-పేద, మధ్య తరగతికి భారంగా వాహనాల లైఫ్ ట్యాక్స్
ప్రజల బతుకులను బాగు చేయాల్సిన ప్రభుత్వాలు, పన్నుల పేరిట దోపిడి చేయడం దుర్మార్గం. వృత్తి, ఉపాధి చేసుకుంటూ జీవిస్తున్న పేద, మధ్య తరగతి ప్రజలపై ప్రభుత్వాలు విధిస్తున్న పన్నుల భారం పెను శాపంగా మారుతున్నది. ఇదే వరుసలో వాహనాల లైఫ్ టాక్స్ పెంచుతూ తెలంగాణ రవాణ శాఖ విడుదల చేసిన 53,54 జీవోలు అల్పాదాయ, మధ్య తరగతి వర్గాలకు తీరని నష్టం చేసే విధంగా ఉన్నాయంటూ… సీనియర్ జర్నలిస్ట్, బీసగోని సిద్ధార్థ్ రాసిన ప్రత్యేక వ్యాసం
ప్రజల బతుకులను బాగు చేయాల్సిన ప్రభుత్వాలు, పన్నుల పేరిట దోపిడి చేయడం దుర్మార్గం. వృత్తి, ఉపాధి చేసుకుంటూ జీవిస్తున్న పేద, మధ్య తరగతి ప్రజలపై ప్రభుత్వాలు విధిస్తున్న పన్నుల భారం పెను శాపంగా మారుతున్నది. ఇదే వరుసలో వాహనాల లైఫ్ టాక్స్ పెంచుతూ తెలంగాణ రవాణ శాఖ విడుదల చేసిన 53,54 జీవోలు అల్పాదాయ, మధ్య తరగతి వర్గాలకు తీరని నష్టం చేసే విధంగా ఉన్నాయి.
ప్రభుత్వాలు నడిపేందుకు అవసరమైన ఆర్థిక సహకారం అందించేందుకు ప్రజలు ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటారు. కానీ దానికీ ఒక పరిమితి ఉంటుంది. దేనికైనా ఒక లిమిట్ ఉన్నట్లుగానే, పన్నుల భారం మోసేందుకు ఓ లిమిట్ ఉంటుంది. ఇప్పటికే రోడ్డు ట్యాక్స్, పెట్రోలు-డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీలు, జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ ఇలా అనేక రకాల పన్నులతో ప్రజలు సతమతమవుతున్నారు. ఇవి చాలదన్నట్లు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంచి ప్రజలపై మరింత భారం వేయడం మూలిగే నక్కపై తాటి పండు పడేసినట్లే.
ఈ రోజుల్లో ఏ చిన్న ద్విచక్ర వాహనం కొనుగోలు చేసినా లక్ష దాటి ఉంటుంది. రైతులు, చిరు వ్యాపారులు ద్విచక్ర వాహనాలను వృత్తి, ఉపాధి పరంగా కొనుగోలు చేస్తుంటారు. తాజా జీవోల ప్రకారం, లక్ష దాటిన ద్విచక్ర వాహనాలపై లైఫ్ టాక్స్ ను 12శాతం నుంచి 15శాతానికి పెంచారు. ఉదాహరణకు బైక్ ఎక్స్ షోరూం ధర లక్షా 10వేలు ఉంటే, ఇప్పటి వరకు రూ.13,200 లైఫ్ టాక్స్ కట్టాల్సి ఉండేది. తాజా పెంపుతో ఇది రూ.16,500 లకు పెరుగుతుంది. ఇంత పెద్ద మొత్తంలో అదనపు భారం పేద, మధ్య తరగతి ప్రజలపై పడుతుంది.
కారు కొనుక్కోవాలనేది సాధారణంగా ఎవరికైనా ఉండే కోరిక. అప్పు చేసో, లోన్ తీసుకొనో కొనుగోలు చేస్తుంటారు. రూ.10లక్షలు లేనిదే కారు రాని పరిస్థితి. అలాంటి కార్ల మీద కూడా లైఫ్ టాక్స్ వేయడం అంటే ప్రజల కోరికలను సొమ్ము చేసుకోవడమే. రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల కారు కొంటే 17శాతంగా ఉన్న పన్ను శాతాన్ని 18శాతానికి పెంచారు. ఉదాహరణకు రూ.12లక్షల కారు కొంటే పాత విధానం ప్రకారం, రూ.2లక్షల 4వేల లైఫ్ టాక్స్ చెల్లించాలి. కానీ పెరిగిన దాని ప్రకారం, రూ.2లక్షల 16వేల దాకా చెల్లించాలి. అంటే రూ.12వేలు ఎక్కువ. రూ.20లక్షలు దాటితే రెండు శాతం, రూ.50లక్షలు దాటితే మూడు శాతం. ఇట్ల అడ్డోగులుగా పన్నులు పెంచి ప్రజల నడ్డి విరుస్తున్నారు. కమర్షియల్ వాహనాల పన్నులు కూడా పెంచారు. రూ.20లక్షల పైగా ఉంటే 20శాతంగా ఉన్న పన్నును 22శాతానికి, రూ.50లక్షలు దాటితే 25శాతం పన్ను కట్టాలని నిర్ణయించారు. కమర్షియల్ వెహికిల్స్ పై పన్ను పెంచడం వల్ల, చివరకు ఆ భారం మార్కెట్ పై, తద్వార ప్రజలపైనే పడుతుంది. ఇట్లా పన్నులు పెంచడం వల్ల ఏవిధంగా చూసినా పేద, మధ్య తరగతి ప్రజలే ప్రధానంగా ఇబ్బంది పడుతారు.
పోనీ, ఇన్ని రకాలుగా పన్నులు వసూలు చేస్తూ ప్రభుత్వాలు ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నాయా అంటే అదీ లేదు. స్వాతంత్ర్యం వచ్చి 78 ఏండ్లు కావస్తున్నా, ఇప్పటికీ విద్య, వైద్యం అనేది అందని ద్రాక్షగానే మిగిలిపోతున్నాయి. కూడు, గూడు దేవుడెరుగు తాగు నీటి కోసం కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితిలో కోట్ల మంది ప్రజలు ఉన్నారు. పన్నులు వసూలు చేయడంపై ఉన్న శ్రద్ధ, ప్రజలకు సౌకర్యాలు కల్పించడంపై ప్రభుత్వాలు పెట్టకపోవడం శోచనీయం.
పేద, మధ్య తరగతిపై పన్నుల భారమైనా పడకుండా చూడాలి, లేదంటే అడ్డగోలుగా వివిధ రూపాల పేరిట వసూలు చేస్తున్న పన్నులతో విద్య, వైద్యం, తాగు నీరు, రోడ్లు వంటి కనీస సదుపాయాలైనా పూర్తి స్థాయిలో కల్పించాలని ప్రభుత్వాలను కోరుతున్నాం.

– బీసగోని సిద్ధార్థ్
సీనియర్ జర్నలిస్ట్,
ఫోన్: 97042 83062

