CARBOHYDRATES|కార్బోహైడ్రేట్లు ఎక్కువ, PROTEINS|ప్రొటీన్లు తక్కువ
మనం పట్టక పోతే అన్నం భరతం
2060 నాటికి రోగాల భారతం
COUNTRY|దేశ ఆదాయంపై ఆనారోగ్య భారం
ముప్పూటలా బువ్వే! ముప్పు తెచ్చేవి అవ్వే!!
ముప్పూటలా బువ్వే! అప్పుడప్పుడూ ఫలహారాలూ బియ్యం పిండివే!! ఏ చిరు తిండైనా బియ్యపు పిండితోనే!!! తింటే అన్నమే తినాలి. లేకపోతే, ఏమి తిన్నా, ఎంత తిన్నా తిన్నట్లే ఉండదు. ఇది సగటు తెలుగు, తెలంగాణే కాదు, ఆ మాటకొస్తే మొత్తం భారతీయుల ఫీలింగే ఇది. అమెరికాలో ఉన్నా, మరే దేశంలో ఉన్నా, మన ఆహారపు అలవాటే అంత? మన డైటే ఇంత? అనేంతగా మారిపోయింది. ఇది మన ఫీలింగే అనుకునేరు, ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) స్టడీలోనూ ఇదే తేలింది.
మన తినే తిండిలో 67% అన్నమేనట! మొత్తం ఆహారంలో 70% కార్బోహైడ్రేట్లే!! కూరలు, పండ్లు చాలా తక్కువగా తింటున్నమని తేలింది. మన శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, మినరల్స్, విటమిన్లు అందక రోగాల బారిన పడుతున్నామట. పైగా కార్పోహైడ్రేట్స్, కొవ్వు పదార్థాలతో ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని కూడా ఆ స్టడీ తేల్చేసింది.
ఐసీఎంఆర్ స్టడీలో ఏం తేలిందంటే..
తినడమంటే అన్నమే అనేంతగా మారిపోయాం. ఒకప్పుడు అన్నం దొరకక, జొన్నన్నం, జొన్నగటక గుటకలేసిన మన పూర్వీకులు ఇంకా గట్టిగా రాటుదేలి ఉంటే, మనం మాత్రం ఫారం కోళ్ళలా కాస్త కాలు జారి పడితే పుటుక్కుమనేంత సున్నితంగా మారిపోయాయం. ముప్పుటలా బువ్వే తింటున్నాం. డాక్టర్లు మాత్రం, ఆరోగ్యం బాగుండాలంటే మనం తినే తిండి బ్యాలెన్స్డ్ గా ఉండాలని డాక్టర్లు చెప్తుంటారు. అయినా సరే, మనం మాత్రం అన్నం లేందే గడియ గడవనంతగా ఉండిపోతున్నాం. ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) స్టడీలో తేలింది ఇదే.
తెలంగాణ ప్రజలు తినే తిండిలో 67 శాతం అన్నమే ఉంటున్నదని ఆ అధ్యయనం తేల్చింది. ఈ స్టడీ కోసం ఐసీఎంఆర్ దేశవ్యాప్తంగా 1.24 లక్షల మంది నుంచి వివరాలను సేకరించింది. నేషనల్ గైడ్లైన్స్ ప్రకారం రోజూ 2వేల క్యాలరీల ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. అందులో కేవలం 50 శాతం లోపు మాత్రమే కార్బోహైడ్రేట్స్ ఉండాలి. కానీ, మన రాష్ట్రంలో మాత్రం మొత్తం ఫుడ్లో 70 శాతం మేర కార్బోహైడ్రేట్స్ ఉంటున్నాయని తమ స్టడీలో తేలినట్టు ఐసీఎంఆర్ వెల్లడించింది.
కొవ్వు కూడా చాలా ఎక్కువే
రాష్ట్రంలో ప్రజలు కొవ్వు కూడా ఎక్కువే తింటున్నట్టు స్టడీలో తేలింది. నేషనల్ గైడ్లైన్స్ ప్రకారం 10 శాతం కన్నా తక్కువగా కొవ్వు పదార్థాలు తీసుకోవాల్సి ఉన్నా, అంతకుమించి 25 శాతానికి పైగా కొవ్వు పదార్థాలు తింటున్నారని అధ్యయనం స్పష్టం చేసింది. అదే సమయంలో ప్రొటీన్లు, విటమిన్లు మాత్రం చాలా తక్కువగా తీసుకుంటున్నారని ఐసీఎంఆర్ ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రోటీన్లు, విటమిన్లు చాలా తక్కువ
ప్రోటీన్, విటమిన్ల ఫుడ్ కేవలం 10 శాతం వరకే ఉంటున్నదని ఆ స్టడీ తేల్చింది. పండ్లు చాలా తక్కువగా తింటున్నారని పేర్కొంది. జొన్న రొట్టె, గోధుమ రొట్టె వంటివి తింటున్నా, ఆశించిన స్థాయిలో లేదని వెల్లడించింది. ప్రోటీన్ కోసం ఎక్కువగా చికెన్పైనే ఆధారపడుతున్నారని, పప్పు తక్కువగా తింటున్నారని పేర్కొంది. ఇటీవల పాలు, పెరుగు వాడకం మాత్రం పెరిగిందని వెల్లడించింది.
ఈశాన్య రాష్ట్రాల్లో మనకు మించి అన్నం ఎక్కువే
దేశంలో అన్నం ఎక్కువ తింటున్న రాష్ట్రాల జాబితాలో ఈశాన్య రాష్ట్రాలే టాప్లో ఉన్నాయని ఆ స్టడీ తేల్చింది. ఆయా రాష్ట్రాల్లో 99 శాతం అన్నమే తింటున్నారని, ఈ డైట్ బ్యాలెన్స్ మరీ దారుణంగా ఉందని పేర్కొంది.
ఈ రాష్ట్రాలు కొంచెం బెటర్!
మహారాష్ట్ర, బీహార్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో గోధుమలు, సజ్జలు, జొన్న పిండితో చేసిన రొట్టెలను ఎక్కువగా తింటున్నారని, వాళ్ల డైట్లో అదే 80 శాతం వరకు ఉంటున్నదని స్టడీ తేల్చింది.
దేశ ఆదాయంపై ఆనారోగ్య భారం
ఫుడ్లో బ్యాలెన్స్ లేకపోవడం వల్ల దేశంలో షుగర్, బీపీ, గుండె జబ్బులు పెరుగుతున్నాయని ఐసీఎంఆర్ ఆందోళన వ్యక్తం చేసింది. దేశ జనాభాలో ఇప్పటికే 12 శాతం మంది షుగర్ బారిన పడ్డారని, మరో 15.4 శాతం మంది ప్రీ డయాబెటిస్ స్టేజీలో ఉన్నారని పేర్కొంది. 28.6 శాతం మంది ఊబకాయంతో ఉన్నారని, 40 శాతం మంది కుండ పొట్టతో లావెక్కారని ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో సంభవిస్తున్న మరణాల్లో 68 శాతం (63 లక్షలు) గుండె, షుగర్ సంబంధిత జబ్బుల వల్లేనని పేర్కొంది. ఈ జబ్బుల భారం దేశ జీడీపీలో 2.5 శాతం అని పేర్కొంది.
2060నాటికి పెను భారం
2060 నాటికి ఈ అన్ బ్యాలెన్స్డ్ ఆహారం వల్ల వచ్చే వ్యాధుల మీదే రూ.75 లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుందని అంచనా వేసింది. మరోవైపు దేశంలో 15శాతం మంది సిగరెట్, బీడీ వంటివి తాగుతున్నారని, ఇది ఊర్లల్లోనే ఎక్కువగా ఉందని ఐసీఎంఆర్ పేర్కొంది. ఊర్లల్లో 16 శాతం మంది ధూమపానం చేస్తుంటే, సిటీల్లో 14 శాతం మంది చేస్తున్నట్టు తెలిపింది. ఇక దేశంలో 15 శాతం మంది మద్యం తాగుతున్నట్టు వివరించింది.
పౌష్టికాహారంపై ప్రభుత్వాలు స్పందించాలి
కేంద్రం సహా రాష్ట్రాల ప్రభుత్వాలు పౌష్టికాహారంపై స్పందించాల్సిన సమయం ఆసన్నమైందని ఐసీఎంఆర్ సూచిస్తోంది. బ్యాలెన్స్డ్ డైట్ ఉండేలా ప్రణాళికలను ప్రభుత్వాలు రూపొందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. న్యూట్రిషన్ ఫుడ్ ప్లాన్పై ప్రజలకు అవగాహన కల్పించాల్సి న అవసరం ఉందని తేల్చి చెప్పింది.

