1990లో నేను హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ లో ఉండగా, ‘డాక్టర్ బిఆర్ అంబేద్కర్’ సినిమాకు పని చేసే అవకాశం వచ్చింది. మా గురువు ఉపాధ్యాయ (దిడ్డి లక్ష్మీనారాయణ, టీచర్)గారు ఆ సినిమాకు స్క్రిప్ట్ రైటర్. వారికి నేను అసిస్టెంట్ స్క్రిప్ట్ రైటర్. నేను అంబేద్కర్ పై వచ్చిన పరిశోధక గ్రంథాలు, అధ్యయన పుస్తకాలు చదివి, గురువుగారితో చర్చించి, ఆయన చెబుతూ ఉంటే రాస్తూ ఉండాలి. అయితే ఆ సినిమాకు సీన్, షాట్ డివిజన్ సహా మొత్తం స్క్రిప్ట్ అంతా నా చేతి రాతతోనే ఉండేవి. అన్న సుద్దాల అశోక్ అదే సినిమాకి పాటలు రాయడానికి మాతో కలిశారు. అశోకన్న, నా అటాచ్ మెంట్ ను ఉపాధ్యాయగారు ప్రశ్నిస్తే, అశోకన్న, ‘మా ఇద్దరిదీ ఒకే ఆత్మ. రెండు శరీరాలు’ అని చెప్పినంతగా మా ముగ్గురి కలయిక, అదో అద్భుతం. శ్రీశ్రీకి ఆరుద్రలా…అశోకన్న, నన్ను లక్ష్మీనారాయణ నుంచి ‘మార్గం’గా మార్చిన సన్నివేశాలు సహా, ఒకరిని విడిచి ఒకరు ఉండలేని మా ప్రతి క్షణం అనుభూతితో కూడిన మహాద్భుత ప్రయాణం వరంగల్ మీదుగా, పాలకుర్తి దాకా సాగింది. ఇదే సినిమాకు కాతోజు వెంకటేశ్వర్లు, లక్ష్మణ్ ఏలె ఆర్ట్ డైరెక్టర్లుగా కలిశారు. విముక్తి కోసం డైరెక్టర్ ఉదయ్ కుమార్ గారు ఈ సినిమాకు డైరెక్టర్. నెల్లూరు జిల్లా నాయుడుపేటకు చెందిన డాక్టర్ పద్మావతి గారు నిర్మాత. మేమంతా మెహదీపట్నం సెయింట్ ఆన్స్ కాలేజీ దరిదాపులో ఉండేవాళ్ళం. నిరంతరం చర్చలు, స్రుజనాత్మక స్క్రిప్టు తయారీలో అంతా బిజీబిజీగా ఉండేవాళ్ళం. అంతకంటే ఎంజాయ్ చేసేవాళ్ళం.
సుద్దాల అశోక్ సినిమాల్లోకి వెళ్ళడం కరెక్టా? కాదా? అన్న మీమాంస చర్చని సీనియర్ జర్నలిస్టు దుర్గం రవిందర్ అన్న మా ముగ్గురి మధ్యకు తెచ్చారు. ఈ చర్చ ఉస్మానియా యూనివర్సిటీ గేటు బస్టాప్ దాకా సాగి, అక్కడే బస్ స్టాప్ లోనే చర్చోపచర్చగా చాలా సేపు కొనసాగింది. ఒరిజనల్ రచయిత కనుమరుగై కమర్షియల్ గా మారతాడని రవీందర్ అన్న ఆందోళన. అప్పుడు నిఖార్సైన సామాజిక బాధ్యత కలిగిన రచయితలు లేకుండా పోతారని ఆవేదన. సినిమాల్లోనూ అద్భుత సాహిత్యం రావచ్చు కదా? అన్నది ఉపాధ్యాయగారు, నా వాదన. చివరకు నిర్ణయాన్ని అశోకన్నకే వదిలేశాం. ఆ తర్వాత అశోకన్న అశోక్ తేజగా వందల సినిమాలకు వేల పాటలు రాసి, జాతీయ అవార్డు కూడా గెలుచుకున్నాడనేది వేరే విషయం.
ఈ సమయంలోనే దుర్గమన్న విద్యానగర్ అండర్ రైల్వే బ్రిడ్జి దగ్గర నాకు అందెశ్రీని పరిచయం చేశారు. పాతబడిన ప్యాంట్, షర్ట్ తో, గ్రామీణ కూలీలాగా కనిపించాడు. నా అనుమాన్ని నివ్రుత్తి చేస్తూ, ‘అతడు చదువుకోలేదు. సహజకవి. మేస్త్రీ పని చేస్తాడు. మిగతా సమయాల్లో అద్భుతంగా రాస్తాడు. పాడుతాడు. అంతకు మించి మంచి మనిషి. మనం ప్రోత్సహించాల్సిన వాగ్గేయకారుడు. పైగా మీ వరంగల్ జిల్లా వాడే.’ అని చెప్పుకొచ్చాడు. నాకప్పుడు సహజకవి బమ్మెర పోతన, మామిండ్ల సాయిలు గుర్తుకు వచ్చారు. అప్పుడే అతడో పుస్తకాన్ని వేస్తున్నాడని, దానికి ముందు మాట సీనియర్ జర్నలిస్టు జి. కృష్ణ గారు రాస్తున్నారని చెప్పాడు. కృష్ణ గారి దగ్గరకు ప్రతిరోజూ వెళ్లే వాళ్ళల్లో నేనూ ఒకడిని. ఆయన ముందు మాట రాస్తున్నారంటే, మాటలు కాదు. ఆ తర్వాత తరచుగా అక్కడే దుర్గమన్నతోపాటుగా కలుస్తూండేవాళ్ళం. ఆ తర్వాత ఒకటి రెండు సార్లు కృష్ణ గారి దగ్గరా కలుసుకున్నాం.
ఆతర్వాత నా డిగ్రీ పూర్తి చేసి, పాలకుర్తిలో ఈనాడులో, ఆతర్వాత హైదరాబాద్ ఆంధ్రజ్యోతిలో ఉప సంపాదకుడిగా ఉంటూనే, నేను మరికొన్ని సినిమాల్లో పని చేస్తూండే వాడిని. దుర్గమన్న నేను నిత్యం ప్రముఖ పెయింటర్, ఆర్టిస్టు, డిజైనర్ లక్ష్మణ్ ఏలె స్డూడియోలో, విద్యానగర్ లోనూ కలుస్తుండేవాళ్ళం. అదే సమయంలో అందెశ్రీ కూడా కలుస్తుండేవారు. ఇదే సమయంలో నా ‘నిరంతరం’ సినిమా పూర్తైంది.
…కాలం కదిలిపోతూనే ఉంది. మా మా వృత్తుల్లో బిజీగా మారి, కలయికలు… ‘కల’ గానే మిగిలిపోయాయి. అయితే అందెశ్రీ పాటలు మమ్మల్ని పలకరిస్తూనే ఉన్నాయి. మేమా పాటలతో పలవరిస్తూనే ఉన్నాం. కొంత కాలం తర్వాత మమ్మల్ని మళ్ళీ సోమనాథ కళాపీఠమే కలిపింది.

మా సూచనతో సోమనాథ పురస్కారం
సహజ కవి, వాగ్గేయకారుడిగా, అప్రతిహతంగా దూసుకు వస్తున్న అందెశ్రీకి సోమనాథ పురస్కారం ఇవ్వాలనేది డా. ప్రభంజన్ అన్న, నా సంకల్పం. అందుకు పట్టుబట్టింది కూడా మేమిద్దరమే. అప్పుడు ప్రభంజన్ అన్న పీఠం సలహాదారుగా, నేను పురస్కారాల ఎంపిక కమిటీకి సమన్వయకర్తగా ఉన్నాం. మా ప్రతిపాదనను పీఠం అధ్యక్షుడు డా. రాపోలు సత్యానారాయణ గారికి చెప్పాం. వారు సానుకూలంగా ఉన్నప్పటికీ, ఎంపిక కమిటీకి ఎంట్రీ పంపాలన్నారు. అలాగే చేశాం. అప్పటికే అందెశ్రీతో, ఆయన రచనలతో మాకు మంచి పరిచయం ఉంది. అప్పటికి వచ్చిన ఎంట్రీలతోపాటు అందెశ్రీ ఎంట్రీని కూడా పరిశీలించిన అవార్డుల ఎంపిక కమిటీ అందెశ్రీకే జై కొట్టింది. ఆ విధంగా అందెశ్రీని సోమనాథ కళాపీఠం పురస్కారం వరించింది.
అందెశ్రీ డాక్టరేట్ కు అంకురార్పణ పాలకుర్తిలోనే
పీఠం పురస్కారాల ఉత్సవం పాలకుర్తిలో 2006 జూన్ 25న జరిగింది. ఆ కార్యక్రమానికి కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ గోపాల్ రెడ్డి ముఖ్య అతిథి. తెలుగు విశ్వవిద్యాలయ పూర్వ కులపతి ప్రొఫెసర్ పేర్వారం జగన్నాథం విశిష్ట అతిథి. పీఠం సలహాదారులు మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్, డా.ప్రభంజన్, డా.బుచ్చిరెడ్డి, పల్లేర్ల వీరాస్వామి, పీఠం కార్యవర్గం మొత్తం హాజరయ్యారు. ఈ సభకు అధ్యక్షత వహించిన డా.రసన, పీఠం తరపున అందెశ్రీకి కేయూ గౌరవ డాక్టరేట్ ఇస్తే, కేయూకి, ఆ డాక్టరేట్ కి కూడా గౌరవంగా ఉంటుందని వేదిక మీది నుండే ప్రతిపాదించారు. సభ మొత్తం తమ కరతళాధ్వనులతో కూడిన హర్షధ్వానాల మద్దతు వ్యక్తం చేసింది. పీఠం ప్రతిపాదనకు ఆచార్య పేర్వారంతోపాటు కేయూ వీసీ కూడా సానుకూలంగా స్పందించారు.
అనుకున్నట్లే… కేయూ గౌరవ డాక్టరేట్
ఆ తర్వాత డా. రసన గారు, నేను హనుమకొండకు వెళ్ళినప్పుడల్లా వీసీ గోపాల్ రెడ్డిగారిని ఆయన ఇంటివద్దో, వర్సిటీలోనో కలిసి అందెశ్రీకి డాక్టరేట్ విషయాన్ని ప్రస్థావించేవాళ్ళం. నేను డిగ్రీ చేసే రోజుల్లో వీసీ గోపాల్ రెడ్డిగారు ఆర్ట్స్ కాలేజీకి వైస్ ప్రిన్సిపాల్ గా ఉంటూ ఇంగ్లీష్ బోధించేవారు. అందువల్ల ఆయనతో నాకు చనువెక్కువ. మా ప్రయత్న ఫలమో, గోపాల్ రెడ్డిగారి సంకల్ప బలమో కానీ, అనుకున్నట్లే జరిగింది. 2008లో అందెశ్రీని కేయూ గౌరవ డాక్టరేట్ వరించింది. అందెశ్రీ పాట తరించింది. అభిమాన లోకం హర్షించింది.

పీఠం సెంటిమెంటే రుజువైంది
అతిశయోక్తి కాదు కానీ, సోమనాథ కళాపీఠం అవార్డులకు ఒక సెంటిమెంట్ఉంది. అది కొనసాగుతూనే ఉంది. గతంలో పీఠం గుర్తించి, పురస్కరించి, గౌరవించిన పలువురికి యూనివర్సిటీల గౌరవ డాక్టరేట్లు వచ్చాయి. తెలుగు భాషా వికాసానికి ఎనలేని సేవలందించిన తిరుమల రామచంద్ర గారికి, పీఠం స్వచ్ఛంద భాషా సేవ పురస్కారం అందించాక, తెలుగు విశ్వవిద్యాలయం తిరుమల రామచంద్రకు గౌరవ డాక్టరేట్ ను ఇచ్చి సత్కరించింది. అలాగే అందెశ్రీకి జరిగింది. జాతీయ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజకూ జరిగింది. ఆ తర్వాత నాగర్ కర్నూలుకు చెందిన శతాధిక గ్రంథకర్త, వయోధికులు కపిలవాయి లింగమూర్తి గారి ఎంట్రీని రసన గారికి నేను సూచించాను. వయోధికులైన లింగమూర్తి గారికి ముందు అవార్డునివ్వడమే సముచితమని పీఠం అవార్డుల కమిటీ భావించింది. ఆ విధంగా కపిలవాయి లింగమూర్తి గారికి సోమనాథ పురస్కారం అందచేసిన తర్వాతే, తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చింది.
ఆ తర్వాత అందెశ్రీ అటు సినిమాలు, పాటలు, ఇటు తెలంగాణ ఉద్యమాలతో బీజీ అయ్యారు. తెలంగాణ ధూం దాం కార్యక్రమాలు, ఉద్యమ వేదికలపై పాటలతో ఊపిరి సల్పనంతగా ఉండేవారు. ఆయన ఎక్కడ కలిసినా నన్ను ‘బాపూ!’ అని పిలిచేవారు. నేననూ అలాగే సంబోధించేవాణ్ణి. అలాగే అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చేవారు. వచ్చినప్పుడల్లా మా ఇంట్లో అడిగి మరీ జొన్న రొట్టె చేయించుకుని తినేవారు. మా పిల్లలను ఒళ్ళో వేసుకుని పాటలు వినిపించేవారు. ఎన్నో ఊసులు చెప్పేవారు. అనుభవాలను పంచుకునే వారు. ఆయన పరిచయాలను మాకు కలిగించి, మా బాగోగులు చూసుకునేవారు.
అందెశ్రీ జయజయహే గీతం తెలంగాణ మాతృ గీతంగా ఎంపికయ్యాక, పలకరించి అభినందిస్తే, అమితానంద పడ్డారు. అంతకుముందు ఆయన నిర్వేదం వ్యక్తం చేసేవారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి ఆయన పాటకిచ్చిన గౌరవంతో, ఆయన మళ్ళీ ఉత్తేజితులయ్యారు.
మా 35ఏళ్ళ పాటల ప్రయాణంలో ఇప్పుడు ఆయనలేరు. ఆయన జ్నాపకాలే మిగిలాయి. ‘బాపూ!’ అన్న పిలుపు లేదు. కానీ, భావుకతతో కూడిన ఆయన పాటలు పలకరిస్తున్నాయి. ఆ పాటలతో మా ఒల్లు పులకరిస్తూనే ఉన్నది. ఆ పాటలు మాయమవుతున్న మనిషిని, మానవత్వ కర్తవ్యాన్ని గుర్తు చేస్తూనే ఉన్నాయి.
-✍ డా. మార్గం లక్ష్మీనారాయణ

