అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ ల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సహా, సాధారణ కుటుంబాల వంటింటినీ ప్రభావితం చేస్తున్నాయి. ఇరాన్–అమెరికా, ఇజ్రాయెల్ మధ్య పెరిగిన ఘర్షణల కారణంగా ప్రపంచంలోని అత్యంత కీలక సముద్ర మార్గాలలో ఒకటైన హార్మూజ్ జలసంధి సందిగ్ధంలో పడింది. ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాలో ప్రధాన పాత్ర పోషించే ఈ మార్గం అడ్డంకులకు గురికావడంతో భారతదేశంలో వంట గ్యాస్ సరఫరా, ధరలపై ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.
ప్రపంచ చమురు రవాణాలో 20% ఈ జలసంధి ద్వారానే సాగుతుంది. రోజుకు 20 మిలియన్ బ్యారెళ్ల చమురు, భారీ ఎత్తున ఎల్ఎన్జీ గ్యాస్ ఇక్కడి నుంచి ప్రపంచ దేశాలకు చేరుతుంది. అందువల్ల ఇక్కడ ఏ చిన్న ఉద్రిక్తత వచ్చినా అది గ్లోబల్ మార్కెట్లను కుదిపేస్తుంది. ప్రస్తుతం యుద్ధం కారణంగా నౌకాయాన రాకపోకలు ఆగిపోయాయి. కొన్ని రోజులపాటు నౌకల రాకపోకలు దాదాపు నిలిచిపోయిన సందర్భాలూ ఉన్నాయి.
భారతదేశం ఇంధన అవసరాలలో పెద్ద భాగాన్ని దిగుమతులపై ఆధారపడి ఉంటుంది. దేశం వినియోగించే చమురులో 85% విదేశాల నుంచే వస్తుంది. అందులో పెద్ద భాగం గల్ఫ్ ప్రాంతం నుంచి వస్తుంది. ముఖ్యంగా వంట గ్యాస్ విషయంలో పరిస్థితి మరింత క్లిష్టం. భారతదేశం ఉపయోగించే ఎల్పీజీలో 60% దిగుమతి, అందులో 90% వరకు హార్మూజ్ మార్గం ద్వారానే వస్తుంది.
ఈ నేపథ్యంలో యుద్ధ ప్రభావం నేరుగా వంట గ్యాస్ సరఫరాపై పడుతోంది. ఇటీవలే భారతదేశంలో ఎల్పీజీ వినియోగం 17.3 శాతానికి పడిపోయింది. గత నెలతో పోలిస్తే 26.3% తగ్గుదల నమోదైంది. దీనికి ప్రధాన కారణం హార్మూజ్ ప్రాంతంలో నౌకాయానంలో ఏర్పడిన యుద్ధం.
భారతదేశానికి వచ్చే కొన్ని గ్యాస్ ట్యాంకర్లు అక్కడే నిలిచిపోయాయి. ప్రస్తుతం 22 నౌకలు, అంటే వాటిలో ఎల్పీజీ, ఎలెన్జీ, క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు నిలిచిపోయిన కారణంగా గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.
ప్రకృతి వాయువు రంగంలో కూడా ప్రభావం కనిపిస్తోంది. పశ్చిమాసియా సంక్షోభం వల్ల భారతదేశానికి వచ్చే ప్రకృతివాయువు దిగుమతుల్లో 25% ప్రభావితమయ్యాయి. దేశం రోజుకు సుమారు 189 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ వినియోగిస్తుండగా, అందులో కొంత భాగం సరఫరా సమస్యలు ఎదుర్కొంటోంది.
అయితే, పరిస్థితి నియంత్రణలోనే ఉందని ప్రభుత్వం చెబుతోంది. గ్యాస్ కొరత ఎక్కువగా గృహ వినియోగంపై కాకుండా పరిశ్రమలపై పడేలా ప్రాధాన్యత క్రమాన్ని అమలు చేస్తున్నారు. హాస్పిటల్స్, విద్యాసంస్థలు, గృహ వినియోగం వంటి కీలక రంగాలకు ముందుగా సరఫరా చేస్తున్నారు.
ప్రస్తుతం భారతదేశం 40 దేశాల నుంచి చమురు దిగుమతి చేస్తోంది. హార్మూజ్ మీద ఆధారాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వచ్చే దిగుమతులను 55% నుంచి 70%నికి పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది.
అయినా గ్యాస్ సంక్షోభం త్వరలోనే సమసిపోతుందని చెప్పడం కష్టం. విశ్లేషకుల అంచనాల ప్రకారం, హార్మూజ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగితే దక్షిణాసియాలో ఎలన్జీ సరఫరా త్రైమాసికానికి 2–3 మిలియన్ టన్నులు తగ్గే అవకాశం ఉంది.
ఇది జరిగితే.. పరిశ్రమల ఉత్పత్తి తగ్గడం, ఎరువుల ధరలు పెరగడం, చివరకు ఆహార ధరలు కూడా పెరగడం వంటి ప్రభావాల పరంపర ప్రమాదం ఉంది. ఇంధన వ్యయాలు పెరగడం వల్ల జీవన వ్యయం పెరుగుతుంది.
అయితే, ఆశాజనక అంశాలు కూడా ఉన్నాయి. భారతదేశం వద్ద కొన్ని వారాలపాటు సరిపడే వ్యూహాత్మక నిల్వలు ఉన్నాయి. అవసరమైతే ఇండియన్ నేవీ సహాయంతో నౌకలకు రక్షణ కల్పించే ఏర్పాట్లు కూడా పరిశీలిస్తున్నారు. అయినా, ప్రస్తుతం కనిపిస్తున్న వంట గ్యాస్ కష్టాలు పూర్తిగా తాత్కాలికమేనని చెప్పలేం. అలాగని, దీర్ఘకాల సంక్షోభంగా మారే అవకాశమూ తక్కువే. యుద్ధ పరిస్థితులు తగ్గితే సరఫరా త్వరగా సాధారణ స్థితికి రావచ్చు. కానీ ఉద్రిక్తతలు కొనసాగితే మరికొన్ని నెలలు గ్యాస్ సరఫరాలో ఒత్తిడి ఉండకతప్పదు.
హార్మూజ్ జలసంధి సంక్షోభం ఒక పెద్ద పాఠం చెబుతోంది. ఇంధన భద్రత కోసం దేశం దిగుమతులపై ఆధారాన్ని తగ్గించుకుని, ప్రత్యామ్నాయ వనరులను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. వంట గ్యాస్ సమస్య తాత్కాలికంగా కనిపిస్తున్నా, ఆ సమస్య పరిష్కారం మాత్రం చాలా దీర్ఘకాలికం.

