చట్టం ఎవరికీ చుట్టం కాదు. చట్టం ముందు అందరూ సమానమే. ఇది చెప్పడానికి బాగుంటుంది. కానీ, ఆచరించడమే కష్టంగా ఉంటుంది. అందరికంటే ఎక్కువగా చట్టాలను అతిక్రమిస్తున్నది కూడా ఆ చట్టాలు చేస్తున్న స్థానాల్లో ఉన్నవారే. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సవరించిన వక్ఫ్ చట్టాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ తమ రాష్ట్రంలో అమలు చేయబోమని ఒక ముఖ్యమంత్రి కరాఖండిగా చెప్పడం దేనికి సంకేతం? నచ్చినా, నచ్చకపోయినా ఒక చట్టాన్ని అడ్డుకోలేకపోవడం వేరు. ఆ చట్టాన్ని అమలు చేయనే చేయమని చెప్పడం వేరు. ఈ ప్రకటన శాంతిభద్రతలకు ఎంతటి ఉప్రదవాలను తెచ్చిపెట్టినా సరే, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనుకునే ముఖ్యమంత్రులను ఏమనుకోవాలి? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అలాగే ప్రజాభిప్రాయాలకంటే పార్టీ సిద్ధాంతాలే ప్రాథామ్యాలనుకునే బీజేపీ లాంటి పార్టీలనేమనాలి? దేశంలో ఇప్పుడు పార్టీలకు, నాయకులకు ప్రజా ప్రయోజనాలకంటే కూడా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమైపోయాయి.
పశ్చిమ బెంగాల్లో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి. రవీంద్రనాథ్ ఠాగూర్, స్వామి వివేకానంద లాంటి వారు జన్మించిన నేల ఇప్పుడు రక్తసిక్తంగా మారుతోంది. అనేక సమస్యలు బెంగాల్ను ఆవరించాయి. ప్రధానంగా శాంతిభద్రతలు అదుపు తప్పాయి. అత్యాచార ఘటనలు పెరిగాయి. బంగ్లా నుంచి చొరబాట్లు పెరిగాయి. అక్రమ వసలదారులు అక్కడ తిష్టవేసి, ఆధార్ సహా అన్నీ పొందుతున్నారు. వారిని తన్ని తరిమేమకుండా వారికి సౌకర్యాలు కల్పించి, ఓటు బ్యాంక్గా మార్చుకున్న తీరు క్షమించరానిది. బంగ్లాదేశ్ నుంచి వేలాది మంది ఏటా వస్తూనే ఉన్నారు. దీంతో స్థానికంగా అల్లర్లకు వారు కూడా కారణం అవుతున్నారు. మైనార్టీలను బుజ్జగించే క్రమంలో అక్రమ వలసదారులను చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఒకదాని వెంట ఒకటిగా చోటుచేసుకుంటున్న ఘటనలు ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలకు సవాల్ గా పరిణమించాయి.
గతేడాది పార్లమెంటు ఎన్నికలకు ముందు జరిగిన సందేశ్ ఖలీ మానభంగాలు, కోల్కతాలో జరిగిన ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనలు పెను దుమారం రేపాయి. దేశ వ్యాప్త ఆందోళనలకు దారి తీశాయి. ఈ మధ్య 26 వేల మంది స్కూలు టీచర్ల నియామకాలను సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టడం దీదీ ప్రభుత్వాన్ని అతలాకుతలం చేసింది. తాజాగా వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా అల్లర్లు మొదలయ్యాయి. అల్లర్లను అదుపు చేయడానికో లేక ముస్లీం ఓటు బ్యాంకును కాపాడుకోవడానికో గానీ, వక్ఫ్ చట్టం బెంగాల్లో అమలు కాదని దీదీ ప్రకటించేశారు. నిజానికి ఈ ప్రకటన అల్లర్లను ఆపలేకపోయినా, అదుపు చేయాలి. కానీ అలా జరగలేదు. సరికదా, అల్లర్లు పెచ్చరిల్లాయి. ఈ పరిణామాలే దీదీ వ్యవహారాలపై అనుమానాలను పెంచుతున్నాయి. వచ్చే యేడాది ఎన్నికల్లో మళ్లీ గెలవడమే లక్ష్యంగా మమతా బెనర్జీ ఎత్తుగడలు వేస్తున్నారు. దీదీని నిలువరించి, అధికారాన్ని ఎలాగైనా చేజిక్కుంచుకోవాలని బీజేపీ కాచుక్కూచుంది. అందుకే ఈ రెండు పార్టీలు పరస్పరం నిందారోపణలు చేసుకుంటున్నాయి. పార్టీలు, నేతల మాటలే ప్రశాంతతకు విఘాతం కలిగించడమే ఇక్కడ విడ్డూరం.
నిజానికి ముస్లిం జనాభా ఎక్కువగా గల యూపీలోనూ బెంగాల్ మాదిరి అల్లర్లు జరగలేదు. బెంగాల్ లోని ముర్షీదాబాద్, మాల్డా, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాలు నిరసనలతో అట్టుడికాయి. ఈ అల్లర్లకు ముగ్గురు బలికాగా, భారీ స్థాయిలో ఆస్తులు ధ్వంసమయ్యాయి. నిరసనకారులు ప్రధాన రహదారుల్ని, రైల్వే ట్రాకుల్నీ దిగ్బంధం చేస్తూ ప్రజా జీవనానికి విఘాతం కలిగించారు. అయితే, వక్ఫ్ చట్టాన్ని అమలు చేయబోమని మమత హావిూ ఇచ్చినా అల్లర్లు ఆగకపోవడం అనుమానాలకు తావిస్తోంది. బెంగాల్లో విపక్ష బీజేపీ, అధికార తృణమూల్ కాంగ్రెస్ లు జరిగిన సంఘటనలకు బాధ్యత విూదంటే విూదేనంటూ దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. టీచర్ల వ్యవహారంలో బదనాం అయిన ప్రభుత్వ ప్రతిష్టను పెంచుకోవడం, దాన్నుంచి ప్రజల దృష్టి మళ్ళించడం, ప్రజల్లో నెగెటివిటీని తగ్గించుకోవడానికే వక్ఫ్ సవరణ చట్టాన్ని వాడుకుంటోందని దీదీపై బీజేపీ, ఆ చట్టాన్ని తెచ్చిన బీజేపీదే బాధ్యత అని దీదీ విమర్శలు చేసుకుంటున్నారు.
అల్లర్లకు కేంద్ర బిందువైన ముర్షీదాబాద్ జిల్లాలో ముస్లిం జనాభాదే ఆధిపత్యం. ఈ జిల్లాలోని మూడు పార్లమెంటు సీట్లనూ తృణమూల్ కాంగ్రెసే గెలుచుకుంది. 22 అసెంబ్లీ స్థానాల్లో 20 సీట్లకు తృణమూల్ సభ్యులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లోనూ ఆ పార్టీదే పైచేయి. అలాంటప్పుడు, అల్లర్లు ఎలా చెలరేగాయన్న ప్రశ్నకు అధికార పార్టీ నుంచి జవాబు లేకపోవడం గమనార్హం. ఈ కారణంగానే బీజేపీ తృణమూల్ కాంగ్రెస్ ను విమర్శిస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ అల్లర్లకు నెపాన్ని బీజేపీపై నెడుతోంది.
గతంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడూ ముర్షీదాబాద్ భగ్గుమంది. వక్ఫ్ చట్టంలో లొసుగులున్నాయని ఎవరైనా భావిస్తే, వాటిని న్యాయస్థానాలలో సవాల్ చేసే హక్కు, అవకాశం ఉంది. అంతే తప్ప, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని అల్లర్లకు దిగడం సమంజసం కాదు. అయితే అక్కడి రాష్ట్ర ప్రభుత్వ ప్రేక్షక పాత్రపై సర్వత్రా అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతాయుతమైన సిఎం పదవిలో ఉన్న దీదీ పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్ చట్టాన్ని అమలు చేయబోమని ఎలా చెబుతారనేది ప్రజలకు వివరణ ఇవ్వాలి. అల్లర్లను ప్రభుత్వ పరంగా అదుపు చేయాలి. అలాగే బీజేపీ సైతం వక్ఫ్ చట్టంపై ముస్లీంలలో నెలకొన్న అనుమానాలను తొలగించాలి. రాజకీయ అధికారం కోసం కాకుండా, ప్రజల శ్రేయోభిలాషిగా ప్రవర్తించాలి. మరో ఏడాదిలో శాసనసభ ఎన్నికలు జరగనున్న బెంగాల్లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కేవలం రాజకీయం కోసమే అన్నది సుస్పష్టం.

