇప్పుడు ఆయన లేరు. ఆయన ఉద్యమ అడుగు జాడలు, ఆయన జ్ఞాపకాలు మాత్రమే ఉన్నాయి. జోహార్! కామ్రెడ్ సురవరం సుధాకర్ రెడ్డి!


