దివంగత ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పై గూడూరు వాస్తవ్యులు పాలడుగు రత్నాకర్ రావు రాసిన వ్యాసం
ఎదురీతే జీవితం.. ప్రభంజన్ ప్రస్థానం
మా ఊరివ్యక్తి ఒకతను ఈరోజు ఉదయం ఫోన్ చేసి ప్రొఫెసర్ ప్రభంజన్ కుమార్ యాదవ్ గారు చనిపోయినట్లు చెప్పడంతో విషాదానికి గురైయ్యాను. 2024 సంవత్సరం చివరి నెల అనుకుంటా నేను మిత్రులు అనుముల ఎల్లయ్య గారితో కలసి “గూడూరు చరిత్ర” పుస్తకాన్ని అందించడానికి నారపల్లిలో ఉన్న ప్రభంజన్ కుమార్ గారి ఇంటికి వెళ్ళాము. మెయిన్ రోడ్డుకు సమీపంలోనే గ్రౌండ్ ఫ్లోర్ తో కలసి రెండు అంతస్థుల మేడ. కింది భాగంలో బహుజన మీడియా స్టూడియో రూమ్ ఉన్నట్లుంది. ఫస్టు ఫ్లోర్ లో తన నివాసం. ముందు హాల్లో లైబ్రరీ. తను ప్రచురించిన పుస్తకాలతోపాటు అనేక పుస్తకాలున్నవి. ఇంటిలో ఒంటరిగా ఉన్నట్లు కనిపించాడు. అప్పటికే అతని ఆరోగ్యం సరిగా లేనట్లు అనిపించింది. మాట లోగొంతులో నుండి వస్తున్నట్లుగా ఉంది. ఇక మేము వెళ్లిన పని గుర్తుంచుకొని, వెంట తీసుకువెళ్లిన శాలువ కప్పి, “గూడూరు చరిత్ర” పుస్తకం చేతిలో పెట్టి, తిరిగి వస్తున్నప్పుడు ‘రత్నాకర్ రావు గారు నా పుస్తకాల సెట్టు ఒకటి మీకు పంపిస్తానండి!’ అంటూ కింది వరకు వచ్చి మమ్మల్ని సాగనంపాడు. ఆరునెలలలోపే ఈ వార్త వినవలసి రావడం విచారం.
ఊరిలో నేను వ్యవహారం చేస్తున్న రోజుల్లో తను వాళ్ల ఇంటి ఆవరణ యందే సత్యశోధక విద్యాపీఠం ఏర్పాటు సందర్భంగా నన్ను అతిథిగా ఆహ్వానించాడు. ఉద్యోగ రీత్యా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నా, గూడూరుకు వచ్చినపుడు నన్ను వ్యక్తిగతంగా కలసి ఎన్నో విషయాలు చర్చిస్తుండే అతను, రచన ఇన్స్టిట్యూట్ లో డిప్లామా ఇన్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ కోర్సును నేను డిస్టెన్స్ లో చేస్తున్నపుడు సంబంధిత సబ్జెక్టులలో నాకెంతగానో సహకరించాడు. తను ఓయూలో ఎంసీజే చేసిన వ్యక్తిగా అతని అనుభవం నా కెంతగానో ఉపయోగ పడింది.
2017లో నా ఆర్టికల్ ఒకటి నమస్తే తెలంగాణ ఆదివారం అనుబంధంలో ప్రచురితం అయింది. అది చదివి ఫోన్లో అభినందించాడు నన్ను. 2022 జనవరి లో నా పుస్తకం “అక్షర పలకరింపులు” మేడిపల్లి మా మేనకోడలు లక్ష్మీశ్రీనివాస్ రావు గారి ఇంటిలో ఆవిష్కరణ సందర్భంగా ఆత్మీయ అతిథిగా పాల్గొన్నాడు. వివిధ పత్రికల్లో పనిచేసుకుంటూనే ఉన్నత విద్యలు అభ్యసించి ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసుకు ఎంపికై క్షేత్ర ప్రచారాధికారిగా పనిచేశాడు. ఆ తరువాత తెలంగాణ విశ్వవిద్యాలయం నందు ఆచార్యునిగా పనిచేస్తూ పదవీ విరమణ పొందాడు. అనేక పుస్తకాలు వెలువరించి రచయితగాను, పబ్లిషర్ గాను, వక్తగాను, జర్నలిస్టుగాను, పరిశోధకుడుగాను, సామాజిక ఉద్యమకారుడుగాను వివిధ వర్గాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. గూడూరు గ్రామ విద్యాధికుల్లో ప్రభంజన్ కుమార్ గారిని, ఉన్నత స్థానంలో నిలిపిన వారి తల్లి, తండ్రి యాదనాల సోమయ్య-కొమురమ్మలు చిరస్మరణీయులు. జీవించిన కాలమంతా ప్రభంజనంగా వెలుగొందినాడు. ప్రభంజనుడికి అక్షర నివాళులు.

✍పాలడుగు రత్నాకర్ రావు

