2016లో డ్రగ్స్ దందాపై తీసిన ఉడ్తా పంజాబ్ సినిమా సంచలనమైంది. కానీ, అతకంటే సంచలనం డ్రగ్స్, గంజాయి ఉత్పత్తి, వినియోగం, సరఫరా అని గుర్తించలేకున్నాం. ఇదే ఇప్పుడు దేశంలో మొత్తం సమాజాన్ని క్యాన్సర్ కంటే వేగంగా, నిర్దాక్షిణ్యంగా, నిరపేక్షంగా మరణ మృదంగాన్ని మోగిస్తోంది.
దేశవ్యాప్తంగా విస్తరిస్తోన్న డ్రగ్స్, గంజాయి మాఫియా ఆందోళనకరంగా మారింది. హైదరాబాద్ పరిసరాల్లో ఫాం హౌస్ ల్లో డ్రగ్స్, రేవ్ పార్టీలు జరుగుతుండటం, అందులో ప్రముఖంగా రాజకీయ నేతలు, వ్యాపారులు, సినీ రంగ వ్యక్తుల పేర్లు వినిపించడం విస్మయాన్ని కలిగిస్తోంది.
భారతదేశంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నివేదికల ప్రకారం గత ఐదేళ్లలో డ్రగ్స్ కేసులు గణనీయంగా పెరిగాయి. 2019లో దేశవ్యాప్తంగా 59వేల కేసులు నమోదయ్యాయి. 2023 నాటికి ఈ సంఖ్య 85వేలకు చేరింది. నాలుగేళ్లలో 40% పెరుగుదల కనిపించింది. గంజాయి, హెరాయిన్, కొకైన్ వంటి మాదకద్రవ్యాల స్వాధీనం కూడా భారీగా పెరిగింది. 2022లో దేశవ్యాప్తంగా 4వేల టన్నులకు పైగా గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో 7.7 కోట్ల మంది మాదక ద్రవ్యాలను ఏదో ఒక రూపంలో వినియోగిస్తున్నారని అంచనా. అందులో గంజాయి వినియోగదారులు 3.1 కోట్ల మంది. 18–35 ఏళ్ల మధ్య వయస్కుల్లో గంజాయి, డ్రగ్స్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఇది భవిష్యత్తు తరాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. 2024-25 లో ఏపీ, తెలంగాణ కలిపి 100 టన్నులకు పైగా గంజాయి పట్టుబడినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
అయితే దేశంలో గంజాయి, డ్రగ్స్ వినియోగం, రవాణాలో ఉత్తరప్రదేశ్, పంజాబ్, సిక్కిం, ఢిల్లీ, మహారాష్ట్ర, నాగాలాండ్, ఒడిశా రాష్ట్రాలు ముందున్నాయి. ఉత్తరప్రదేశ్లో గంజాయి (భాం, చరస్) వినియోగం ఎక్కువగా ఉండగా, పంజాబ్ , సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ వంటి ఈశాన్య రాష్ట్రాల్లో సింథటిక్ డ్రగ్స్, ఓపియాయిడ్ల (హెరాయిన్) వాడకం, రవాణా ఎక్కువగా ఉంది. 2018 నాటి గణాంకాల ప్రకారం ఢిల్లీ, ముంబై నగరాలు గంజాయి వినియోగంలో ప్రపంచంలోని ప్రధాన నగరాల జాబితాలో ముందున్నాయి. అయితే మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యాచారాల్లో 70% నుంచి 80% డ్రగ్స్, గంజాయి వంటి మత్తు వల్లేనని తేలింది.
హైదరాబాద్ డ్రగ్స్ రవాణా, వినియోగానికి ప్రధాన కేంద్రంగా మారుతున్నది. తెలంగాణ పోలీస్ గణాంకాల ప్రకారం 2020లో నమోదైన డ్రగ్స్ కేసులు 1,200 కాగా, 2023 నాటికి అవి 2,500 దాటాయి. మూడేళ్ళలోనే రెట్టింపు కేసులయ్యాయి. గంజాయే కాక, ఎండీఎంఏ, ఎల్ఎస్డీ వంటి సింథటిక్ డ్రగ్స్ వినియోగం కూడా పెరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ గంజాయి సాగు, రవాణాల్లో కీలకంగా మారింది. 2021లో ఏపీలో 1 లక్షా 80 వేల కిలోల గంజాయి స్వాధీనం కాగా, 2023లో అది 2 లక్షల 50వేల కిలోలకు పెరిగింది. విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు గంజాయి సాగుకు కేంద్రాలుగా మారాయి. ఏపీ పోలీసులు గత మూడేళ్ళల్లో5వేలకు పైగా గంజాయి కేసులు నమోదు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇది గ్రామీణ ప్రాంతాలకు, స్కూల్ టీనేజీ లోపు పిల్లలకు విస్తరిస్తుండటం ఇంకా ప్రమాదకరంగా పరిణమిస్తోంది.
అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియా నెట్వర్క్ లు భారతదేశాన్ని ట్రాన్సిట్ హబ్గా వాడుకుంటున్నాయి. యువతలో, ముఖ్యంగా ఐటీ, ఎంటర్టైన్మెంట్ రంగాల్లోని కొంతమందిలో డ్రగ్స్ వినియోగం ఫ్యాషన్గా, స్టేటస్ సింబల్ గా మారింది. ఈ దందాగాళ్ళకు రాజకీయ ఆశ్రయం దొరుకుతోంది. తాజాగా ఘటనలు ఈ అనుమానాలను బలపరుస్తున్నాయి.
మొయినాబాద్ ఫాంహౌజ్లో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపి పుట్టా మహేశ్లు పట్టుబడ్డారు. వారి స్నేహితుడు ఢిల్లీకి చెందిన నమిత్శర్మల మత్తు చరిత్ర కొత్త అనుమానాలు రేకెత్తిస్తోంది. పోలీసుల పరీక్షల్లో మొత్తం 11 మందిలో ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. పుట్టా మహేశ్, నమిత్శర్మ నమూనాల్లో యాంఫిటమిన్, మెథా యాంఫిటమిన్, కొకైన్ ఆనవాళ్లు లభించాయి. మిగతా నలుగురూ కొకైన్ వాడినట్లు తేలింది. సిమ్లా నుంచి కొకైన్ తెచ్చినట్లు బెంగళూరు కౌషిక్ రవి వెల్లడించాడు. వాళ్ళందరికీ గత కొంతకాలంగా మత్తుమందులు వాడే అలవాటుందని తేలింది.
తెలంగాణలో ప్రత్యేకంగా ఈగిల్ టాస్క్ ఫోర్స్ తో డ్రగ్స్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, కేసుల సంఖ్య తగ్గడం లేదు. ఏపీలో కూడా డ్రోన్ల సహాయంతో గంజాయి తోటలను గుర్తించి ధ్వంసం చేస్తున్నా, కొత్త ప్రాంతాల్లో సాగు కొనసాగుతోంది.
డ్రగ్స్ మాపియాని రూపుమాపడానికి సమగ్ర వ్యూహం అవసరం. చట్టాన్ని మరింత బలోపేతం చేయాలి. యువతలో అవగాహన పెంచాలి. డ్రగ్స్ కు బానిసైన వారిని శిక్షించడం కంటే చికిత్స చేయడం ముఖ్యం. డీ-అడిక్షన్ కేంద్రాలను విస్తరించాలి. డ్రగ్స్ ట్రాకింగ్, స్మగ్లింగ్ నియంత్రణ కోసం ఆధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించాలి. రాజకీయంగా ఆశ్రయమిస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలాంటి రాజకీయ నేతలపై బహిష్కరణ, నిషేధం విధించాలి. మెక్సికో మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో ఒసెగుయెరా అలియాస్ ‘ఎల్ మెంచో’ ను ఆ దేశమే వెంటాడి చంపాల్సి వచ్చింది.
అంతర్జాతీయ సహకారాన్ని తీసుకోవాలి. డ్రగ్స్, గంజాయి మాఫియా కేవలం నేర సమస్య మాత్రమే కాదు, అది సామాజిక, ఆర్థిక, ఆరోగ్య సంబంధిత సంక్షోభం. తాజా సంఘటనలను హెచ్చరికలా భావించి, ప్రభుత్వాలు, సమాజం కలసికట్టుగా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.

