తెలంగాణ పాట సాయుధ సేనాని సుద్దాల హన్మంతు
సుద్దాల హన్మంతు అనేక పాటల్లోని ఒక పాట పల్లవే నాటి నిజాం రజాకార్లను తరిమేటందుకు కారణమైతే, ఆయన పాటల్ల బలం ఎంత ఉండి ఉంటుంది? ఆ పాటలు ఎంతగా ప్రజల్ని ఉద్యమోన్ముఖుల్ని చేసి ఉంటయి? ఎంత మందిని పోరాటంలకు దింపి ఉంటయి? ఎందరి నోళ్ళల్ల నాని ఉంటయి? ఎన్ని గొంతుల్లో పల్లవించి ఉంటయి? ఒక్కో పాట ఎన్ని తూటాల్లా పేలి, జనం గుండెల్ని హత్తుకుని, ఒత్తుకుని, పోరాటాన్నెత్తుకుని, నాటి నిజాం, రజాకార్, దొరల గడీలను గడగడలాడించి ఉంటయి? ఆనాటి హన్మంతు పాటే ఊహకందని ఉద్యమమై, ఉప్పెనై దహించకపోయి ఉంటే, మనం ఈ రోజు, ఈ స్వేచ్ఛా వాయువులను పీలుస్తుండేవాళ్ళమా?
‘పల్లెటూరి పసులగాసే పిల్లగాడిని మొనగాడిని’ చేసిన, ‘వెయ్ దెబ్బకు దెబ్బ వెయ్’ అంటూ పాటను తూటాలా పేల్చిన సుద్దాల హన్మంతుపై ‘అడుగు’ డిజిటల్ మీడియా ప్రధాన సంపాదకుడు డా. మార్గం లక్ష్మీనారాయణ అందిస్తున్న ప్రత్యేక వ్యాసం

అది తెలంగాణ సాయుధ పోరాట తరుణం. ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయం. అప్పటి నల్లగొండ జిల్లా, ఇప్పటి యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రేణుకుంటలో ఒక రోజు కమ్యూనిస్టులు గ్రామ సభ పెట్టిండ్లు. మాభూమి నాటకం, గొల్ల సుద్దుల ప్రదర్శనలు కొనసాగుతున్నయి. అక్కడ ఆరుట్ల రాంచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, కూరారం రాంరెడ్డి, రేణుకుంట రాంరెడ్డి, ఎలుకపల్లి యాదగిరిలతోపాటు సుద్దాల హనుమంతు కూడా ఉన్నరు. గ్రామ సభను చెదరగొట్టేందుకు నిజాం మూకలు వస్తున్నయని బాల కళాకారులు సమాచారాన్ని చేరవేశిండ్లు. అది తెలిసి, సభలో ఉన్న వారు చెట్టుకొక్కరు, పుట్టకొక్కరుగ, కూసున్నోళ్లు కూసున్నట్లే పారిపోతున్నరు. ఎంత ఆపినా, ఆగే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో ఓ ముసలామె చేతిలో ఉన్న కర్రను సుద్దాల హన్మంతు అందుకుని భూమిపై కర్రను కొడుతూ, ‘వెయ్! వెయ్! వెయ్యెహె వెయ్! వెయ్ దెబ్బ! దెబ్బకు దెబ్బ…వెయ్!’ పాట అందుకున్నరు. ప్రజల్లో మనోధైర్యాన్ని నింపిండ్లు. పారిపోతున్న వాళ్ళు ఆగిపోయిండ్లు. మనిషో కర్ర అందుకున్నరు. అంతా కలిసి నిజాం సైన్యాన్ని ఊరి పొలిమేర దాటే వరకు తరిమికొట్టిండ్లు.

కట్ చేస్తే… హైదరాబాద్ నుండి చెన్నైకి రైలు వేగంగా పోతున్నది. అందులో ఇద్దరు వ్యక్తులు ప్రయాణిస్తున్నరు. ఒకరు విజయేంద్ర ప్రసాద్. మరొకరు సుద్దాల అశోక్ తేజ. అనుకోకుండా కలిసిండ్లు. చెన్నైలో వాళ్ళు చేయాల్సిన పనుల ఆలోచనలు రైలు కంటే వేగంగా పరిగెత్తుతున్నయి. మధ్యలో విజయేంద్ర ప్రసాద్, అశోక్ తేజను అడిగిండు. నీకు పాటలు రాయడం ఎట్ల అబ్బింది? మీ నాయిన గొప్ప వాగ్గేయకారుడు కద. ఆయన గురించేమైనా చెప్పు? ‘నాయినే నా పాటకు ప్రేరణ, అమ్మ జానకమ్మ ఉగ్గుపాలతో పాటను పడితే, నాయిన.. పాట దారిని సూపిండ’ని చెప్పిండు. తనకు నాయిన చెప్పిన రేణుకుంట ఘటనను వివరించిండు. పాట అంత ప్రభావం చూపుతుందని అశోక్ తేజ చెబితే, పాట తూట కంటే బలంగా మనిషి గుండెను తాకుంతుందని విజయేంద్రప్రసాద్ గట్టిగ నమ్మిండు.

కట్ చేస్తే… రచయిత అయిన విజయేంద్ర ప్రసాద్ ఆ కథ కోసమే దర్శకుడిగా మారిండు. రేణుకుంట ఘటన నేపథ్యంతో 2011లో రాజన్న సినిమా తీసిండు. రాజన్నగ నటించిన నాగార్జునే, ఆ సినిమాను నిర్మించిండు. కథ, కథనం అందరినీ ఆకట్టుకున్నయి. పాటలు పేలినయి. విమర్శకుల ప్రశంసలతోపాటు ఆ సినిమాకు పని చేసిన అందరికీ అవార్డులు వచ్చినయి. ఈ సినిమాను 2015లో తమిళంలో రాజా సింగ్ గా డబ్ చేస్తే, అక్కడా బాగా ఆడింది.

అయితే, రేణుకుంట ఘటనలో నిజాం రజాకార్ మూకలను తరిమి కొట్టేటందుకు సుద్దాల హన్మంతు అందుకున్న ‘వెయ్! వెయ్! వెయ్యెహె వెయ్! వెయ్ దెబ్బ! దెబ్బకు దెబ్బ…వెయ్!’ అనే పల్లవిని తీసుకుని ఆయన తనయుడైన సుద్దాల అశోక్ తేజతోనే ఆ పాటను రాయించిండు దర్శకుడు విజయేంద్రప్రసాద్.
సుద్దాల హన్మంతు అనేక పాటల్లోని ఒక పాట పల్లవే నాటి నిజాం రజాకార్లను తరిమేటందుకు కారణమైతే, ఆయన పాటల్ల బలం ఎంత ఉండి ఉంటుంది? ఆ పాటలు ఎంతగా ప్రజల్ని ఉద్యమోన్ముఖుల్ని చేసి ఉంటయి? ఎంత మందిని పోరాటంలకు దింపి ఉంటయి? ఎందరి నోళ్ళల్ల నాని ఉంటయి? ఎన్ని గొంతుల్లో పల్లవించి ఉంటయి? ఒక్కో పాట ఎన్ని తూటాల్లా పేలి, జనం గుండెల్ని హత్తుకుని, ఒత్తుకుని, పోరాటాన్నెత్తుకుని, నాటి నిజాం, రజాకార్, దొరల గడీలను గడగడలాడించి ఉంటయి? ఆనాటి హన్మంతు పాటే ఊహకందని ఉద్యమమై, ఉప్పెనై దహించకపోయి ఉంటే, మనం ఈ రోజు ఈ స్వేచ్ఛా వాయువులను పీలుస్తుండేవాళ్ళమా?

ప్రజాకవి, కళాకారుడు, క్రమశిక్షణ కలిగిన కమ్యూనిస్టు అయిన సుద్దాల హన్మంతు అప్పటి నల్లగొండ జిల్ల, ఇప్పటి యాదాద్రి భువనగిరి జిల్ల మోత్కూరు మండలం పాలడుగులో 1910 జూన్ 6న జన్మించిండు. తల్లిదండ్రులు గుర్రం బుచ్చిరాములు-లక్ష్మీనర్సమ్మ. ఆ తర్వాత వారు గుండాల మండలం సుద్దాలలో స్థిరపడటంతో సుద్దాల ఊరిపేరే వారి ఇంటిపేరుగా మారింది. ఆనాడు పెద్దగా చదువుకు అవకాశాల్లేవు. దీంతో వీధిబడిల ఉర్దూ, తెలుగు నేర్చుకున్నడు. శతకాలు, కీర్తనలు, సీస, కంద పద్యాలను కంఠస్థం చేసిండు. యక్షగానాలు పాడిండు. హరికథ, బుర్రకథ, యక్షగానాలే ఆనాడు తెలంగాణ పోరాటానికి ప్రచార సాధనాలుగ ఉండేది. సుద్దాల హన్మంతు బుర్రకథ చెబితే, గడ్డిపోచ కూడా యుద్ధానికి సిద్ధమయ్యేదట! సుద్దాల హన్మంతు పాట అంటే అంత బలమైన ప్రచారం ఉండేది. తను నేర్చుకున్న కళారూపాలలో నాటి నిజాం, దొరల గడీల ఆగడాలను, చొప్పించి చెప్పేవాడు. విచిత్ర వేషధారణలు, గొల్ల సుద్దులు, లత్కోర్ సాబ్, బుడబుక్కలు, ఫకీరు వేషం, సాధువు వంటి కళారూపాల ద్వారా పీడిత ప్రజల కష్టాలను చెప్పి, వారిని ఉద్యమ కార్యోన్ముఖుల్ని చేసేటోడు.
కమ్యూనిస్టు దళసభ్యుడిగ చేరి, భువనగిరిలో రావి నారాయణరెడ్డి అధ్యక్షతన జరిగిన 11వ ఆంధ్ర మహాసభకు వాలంటీర్ గా వెళ్ళిండు. ఆ ప్రభావంతో సుద్దాలలో సంగం పెట్టిండు. పాటలు కైకట్టి పాడుతుంటే, ప్రజల్ని రెచ్చగొడుతున్నడని, నిజాం ప్రభుత్వం హన్మంతుపై అరెస్టు వారెంట్ జారి చేసింది. అప్పుడే హన్మంతు అజ్ఞాతంలోకి వెళ్ళిండు.
ఆ రోజుల్లో ఉపన్యాసాలకంటే పాటే జనంలోకి బాగా చొచ్చుకుపోయేది. పాటే చైతన్యాన్ని కలిగించేది. ఉద్యమాన్ని రగిలించేది. హన్మంతు రాసిన అనేక పాటలు‘వీర తెలంగాణ’ పేరుతో అచ్చయినయి. అపారమైన ఆత్మవిశ్వాసం, అలుపెరగని వీరావేశం ఆయన పాటకు బలాన్ని, బలగాన్ని సమకూర్చి పెట్టినయి.
నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం ఆనాడు ఎందరినో కవులుగా, గాయకులుగా, ఉద్యమకారులుగా తయారు చేసింది. భూమి కోసం, భుక్తి కోసం, బానిస జన విముక్తి కోసం జరిగిన ఈ పోరాటం అంతర్జాతీయ స్థాయిలోనే ఒక గుర్తింపును పొందింది. అందులో సుద్దాల హన్మంతు గూడ ఒకరు.
హనుమంతు పాటల్లో యతిప్రాసలు అచేతనంగా పడేవి. అందుట్ల ‘పల్లెటూరి పిల్లగాడ.. పసుల గాసే మొనగాడ’ (తర్వాత మాభూమి సినిమాలో వచ్చింది), ‘రణభేరి మ్రోగింది తెలుగోడ’, ‘వెయ్ వెయ్ దెబ్బ’, ‘ప్రజా ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం’, ‘కన్నులో భగా భగా కడ్పుల్లో ధడా ధడా’, ‘భళిరె తెలంగాణ వహరె తెలంగాణ’… ఇలా ఎన్నో పాటలు ఆయనకు పేరు తెచ్చినయి. హనుమంతు రాసిన 22 పాటల పుస్తకం సాహితీ సర్కిల్ వారు ప్రచురించిండ్లు.
బతికున్నంతకాలం సుద్దాల హన్మంతు, ప్రజల బాణీలోనే పాటలందించిండు. పోరాటాలకే తన జీవితాన్ని అంకితం చేసిండు. హరికథలు చెప్పే అంజనదాసు శిష్యుడై, ఆయన బృందంలో చేరిండు. బతుకుతెరువు కోసం హైదరాబాద్ కు పోయిండు. ప్రభుత్వ కార్యాలయంలో చిరుద్యోగం చేసిండు. ఆర్యసమాజం వైపు ఆకర్షితుడైండు. కమ్యూనిస్టుగా మారిండు. ప్రజల్నే సాయుధుల్ని చేసి, కథన రంగంలో పోరు పాటై దూకిండు.
సుద్దాల హన్మంతు పోరాటంలో ఉండంగనే జానకమ్మను పెండ్లి చేసుకుండు. జానకమ్మ అచ్చం ఆ సీతమ్మే. బాగా పాడేది. సుద్దాల హన్మంతుకు ఆమె చేదోడు, సైదోడుగా నిలిచేది. చివరకు పంచనక్షత్రాల (ఆ గుడిసె పైకప్పుకు ఐదు చిల్లులుండేవట. అందులోంచి ఆకాశం కనిపించేదట) చిన్న గుడిసె హోటల్ ని కూడా నడిపిండ్లు. హన్మంతు రాస్తే, జానకమ్మ పాడితే పాట ఆ పూట పులకరించేదట. జానపద కళా రూపాలకు జీవం పోసి, అనేక పాటలను ప్రజలకు అందించిన విప్లవ వీరసేనాని సుద్దాల హనుమంతు 1982, అక్టోబర్ 10 న అమరుడయిండు. వారి సతీమణి జానకమ్మ 2005 మార్చి 23న మరణించింది.
జానకమ్మ-సుద్దాల హన్మంతు దంపతులకు నేటి గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, భారతి, ప్రభాకర్, గత ప్రభుత్వ సలహాదారు సుద్దాల సుధాకర్ తేజ సంతానం. అయితే, అమ్మ నాన్నల వారసత్వాన్ని పునికి పుచ్చుకున్నడు సుద్దాల అశోక్ తేజ. తండ్రిలా పాటని ఎంత ఒడుపుగా రాయగలడో అంతకంటే ఒడుపుగా పాడగలడు. సుద్దాల హన్మంతు అనారోగ్యంతో పూర్తి చేయలేకపోయిన యక్షగానాన్ని అశోక్ తేజ ఆ తర్వాత పూర్తి చేసిండు. అందులో కొద్ది భాగం ఒసేయ్ రాములమ్మ సినిమాల ‘ఇంతి ఏ ఇంటి జానవే ముద్దులా పూ బంతీ ఏ వీథి రాణివే’ అనే యక్షగాన పాటగా వచ్చింది. ఆ పాటతో, ఆ సినిమాతో మొదలు పెట్టిన అశోక్ తేజ సినీ ప్రయాణం వందలాది సినిమాల్లో వేలాది పాటలుగా కొనసాగుతూనే ఉన్నది.

నాయన తన స్వరపేటికలోంచి ఏ స్వరాన్నిచ్చిండో! అమ్మ ఏ తేనె పోసిందో గని, భారతక్క పాట పాడితే అంత హాయిగా, తీయగా ఉంటది. ‘పల్లెటూరి పిల్లగాడ..’ పాట పాడితే భారతక్క నోటనే వినాలె.
తమ తల్లిదండ్రులకు ఘనమైన నివాళిగ సుద్దాల అశోక్ తేజ 2010 అక్టోబర్ 13న సుద్దాల ఫౌండేషన్ ను ప్రాంరంభించిండు. ప్రతి ఏటా పలు రంగాలల్ల ప్రముఖులైన ఒకరికి సుద్దాల హనుమంతు-జానకమ్మ పురస్కారంను అందజేస్తున్నరు. ఈసారి ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఓల్గా, ప్రముఖ జానపద, సినీ గాయని మధుప్రియ, ప్రముఖ నర్తకి లాలినిధికి పురస్కారాలు దక్కినయి. సుద్దాల జానకమ్మ హనుమంతు సాహితి, జానపద, నృత్య పురస్కారాల ప్రధానోత్సవం ఈ నెల 13న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని, సుందరయ్య కళా నిలయంలో జరగనుంది.
అయితే సుద్దాల హన్మంతు అంపశయ్యపై ఉన్నప్పుడు తన తండ్రిమీద తనయుడు అశోక్ ‘పల్లెటూరి పిల్లగాని పాల గుండెలను నిమిరి’ అంటూ రాసి, పాడి కన్నీరుమున్నీరై వినిపించిండు. ఆ పాటలో అశోక్ తేజ అన్నట్లు.. సుద్దాల హన్మంతు…
నిన్నంతంచేయలేదు నాన్నా ఏ మృత్యువు
నింగివోలే ప్రకృతి వోలె చిరంజీవి నువ్వు

-డా. మార్గం లక్ష్మీనారాయణ

