T2O WORLD CUP|టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో భారత్ ఘన విజయం…|INDIA|WIN
3RD TIME|మూడోసారి ప్రపంచ ఛాంపియన్|WORLD|CHAMPION
అహ్మదాబాద్లో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్ మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్ను చిత్తు చేసి మూడోసారి ప్రపంచ ఛాంపియన్గా అవతరించింది. మ్యాచ్ మొత్తం భారత్ ఆధిపత్యం ప్రదర్శించగా, బ్యాటింగ్లో టాప్ ఆర్డర్ ఆటగాళ్లు దూకుడుగా ఆడి భారీ స్కోరు నమోదు చేశారు. లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ జట్టు భారత బౌలర్ల దాడికి తట్టుకోలేక చివరికి 96 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. ఈ విజయం ద్వారా భారత్ మరోసారి టీ20 ప్రపంచ క్రికెట్లో తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ న్యూజిలాండ్ బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ స్కోరు బోర్డును వేగంగా ముందుకు తీసుకెళ్లారు. సంజూ శాంసన్ అద్భుత ఫామ్లో కనిపిస్తూ కేవలం 46 బంతుల్లోనే 89 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్లో ఆకట్టుకునే ఫోర్లు, సిక్సర్లు ఉండడంతో ప్రేక్షకులను అలరించాడు. మరోవైపు అభిషేక్ శర్మ కూడా ఆగ్రెసివ్గా ఆడుతూ కేవలం 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేసి అర్ధసెంచరీ నమోదు చేశాడు. ఈ ఇద్దరు కలిసి తొలి వికెట్కు 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత జట్టుకు బలమైన పునాది వేశారు.
మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన ఇషాన్ కిషన్ కూడా తన దూకుడును కొనసాగిస్తూ న్యూజిలాండ్ బౌలర్లను ఇబ్బంది పెట్టాడు. అతను కేవలం 25 బంతుల్లోనే 54 పరుగులు సాధించి జట్టుకు భారీ స్కోరు దిశగా దారితీశాడు. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్లో నిరాశపరిచాడు. అతను ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అవడంతో అభిమానులకు నిరాశ కలిగింది. చివరి ఓవర్లలో శివమ్ దూబే చెలరేగి ఆడాడు. అతను కేవలం 8 బంతుల్లోనే 26 పరుగులు సాధించి భారత స్కోరు మరింత పెంచాడు. దీంతో భారత జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది.
256 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టుకు ఆశించిన ఆరంభం లభించలేదు. భారత బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ కివీస్ జట్టుపై ఒత్తిడి పెంచారు. జట్టు స్కోరు 31 పరుగుల వద్ద ఉన్నప్పుడు ఫిన్ అలెన్ అవుట్ కావడంతో న్యూజిలాండ్ మొదటి వికెట్ కోల్పోయింది. వెంటనే 32 పరుగుల వద్ద రచిన్ రవీంద్ర కేవలం 1 పరుగుతో పెవిలియన్ చేరడంతో కివీస్కు మరో పెద్ద షాక్ తగిలింది.
ఈ సమయంలో ఓపెనర్ టిమ్ సీఫెర్ట్ ఒక్కడే పోరాడే ప్రయత్నం చేశాడు. అతను కేవలం 26 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 52 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే మిగతా బ్యాటర్లు భారత బౌలర్లకు ఎదురు నిలవలేక వరుసగా అవుట్ అయ్యారు. గ్లెన్ ఫిలిప్స్ 5 పరుగులు మాత్రమే చేసి అవుట్ కాగా, మార్క్ చాప్మన్ 3 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. చివరికి న్యూజిలాండ్ జట్టు 19 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది.
దీంతో భారత్ 96 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి టీ20 వరల్డ్ కప్ 2026 ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ విజయంతో భారత జట్టు మూడోసారి టీ20 ప్రపంచ ఛాంపియన్గా నిలిచి అభిమానులను ఆనందంలో ముంచెత్తింది.
డారిల్ మిచెల్కు క్షమాపణలు చెప్పిన అర్ష్దీప్ సింగ్
మ్యాచ్ సందర్భంగా న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో భారత బౌలర్ అర్ష్దీప్ సింగ్ బంతిని వికెట్ల వైపు విసరగా అది మిచెల్కు బలంగా తాకింది. తన బౌలింగ్లో వరుసగా సిక్స్లు బాదడంతో అర్ష్దీప్ సింగ్ కొంత అసహనానికి గురై బంతిని వికెట్ల వైపు కొట్టినట్టు కనిపించింది. దీంతో డారిల్ మిచెల్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఇద్దరి మధ్య మైదానంలో కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ జోక్యం చేసుకుని పరిస్థితిని చల్లార్చాడు. మిచెల్కు క్షమాపణలు చెప్పగా, ఫీల్డ్ అంపైర్ కూడా అర్ష్దీప్ సింగ్ను మందలించాడు. అనంతరం ఆ ఓవర్ ముగిసిన వెంటనే అర్ష్దీప్ సింగ్ స్వయంగా డారిల్ మిచెల్కు క్షమాపణలు చెప్పడంతో వివాదం ముగిసింది.
మ్యాచ్ అనంతరం బ్రాడ్కాస్టర్ హోస్ట్ హర్షా భోగ్లే ఈ ఘటనపై ప్రశ్నించగా అర్ష్దీప్ సింగ్ తన వివరణ ఇచ్చాడు. తాను ఉద్దేశపూర్వకంగా బంతిని మిచెల్పైకి విసరలేదని స్పష్టం చేశాడు. బంతి రివర్స్ స్వింగ్ కావడంతో అతనికి తగిలిందని తెలిపాడు. ఇప్పటికే మిచెల్కు క్షమాపణలు చెప్పినట్లు పేర్కొన్నాడు. ఈ విజయం తమ జట్టుకు ఎంతో ప్రత్యేకమని, కానీ ఈ ఆనందాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఇంకా కొన్ని రోజులు పడుతుందని అన్నాడు. జట్టులో చాలా మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నారని, ఈ విజయం తమకు చిరస్మరణీయమైన తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందని అర్ష్దీప్ సింగ్ పేర్కొన్నాడు.

