వ్యవసాయాభివృద్ధికి ఎంత చేసినా తక్కువే. అన్నం పెట్టే రైతన్నలను కాపాడుకుంటేనే మన నోట్లోకి ముద్దపోతుంది. కార్పొరేట్ కంపెనీలను మించి వారికి రాయితీలు ఇవ్వడం కూడా మంచిదే. వ్యవసాయికంగా దేశాన్ని బలోపేతం చేస్తే..అనుబంధ రంగాలను ప్రోత్సహిస్తే దేశంలో ఆకలి చావులు ఉండవు. తక్కువ ధరలకు పంటలను ప్రజలకు అందించేలా కూడా కార్యాచరణ ఉండాలి. ఈ విషయంలో కేంద్ర రాష్ట్రాలు కలిసి వ్యవసాయాభివృద్ధికి, రైతుల సంక్షేమానికి బృహత్ ప్రణాళికలు రచించాలి. వ్యవసాయానికి తెలుగు రాష్ట్రాల్లో ఉచిత విద్యుత్ ఇస్తున్నారు. సబ్సిడీలు అందిస్తున్నారు. ధాన్యం సజావుగానే కొంటున్నామని అంటున్నారు. పాలకులు, ప్రతిపక్ష నేతలు రైతు జపం చేస్తున్నప్పటికీ వారి జీవితాలు మాత్రం బాగుపడడం లేదు. నిరంతర, నిరంతరాయ ఉచిత విద్యుత్ ఇస్తున్న తెలంగాణ తరహాలో దేశవ్యాప్తంగా ఉచిత విద్యుత్ అందించాలి. నిజానికి ఇదొక్కటే సరిపోదు. ముందుగా నదుల అనుసంధానం చేసైనా సరే, నీటి సదుపాయం కల్పించాలి. ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాలి. పండించిన పంటలకు లాభదాయక ధరలను ప్రకటించి, మార్కెటింగ్ సదుపాయం కల్పించాలి. వ్యవసాయాన్ని దండుగ కాకుండా పండుగ చేయాలి. పంటలకు గిట్టుబాటు లేకుండా ఎన్ని సబ్సిడీలు, సదుపాయలు కల్పించినా లాభం లేదు. ఇక ఉచిత విద్యుత్ సరఫరాకు తగ్గట్లుగా ఉత్పత్తి కూడా ముఖ్యమే. దేశంలో సరిపడా విద్యుత్ ఉందా? లేదా? అన్న ఆలోచన చేయాలి. ఉత్పత్తి అవకాశాలు పెంచుకోవాలి. సోలార్ విద్యుత్కు ప్రాధాన్యం ఇవ్వాలి. అప్పుడే విద్యుత్ సమృద్ధిగా లభ్యత కాగలదు. అనేక గ్రామాలకు, ఇప్పటికీ విద్యుత్ సరఫరా లేదు. అలాంటప్పుడు పంపిణీతో పాటు, లభ్యత కూడా సవాల్ కానుంది. ముందుగా దేశంలో నిరంతర విద్యుత్ ఉత్పత్తి కోసం కృషి జరగాలి. ఉన్న విద్యుత్ను ఇప్పుడు సరఫరా చేయడానికే సరిపోదు.
ఇక రైతుల ఆత్మహత్యలపై నివేదికలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. పైగా అలాంటి చావులను సహజ మరణాలుగా చిత్రీకరించే దుస్సాహసం ప్రభుత్వాలు చేస్తున్నాయి. అధిక శాతం ప్రజల జీవనాధారమైన వ్యవసాయరంగం పట్ల, రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతా రహితంగా వ్యవహరిస్తున్నాయన్న విమర్శలు ఉన్నాయి. విద్యుత్ నియంత్రణ బిల్లుకు నడుం బిగించిన కేంద్రం రాష్టాల్రపై ఒత్తిడి తెస్తోందన్న విమర్శలు ఉన్నాయి. విద్యుత్ నియంత్రణ అంతా ఇక కేంద్రం చేతిలోకి వెళితే రాష్ట్రాలపై విద్యుత్ పెను భారం తడిసి మోపెడు కానుంది. వ్యవసాయ రంగంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని, అగ్రి బేస్డ్, ప్రాసెసింగ్ పై దృష్టి పెట్టామని, వంటనూనె గింజల ఉత్పత్తిపైన ప్రధాని మోడీ గతంలో చేసిన ప్రకటన ఎలాంటి పురోగతి సాధించలేదు. నిజంగా ఏడున్నరేళ్లుగా ఈ రంగంలో మార్పులు ఉంటే నిత్యావసర ధరలు దిగి రావాలి. కానీ అలాంటి దేవిూ జరగడంలేదు. నిజానికి రైతులు ఉద్యమించడం వల్ల.. మోడీ సాగు చట్టాలను ఉపసంహరించుకున్నారు. ఇప్పటికీ ధాన్యం కొనుగోళ్లు సాగక రైతులు ఆందోళనకు గురవుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించు కోవడం లేదు. ఇంతకన్నా నిర్లక్ష్యం మరోటి ఉండదు. ఆరుగాలం కష్టించి పంటలు పండిస్తున్న రైతులు కాడి దించితే మన కడుపులు ఖాళీగా ఉండాల్సిందేనని గుర్తించాలి. ఈ కార్పోరేట్ల ఉత్పత్తులు మన ఆకలి తీర్చవని తెలుసుకోవాలి. రైతులకు సంబంధించి ప్రభుత్వాలు తీసుకుంటున్న కంటి తుడుపు చర్యలు కనీస ఫలితాలు ఇవ్వడం లేదు.
ఇలాంటి సందర్భంలో రైతులకు మేలు చేయాలనుకుంటే సాగు చట్టాలపై విస్తృతంగా దేశవ్యాప్తంగా కాకున్నా కనీసం పార్లమెంటులో చర్చ సాగేది. దేశంలో నూనె గింజల ఉత్పత్తి పెరిగితే నూనె ధరల పెరుగుదల జరిగేది కాదు. అందుకే వ్యవసాయ రంగం పురోగమించడానికి తీసుకుంటున్న చర్యలు మాత్రం గొప్పగా లేవనే చెప్పాలి. ప్రధానంగా దిగుబడులు తీవ్రంగా దెబ్బతీస్తున్నా.. వాటిని నిరోధించి, దేశీయంగా వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడంలో కేంద్రం విఫలం అవుతోంది. వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులను తగ్గించి, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, గిట్టుబాటు ధరలు కల్పించడం వంటివన్నీ మాటలకే పరిమితం అయ్యాయి. దేశంలో వ్యవసాయరంగం అత్యంత దయనీయంగా, సంక్షోభంలో కూరుకు పోయి ఉన్న సమయంలో ఈ భారీ దిగుమతులు జరగడం గమనార్హం. ఇంత భారీ మొత్తం దిగుమతుల కోసం ఖర్చు చేయకుండా, భారతీయ రైతారగంపై ఖర్చు చేసి ఉంటే పరిస్థితి ఎంతోకొంత మెరుగుపడి ఉండేది. అన్ని ప్రభుత్వాలూ రైతులను ఆదుకోవడం గురించీ, వ్యవసాయాభివృద్ధి గురించీ గొప్ప ఉపన్యాసాలు, హావిూలు ఇవ్వడంతోనే సరిపెడు తున్నాయనే విషయం వాస్తవ పరిస్థితులను గమనించినప్పుడు అర్థం అవుతుంది.
కేవలం ఒక్క సంవత్స రంలోనే దేశీయ వ్యవసాయానికి కేటాయించిన బడ్జెట్కన్నా మూడు రెట్లు ఎక్కువగా ఆహార ధాన్యాలను మనం దిగుమతి చేసుకున్నామంటే, మన నేతలు ఆ రంగం పట్ల ఎంత శ్రద్ధ పెడుతున్నారో అర్థమవుతుంది. హరిత విప్లవం నుంచి లబ్ధిపొంది, ఆహార ధాన్యాలలో స్వయం సమృద్ధిని సాధించిన దేశం ఇప్పుడు ఆ ఫలాలను నిర్లక్ష్యంగా జారవిడుచుకుంటూ, ఆహార ధాన్యాల దిగుమతిదారు అవుతోంది. పసుపు విప్లవాన్ని కావాలని ధ్వంసం చేసిన కారణంగా ఏర్పడిన ఫలితాల నుంచి మనం ఎలాంటి పాఠాలనూ నేర్చుకోలేదు. వంట నూనెల విషయంలో స్వయం సమృద్ధి సాధించిన మనం దశలవారీగా దిగుమతి సుంకాన్ని దాదాపుగా సున్నాకు దించిన నేపథ్యంలో మార్కెట్లోకి దిగుమతి ఉత్పత్తులు వెల్లువలా వచ్చిపడ్డాయి. వంట నూనెలు 60 శాతం దిగుమతి చేసుకుంటున్నాం. పెరుగుతున్న ఆహార ధరలను నియంత్రించేందుకు దిగుమతులు అవసరమన్న వాదనను అడ్డం పెట్టుకొని, విధానకర్తలు చౌకైన, సబ్సిడీ ఇచ్చిన వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులను అనుమతిస్తున్నారు. దేశంలో విస్తారంగా దిగుబడులు వచ్చినప్పటికీ, దిగుమతులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. దిగుమతులు ఎంత ఎక్కువగా వచ్చి పడితే, అంతగా సన్నకారు రైతుల జీవనోపాధిపై వేటు పడుతుంది. తమ ఉత్పత్తిని అమ్ముకోలేక, సన్నకారు రైతులు వ్యవసాయాన్ని వదిలి, చిన్నచిన్న ఉద్యోగాల కోసం పట్టణ ప్రాంతాలకు వలుస పోతున్నారు. దేశంలో ఉపాధి సృష్టి జరుగని పరిస్థితిలో, సన్నకారు రైతులను పట్టణాలకు వెళ్ళే పరిస్థితులు సృష్టించడమన్నది ఆర్ధికంగా అర్థరహిత విషయం.
సం‘క్షోభ’ ‘సాగు’ సవాళ్లు !

