ఆత్మీయ మిత్రుడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సహాధ్యాయి, ‘సి’ హాస్టల్ లో నా పక్క రూమ్ 65 లో ఉండిన బహుజన ఉద్యమకారుడు, సామాజిక తెలంగాణ సాధనసమితి స్థాపించి కడవరకు నమ్మిన ఆశయాల సాధనకు కొట్లాడిన ధీరుడు ప్రభంజన్ కుమార్ యాదవ్. ఆనారోగ్యంతో 64వ ఏట తుది శ్వాస విడిచిండు. 1990వ దశకం ఆరంభంలో ఉస్మానియాలో భాషా శాస్త్రం ఆ తర్వాత తెలుగు యూనివర్సిటీ లో జర్నలిజం చదువుకున్నడు. యాదవ సామాజిక వర్గం నుంచి విశ్వవిద్యాలయం మెట్లు ఎక్కడమే గొప్ప. అలాంటిది యూనివర్సిటీ కేంద్రంగా విద్యార్థులను ఉద్యమాలకు సన్నద్ధం చేసిండు.
కేంద్ర సమాచార శాఖ లో జర్నలిస్టుగా చేరి ఢిల్లీ కేంద్రంగా చాలా ఎండ్లు పనిజేసిండు. ప్రణాళికా శాఖల్లోనూ పనిజేసిండు. అక్కడ ఉన్న కాలంలోనే ఢిల్లీ జేఏసీ లో చురుగ్గా పాల్గొన్నడు. తెలంగాణా ఉద్యమం ఊపందుకుంటున్న దశలో ఉద్యోగానికి రాజీనామా చేసి పూర్తి స్థాయిలో తెలంగాణా ఆకాంక్షతో మమేకమై పని జేసిండు. సామాజిక తెలంగాణ సాధన సమితిని ఏర్పాటు చేసి, బీసీలను ఒక్కతాటి పైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేసిండు. గూడూరు (జనగామ జిల్లా) నుంచి డిల్లీ వరకూ, అక్కడ బహుజన సమాజ పార్టీ నాయకులతో కలిసి నడిచిండు.
గొల్ల కురుమలు గొప్ప సంస్కృతి పేరిట ఆ సామాజిక వర్గం చరిత్రను రికార్డు చేసిండు. అట్లనే భారతి అనే సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థితో కలిసి వేపకాయంత నిజం పేరిట గొల్ల కురుమల జీవితాలు వస్తువుగా వెలువడ్డ కథలను సంకలనం చేసిండు. అంతే కాదు విప్లవాలు సృష్టిస్తున్న విగ్రహాలు, నడుస్తున్న చరిత్ర, కాసుల జ్ఞానం, సామాజిక తెలంగాణ తదితర పుస్తకాలను వెలువరించిండు.
ఢిల్లీ నించి వచ్చిన తర్వాత కొన్ని రోజులు నిజామాబాద్ లోని తెలంగాణా విశ్వవిద్యాలయంలో జర్నలిజం విభాగంలో ఆచార్యులుగా పనిజేసిండు. అక్కడ పనిజేస్తున్న కాలంలోనే అంబేద్కర్ నిర్వహించిన ‘మూక్ నాయక్’ పత్రిక శతజయంతి సందర్బంగా(2020లో) అంతర్జాతీయ సెమినార్ ని నిర్వహించిండు. ఆ సెమినార్ లో నేను, రాపోలు ఆనంద భాస్కర్, డాక్టర్ రాపోలు సత్యనారాయణ, డాక్టర్ మార్గం లక్ష్మీనారాయణ కూడా పాల్గొన్నం. మార్గం ఆ సందర్భంగా, సెమినార్ లో ‘పద్మశాలి పత్రిక ప్రారంభానికి 98 ఏండ్లు!’ అనే పరిశోధన పత్రం సమర్పించినట్లు గుర్తు. ఆ సెమినార్ స్ఫూర్తి తోనే నేను జర్నలిస్టుగా, అంబేద్కర్ పుస్తకాన్ని రాసిన. గత 36 ఏండ్లుగా ప్రభంజన్ ప్రయాణాన్ని చాలా దగ్గరగా చుసినాను.
పాశం యాదగిరి, గద్దరన్న, కోదండరామ్, కంచె ఐలయ్యలతో ప్రభంజన్ కలిసి నడిచిండు. నిన్న మిత్రులు చామకూర రాజు, కె.వి. గౌడ్ లు ప్రభంజన్ ఇంటికి వెళ్లి పరామర్శించిండ్రు. ముక్కులో పైప్ లతో వారితో బాగానే రాతలతో మాట్లాడిండు. ఫొటోలు దిగిండు. కొంచెం కోలుకున్న తర్వాత పలుకరిద్దామని అనుకున్న. ఇంతలోనే ఈ విషాద వార్త. సభలు జరపడంలోనూ, మిత్రులను సభకు సమీకరించడంలోనూ ప్రభంజన్ పూర్తి డేడికేటెడ్ గా పని జేసేటోడు. ఆయన లేని లోటు బీసీ సమాజానికి తీరనిది. ఆయన ఆశయాలు సాధించడమే నిజమైన నివాళి.


