నీటి సమస్య వనరుల లభ్యత, వినియోగ విధానం, దుర్వినియోగం, సమర్థవంతమైన నిర్వహణలపై ఆధారపడింది. గ్రామీణ భారతావనికి ప్రతి ఇంటికి నల్లాల ద్వారా మంచినీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘జల్ జీవన్ మిషన్’ ను దేశవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ పథకం వల్ల దేశంలో నీటి సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అయ్యాయా? అవుతున్నాయా? ఆ ‘మిషన్’ క‘న్నీటి’ని తుడిచేనా? నీటి సమస్యలు సమసేనా!?
నీటి సమస్య వనరుల లభ్యత, వినియోగ విధానం, దుర్వినియోగం, సమర్థవంతమైన నిర్వహణలపై ఆధారపడింది. గ్రామీణ భారతావనికి ప్రతి ఇంటికి నల్లాల ద్వారా మంచినీరు అందించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ‘జల్ జీవన్ మిషన్’ ను దేశవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ పథకం వల్ల దేశంలో నీటి సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అయ్యాయా? అవుతున్నాయా? ఆ ‘మిషన్’ క‘న్నీటి’ని తుడిచేనా? నీటి సమస్యలు సమసేనా!?
2019 ఆగస్టు 15న ప్రకటించిన జల్ జీవన్ మిషన్ ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి రోజుకు కనీసం 55 లీటర్ల తాగునీటిని పైప్ లైన్ ద్వారా అందించడం. ఈ పథకం ప్రారంభానికి ముందు దేశంలోని 19 కోట్ల గ్రామీణ కుటుంబాల్లో, కేవలం 3 కోట్ల కుటుంబాలకు మాత్రమే నల్లాలు ఉండేవి. అంటే కేవలం 17% కుటుంబాలకే మంచినీరు నేరుగా ఇంటికి చేరేది. కానీ, గత కొన్ని ఏళ్ళల్లో ఈ పథకం వేగంగా అమలవడం వల్ల 2026 నాటికి 15 కోట్లకు పైగా గ్రామీణ కుటుంబాలకు నల్లాల ద్వారా నీరు అందుతోంది. ఇది గ్రామీణ జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలకమైన అంశం. మహిళలు రోజూ గంటల తరబడి నీరు తెచ్చే కష్టాలు తగ్గడం, గ్రామాల్లో ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడడం వంటి ప్రయోజనాలు కనిపిస్తున్నాయి.
అయితే, ఈ సానుకూల విజయాల మధ్య దేశంలో నీటి వనరుల వాస్తవ పరిస్థితి ప్రతికూలంగానే గాక, ఆందోళనకరంగా ఉంది. ప్రపంచ జనాభాలో 18% మంది భారతదేశంలోనే నివసిస్తుంటే, ప్రపంచ నీటి వనరుల్లో దేశానికి కేవలం 4% మాత్రమే ఉన్నాయి. దేశంలో ఉపయోగించదగిన మొత్తం నీటి వనరులు 1,123 బిలియన్ క్యూబిక్ మీటర్లు మాత్రమే. ఇందులో ఉపరితల జలాలు 690 బిలియన్ క్యూబిక్ మీటర్లు కాగా, భూగర్భ జలాలు 433 బిలియన్ క్యూబిక్ మీటర్లుగా నమోదయ్యాయి.
ఇక దేశంలో ఉపయోగించే నీటిలో సుమారు 80% వ్యవసాయ రంగానికే వెళ్తోంది. గృహ వినియోగం 6% మాత్రమే కాగా, పరిశ్రమలు 5% నీటిని వినియోగిస్తున్నాయి. అంటే నీటి వినియోగంలో వ్యవసాయ రంగం ప్రధాన పాత్ర పోషిస్తోంది. వరి, చెరకు వంటి అధిక నీరు అవసరమయ్యే పంటలు పెద్ద మొత్తంలో నీటిని వినియోగిస్తున్నాయి.
భూగర్భ జలాల వినియోగంలో భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. దేశంలో తాగునీటి అవసరాల్లో 85%, సాగునీటిలో 60% వరకు భూగర్భ జలాలపైనే ఆధారపడి ఉన్నాయి. అయితే, అధికంగా బోర్లు తవ్వడం, నిరంతరంగా నీటిని పంపింగ్ చేయడం వల్ల అనేక ప్రాంతాల్లో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయికి అడుగంటి పోతున్నాయి. కేంద్ర గణాంకాల ప్రకారం దేశంలోని 700కి పైగా ప్రాంతాలు ‘ఓవర్ ఎక్స్ ప్లోయిటెడ్’ స్థితికి చేరాయి.
నీటి లభ్యతలో గత కొన్ని దశాబ్దాల్లో పెద్ద మార్పు వచ్చింది. 1951లో ప్రతి వ్యక్తికి ఏడాదికి 5,200 క్యూబిక్ మీటర్ల నీరు అందుబాటులో ఉండగా, ప్రస్తుతం అది 1,500 క్యూబిక్ మీటర్ల కంటే తక్కువకు పడిపోయింది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం దీన్ని ‘వాటర్ స్ట్రెస్’ పరిస్థితిగా పరిగణిస్తున్నారు. జనాభా పెరుగుదల, నగరీకరణ, పరిశ్రమల విస్తరణ వంటి కారణాల వల్ల భవిష్యత్తులో ఈ ఒత్తిడి మరింత పెరగే అవకాశం ఉంది.
దక్షిణ భారత రాష్ట్రాల్లో కూడా నీటి ఒత్తిడి అధికంగానే ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వ్యవసాయ అవసరాల కోసం భూగర్భ జలాల వినియోగం అధికంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో మొత్తం భూగర్భ జల వినియోగంలో 86% వ్యవసాయానికే వెళ్తోంది. తెలంగాణలో కూడా రైతులలో ఎక్కువ శాతం మంది భవిష్యత్తులో నీటి లభ్యతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దేశంలో నీటి సంక్షోభానికి ప్రధాన కారణాలు అనేకం ఉన్నాయి. సంప్రదాయ వరద సాగు పద్ధతులు భారీగా నీటిని వృథా చేస్తున్నాయి. నగరాల్లో మురుగు నీరు, పరిశ్రమల వ్యర్థాలు, నదులు, చెరువులను కాలుష్యానికి గురిచేస్తున్నాయి. చెరువులు, సరస్సులు ఆక్రమణలకు గురవడం వల్ల సహజ నీటి నిల్వ వ్యవస్థలు బలహీనపడ్డాయి. అంతేకాకుండా వర్షపు నీటిని సేకరించే, నిలువ చేసే పద్ధతులు చాలా ప్రాంతాల్లో సరైన స్థాయిలో అమలు కావడం లేదు.
ఈ నేపథ్యంలో జల్ జీవన్ మిషన్ ప్రధానంగా నీటి సరఫరా మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టిన పథకం మాత్రమే. పైప్లైన్లు వేయడం ద్వారా నీటిని ఇంటికి చేరవేయడం సాధ్యమే కానీ, నీటి వనరులు తగ్గిపోతే సరఫరా వ్యవస్థలు కూడా పనిచేయలేవు. కొన్ని ప్రాంతాల్లో వేసవికాలంలో ఈ సమస్య తీవ్రత ప్రస్ఫుటమవుతోంది.
దేశంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలంటే సమగ్ర నీటి నిర్వహణ అవసరం. వర్షపు నీటి సంరక్షణను ప్రోత్సహించడం, డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సాగు పద్ధతులను విస్తరించడం, తక్కువ నీరు అవసరమయ్యే పంటలను ప్రోత్సహించడం, చెరువులు, రిజర్వాయర్లను పునరుద్ధరించడం వంటి చర్యలు కీలకం. ప్రజలలో నీటి వినియోగంపై అవగాహన పెంచడం కూడా అంతే ముఖ్యమైన అంశం.
జల్ జీవన్ మిషన్ గ్రామీణ భారతానికి తాగునీటి అందుబాటును పెంచడంలో గొప్ప ముందడుగు. కానీ. అది నీటి సంక్షోభానికి పూర్తి పరిష్కారం మాత్రం కాదు. నీటి సంరక్షణ, సమర్థ వినియోగం, సమగ్ర విధానాలు సమన్వయం చేసి అమలు చేసినప్పుడే భారతదేశం భవిష్యత్తులో నీటి భద్రతను సాధించగలదు. నీటిని కేవలం వనరుగా కాకుండా జీవనాధారంగా భావించి పరిరక్షించే సంస్కృతి ఏర్పడితేనే ఈ సంక్షోభానికి దీర్ఘకాలిక పరిష్కారం లభిస్తుంది.

