ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ సంస్థల పాత్ర అత్యంత కీలకం. ముఖ్యంగా ఎన్నికల నిర్వహణలో నిష్పక్షపాత ధోరణి, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే ప్రధాన ఆధారం. ఇటీవలి పరిణామాల్లో ప్రత్యేక సమగ్ర ఓటర్ల పరిశీలన (సర్) ప్రక్రియ ద్వారా ఓటర్ల జాబితాల నుండి భారీగా పేర్లు తొలగింపు జరిగింది. దీంతో సర్ పై రాజకీయ వర్గాల్లో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే తరుణంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్పై అభిశంసన నోటీసులు ఇవ్వడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పై ప్రతిపక్షాలు మార్చి 13న పార్లమెంట్ ఉభయ సభల్లో అభిశంసన తీర్మానానికి నోటీసులు ఇచ్చాయి. ప్రత్యేక ఓటర్ల సవరణలో సీఈసీ అధికార బీజేపీకి అనుకూలంగా వ్యవహరించారని, ప్రతిపక్షాలపై పక్షపాత ధోరణి ప్రదర్శించారని ఆరోపించాయి. 193 మంది ఎంపీలు ఈ నోటీసుపై సంతకాలు చేశారు. ఆర్టికల్ 324(5) ప్రకారం, సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే విధానంలోనే సీఈసీని అభిశంసించవచ్చు. అయితే, ఈ నోటీసులను లోకసభలో స్పీకర్, రాజ్యసభలో చైర్మన్ పరిశీలించి, అనుమతించాల్సి ఉంటుంది. అయితే, పార్లమెంట్ చరిత్రలో సీఈసీపై అభిశంసన తీర్మానం రావడం ఇదే మొదటిసారి.
త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 1 కోటి 40 లక్షల ఓటర్ల పేర్లు జాబితాల నుండి తొలగించబడినట్టు అంచనా. ఒక్క పశ్చిమ బెంగాల్లోనే 60 లక్షలకు పైగా ఓట్లు తొలగించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ఐదు రాష్ట్రాల్లోని మొత్తం 824 అసెంబ్లీ స్థానాలకు, 17.4 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇలా విస్తృత స్థాయిలో ఓటర్ల జాబితా సవరణలు సహజంగానే అనుమానాలకు తావిస్తాయి.
ఆశ్చర్యకరంగా ఓటు తొలగింపులపై ప్రజల నుంచి పెద్దగా ఫిర్యాదులు రాకపోవడం విచిత్రం. సాధారణంగా ఒకరి ఓటు తొలగిస్తే, దానికి తగిన ప్రతిస్పందన వెంటనే వెలువడుతుంది. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి కనిపించకపోవడం ఈ ప్రక్రియపై అధికార వర్గాల వాదనకు బలం చేకూరుస్తోంది. మరోవైపు, ప్రతిపక్షాలు మాత్రం ఈ చర్యలను తీవ్రంగా విమర్శిస్తున్నాయి.
ప్రధానంగా పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్ సర్ పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమకు అనుకూల ఓటర్ల తొలగింపే లక్ష్యంగా తొలగింపులు జరిగాయని వారు ఆరోపిస్తున్నారు. అయితే, ఈ ఆరోపణలకు బలమైన ఆధారాలు సమర్పించడంలో వారు ఇప్పటి విఫలమవుతూనే ఉన్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రతిపక్షాలు భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది. అభిశంసన అసాధారణ రాజ్యాంగ ప్రక్రియ. రాజ్యాంగ ఉన్నత హోదాలో ఉన్న సీఈసీ తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేదని నిరూపితమైతేనే తీర్మానం ఆమోదం పొందుతుంది. పైగా, పార్లమెంట్లో తగిన మెజారిటీ అవసరం కావడం వల్ల ఈ తీర్మాణం వీగిపోయే అవకాశాలే ఎక్కువ.
భారత ఎన్నికల సంఘం స్వతంత్ర రాజ్యాంగ వ్యవస్థ. అది అధికారంలో ఉన్న పార్టీకి కాకుండా రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. అలాంటి సంస్థపై అభిశంసన నోటీసులు ఇవ్వడం అంటే, ఆ సంస్థ నిష్పాక్షికతపై అనుమానాలు రేకెత్తడమన్నమాట. ఇది ప్రజాస్వామ్యానికి మంచిదేనా? ఇదంతా రాజకీయ ప్రయోజనాల కోసమేనా? అన్నది ఆలోచించాల్సిన అంశం.
అయితే, ఎన్నికల సంఘం మాత్రం తన నిజాయితీని నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది. “ఒక్క అర్హత కలిగిన ఓటరు కూడా తన ఓటు హక్కు కోల్పోకుండా చూసుకున్నాం. అలాగే ఒక్క అనర్హుడూ ఓటు వేయకుండా నిరోధించాం.” అని స్పష్టం చేసింది. ఇక దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అప్పీలేట్ ట్రిబ్యునళ్లు రోజుకు లక్ష ఫిర్యాదులను పరిష్కరిస్తున్నాయని సీఈసీ వివరిస్తోంది.
పశ్చిమ బెంగాల్లో చీఫ్ సెక్రెటరీని తొలగించడం, డీజీపిని బదిలీ చేయడం వంటి చర్యలను ఎన్నికల సంఘం తీసుకుంది. ఎన్నికల నిర్వహణలో నిష్పక్షపాతాన్ని నిరూపించే చర్యగా చెప్పుకుంటున్నా, ఇది రాజకీయంగా మరింత వివాదాస్పదంగా మారింది.
ఎన్నికల సమయంలో కుల, మత, ప్రాంతీయ రాజకీయాలు ప్రబలడం కొత్తేమీ కాదు. దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశాలను తమకు అనుకూలంగా మలచుకుంటున్నాయి. ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణ వంటి చర్యలు ఎన్నికల ఫలితాలపై ఏ విధమైన ప్రభావాన్ని చూపుతాయన్నది ఆసక్తిగా మారింది.
అభిశంసన ప్రయత్నం విజయవంతమవుతుందా? ప్రస్తుత రాజకీయ సమీకరణాలు, పార్లమెంట్ లో పార్టీల బలాబలాలను బట్టి చూస్తే, అది కష్టమేనని చెప్పాలి. అధికార పక్షానికి ఆధిక్యమే దీనికి ప్రధాన కారణం. అందువల్ల ఇది రాజకీయ ఒత్తిడికి గురిచేసే ప్రక్రియగానే మిగిలే అవకాశం ఉంది.
భారత రాజ్యాంగం ప్రకారం అభిశంసన శక్తివంతమైన తొలగింపు సాధనం. ఆయుధం. అయితే, అది బాధ్యతాయుతంగా, విజయవంతంగానే ఉపయోగించాలి. లేకపోతే అది రాజ్యాంగ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీసే ప్రమాదం ఉంది. ఎన్నికలు సమర్థవంతంగా, నిష్పక్షపాతంగా జరగడం ప్రజాస్వామ్యానికి ఆవశ్యం. అందువల్ల ఈ అభిశంసన వ్యవహారంలో అన్ని పార్టీలు బాధ్యతతో వ్యవహరించడం అత్యవసరం.

