OPERATION KAGAR|‘ఆపరేషన్ కగార్’ ‘డెడ్’ లైన్
MAOIST|మావోయిస్టుల పాలిట ‘డెత్’ లైన్
POLICE|పోలీసు, బలగాలకు ‘డు ఆర్ డై’ లైన్
‘ఆపరేషన్ కగార్’ ప్రభుత్వానికి, పోలీసులు, భద్రతా బలగాలకు ‘డెడ్ లైన్’ గా నలిచింది. నిర్ణీత 2026, మార్చి ‘డెడ్ లైన్’ లో ఈ ఆపరేషన్ ను విజయవంతంగా ముగించాలి. ఇదే ‘డెడ్ లైన్’ మావోయిస్టుల పాలిట ‘డెత్ లైన్’ గా మారింది. బతకాలంటే యుద్ధం చేయాల్సిందే. ఆయుధాన్ని దించలేరు. ఎత్తిన ఆయుధంతో వెనక్కి వెళ్ళలేరు. ఆపరేషన్ పూర్తి కావాలంటే, నక్సల్స్ అంతం కావాల్సిందే. సరిగ్గా ఇప్పుడదే జరుగుతోంది. ఇక పోలీసులు, బలగాలకు ఇదే ‘డెడ్ అండ్ డెత్’ లైన్, ‘డు ఆర్ డై’ లైన్ గా పరిణమించింది. ఆపరేషన్ మొత్తం పోలీసు, బలగాలపైనే ఆధారపడింది. ప్రాణాలకు తెగించి, సాయుధ గెరిల్లా పోరాటంలో ఆరితేరిన బలమైన శత్రువుతో పోరాటం. విధి కర్తవ్యం, విద్యుక్త ధర్మం. కాబట్టి, చావో రేవో తేల్చుకోవాల్సిందే. ముందుకే తప్ప వెనక్కి పోలేని విచిత్ర, విపత్కర పరిస్థితి. మొత్తానికి పరిస్థితి “పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం”లా ఉంది.
హైదరాబాద్, నవంబర్ 24 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
భారతదేశంలో అంతర్గత భద్రతకు పెద్ద సవాలుగా నిలిచిన మావోయిస్టు ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు ‘ఆపరేషన్ కగార్’ను చేపట్టాయి. ఈ ఆపరేషన్ మావోయిస్టులకు ‘డెత్ లైన్’గా, పోలీసులు, భద్రతా బలగాలకు ‘డూ ఆర్ డై’ లైన్ గా నిలిచాయి. ఈ దశలో వెనక్కి తగ్గే అవకాశం ఎవరికీ లేదు. మావోయిస్టులు తమ ఉనికిని కాపాడుకోవాలంటే పోరాటం చేయాలి. మరోవైపు పోలీసు బలగాలు సమస్యను పూర్తిగా సమూలంగా నిర్మూలించడంపై దృష్టి పెట్టాలి.
ఆపరేషన్ కగార్ నేపథ్యం
దేశంలోని చత్తీస్గఢ్, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, ఝార్ఖండ్ వంటి రాష్ట్రాల్లో గత ఆరు దశాబ్దాలుగా మావోయిస్టు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. అడవుల్లో బలమైన స్థావరాలు, స్థానికంగా బలం, భౌగోళిక అనుకూలతలతో మావోయిస్టులు చాలా కాలంగా ప్రభుత్వానికి సవాల్ గా నిలుస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, పోలీసులు-భద్రతా బలగాల సమన్వయంతో ముప్పేట దాడి చేస్తుండటంతో మావోయిస్టులు కకావికలం అవుతున్నారు.
‘కగార్’ ఎందుకు?
“కగార్” అంటే గద్ద. శత్రువుపై అప్రమత్తంగా, వేగంగా దాడి చేయడం అనే అర్థం. ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశ్యం మావోయిస్టుల అంతం. అలాగే దేశంలో అంతర్గత ‘లెఫ్ట్ టెర్రరిజా’న్ని రూపుమాపడం.
మావోయిస్టులకు ‘డెత్ లైన్’
ఈ ఆపరేషన్ మావోయిస్టుల పాలిట యమపాశం. అడవుల్లో శత్రు దుర్భేధ్య స్థావరాలను ఏర్పరుచుకుని, అవసరమైనప్పుడు దాడులు చేసే వ్యూహంతో ప్రభుత్వంపై యుద్ధం చేశారు. కానీ ఇప్పుడు, ఆధునిక సాంకేతికత, డ్రోన్ పర్యవేక్షణ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ బలోపేతం, విభిన్న రాష్ట్రాల సంయుక్త ఆపరేషన్లు వంటి చర్యల వల్ల మావోయిస్టుల ఉనికికే ప్రమాదం ఏర్పడింది.
మావోయిస్టులు ఒకప్పుడు పర్వతాలు, లోయలు, అటవీ ప్రాంతాలను తమ రాజ్యాలుగా భావించారు. కానీ ‘ఆపరేషన్ కగార్’ వల్ల ఆ భద్రతా వలయం దెబ్బతింది. వారి ఆయుధ నిల్వలు, ఆహారం సరఫరా మార్గాలు మూసుకుపోయాయి. క్రమంగా స్థానిక బలం తగ్గింది. దీంతో వారు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితి వారిని ‘డెత్ లైన్’ వైపు నెడుతున్నది.
పోలీసు, భద్రతా బలగాలకు ‘డు ఆర్ డై’ లైన్
మరోవైపు ‘ఆపరేషన్ కగార్’ భద్రతా బలగాలకు ‘డూ ఆర్ డై’ లైన్ గా పరిణమించింది. మావోయిస్టులుండే అటవీ ప్రాంతాల్లో ఆపరేషన్లు ఎప్పుడూ ప్రాణహానితో కూడినవే. చిన్న తప్పిదం కూడా పెద్ద ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది. అయినప్పటికీ, ఈ దశలో వారికి వెనక్కి తగ్గే అవకాశం లేదు. దేశ భద్రత కోసం, ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి కోసం ఆపరేషన్ను పూర్తి చేయడం అత్యవసరం. ఎలాంటి ప్రమాదాలనైనా ఎదుర్కొంటూ ఆపరేషన్ను విజయవంతం చేయాలి. మావోయిస్టుల ప్రభావాన్ని పూర్తిగా తగ్గించకపోతే సమస్య మళ్లీ పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి ఇది పోలీసు, భద్రతా బలగాలకు పరీక్షా సమయమే.
ప్రస్తుతం ‘ఆపరేషన్ కగార్’ దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించే ఆఖరి, కీలక దశలో ఉంది. మావోయిస్టులు ‘డెత్ లైన్’ లోనే ప్రయాణిస్తున్నారు. వారి బలగాలు, స్థావరాలు పూర్తిగా శక్తిహీనమవుతున్నాయి. అదేవిధంగా పోలీసు, భద్రతా బలగాలకు ఇది ‘డూ ఆర్ డై’ దశ, దేశ అంతర్గత భద్రత కోసం సమస్యను ముగించాల్సిన సమయం వచ్చింది. ఈ ఆపరేషన్ విజయవంతమైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అభివృద్ధి దిశగా అడుగులు పడతాయా? అన్నది చూడాలి. మొత్తానికి దేశ శాంతి, భద్రత, అభివృద్ధి కోసం ఈ ఆపరేషన్ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.

