సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో 130 మంది మావోయిస్టుల చారిత్రాత్మక లొంగుబాటు
124 అత్యాధునిక ఆయుధాల అప్పగింత
తెలంగాణ రాష్ట్రంలో దశాబ్దాలుగా సాగుతున్న సాయుధ పోరాట చరిత్రలో నేడు ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. తుపాకీ గొట్టం ద్వారా కాకుండా చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని నమ్మి, ఏకంగా 130 మంది మావోయిస్టులు సాయుధ పోరాటాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిశారు. శనివారం సాయంత్రం హైదరాబాద్లోని స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (ICCC) వేదికగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ భారీ లొంగుబాటు ప్రక్రియ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో కేడర్, అదీ అత్యాధునిక ఆయుధాలతో లొంగిపోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
కుప్పలుతెప్పలుగా మారిన మారణాయుధాలు
లొంగిపోయిన మావోయిస్టులు తాము ఇన్నాళ్లూ అడవిలో వెంటబెట్టుకున్న 124 అత్యాధునిక తుపాకులను పోలీసులకు అప్పగించారు. వీటిని స్వయంగా పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయుధాల స్థాయిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
స్వాధీనం చేసుకున్న ఆయుధాల జాబితా ఇలా ఉంది:
-
31 AK-47 రైఫిళ్లు
-
21 INSAS రైఫిళ్లు
-
20 SLR రైఫిళ్లు
-
1 INSAS LMG (లైట్ మెషిన్ గన్)
-
18 .303 రైఫిళ్లు
-
33 ఇతర రకాల తుపాకులు
తుడిచిపెట్టుకుపోయిన ‘తెలంగాణ రాష్ట్ర కమిటీ’
ఈ లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి తెలంగాణలో కోలుకోలేని దెబ్బ తగిలిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. లొంగిపోయిన 130 మందిలో అగ్రశ్రేణి నాయకులు ఉండటం గమనార్హం.
-
రాష్ట్ర కమిటీ సభ్యులు: 03 మంది
-
రీజినల్ కమిటీ సభ్యుడు: 01
-
డివిజనల్ కమిటీ సభ్యులు: 10 మంది
-
ఏరియా కమిటీ సభ్యులు: 46 మంది
-
పార్టీ సభ్యులు: 70 మంది
ఇటీవల కేంద్ర కమిటీ సభ్యులు దేవ్జీ (తిప్పిరి తిరుపతి), దామోదర్, రాజిరెడ్డి వంటి దిగ్గజాలు లొంగిపోవడంతో, వారి అడుగుజాడల్లోనే మిగిలిన కేడర్ కూడా బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటన ప్రకారం, ప్రస్తుతం తెలంగాణలో మావోయిస్టు రాష్ట్ర కమిటీ అనేది నామమాత్రంగా కూడా ఉనికిలో లేదు.
బుల్లెట్ వద్దు.. బ్యాలెట్ ముద్దు: ముఖ్యమంత్రి పిలుపు
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావోద్వేగంగా ప్రసంగించారు. “శాంతియుత మార్గాల ద్వారానే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని మన దేశం బలంగా నమ్ముతుంది. మహాత్మా గాంధీ అహింసా మార్గంలో పోరాడి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారు. యుద్ధాలు చేస్తున్న దేశాలు కూడా చివరికి చర్చలకే మొగ్గు చూపుతున్నాయి. అడవిలో ఉన్న వారు కూడా హింసను వీడి ప్రజాస్వామ్య బద్ధంగా సమస్యలను పరిష్కరించుకోవాలి,” అని ఆయన కోరారు.
ప్రభుత్వం తరపున వరాల జల్లు:
లొంగిపోయిన వారికి పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం వెనకడుగు వేయదని సీఎం స్పష్టం చేశారు.
-
ఇందిరమ్మ ఇళ్లు: లొంగిపోయిన ప్రతి ఒక్కరికీ నివసించడానికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తారు.
-
మెరుగైన వైద్యం: అడవిలో అనారోగ్యానికి గురైన వారికి ప్రభుత్వ ఖర్చుతో మెరుగైన వైద్య సేవలు అందిస్తారు.
-
ఆర్ధిక ప్యాకేజీ: ప్రస్తుతం ఉన్న పునరావాస ప్యాకేజీని మరింత పెంచి, వారు గౌరవప్రదంగా బతికేలా ఆర్ధిక వెసులుబాటు కల్పిస్తాం.
-
కేసుల ఎత్తివేత: చట్టపరంగా అవకాశం ఉన్న కేసులను ఎత్తివేసేందుకు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.
గణపతికి రేవంత్ రెడ్డి ఓపెన్ ఆఫర్
ముఖ్యంగా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు మాజీ చీఫ్ గణపతితో పాటు ఇతర కేంద్ర కమిటీ సభ్యులకు రేవంత్ రెడ్డి బహిరంగ పిలుపునిచ్చారు. “తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను మీకు హామీ ఇస్తున్నాను.. మీరు బయటకు రండి, మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఇటీవల అమిత్ షాతో జరిగిన భేటీలో కూడా మావోయిస్టుల పునరావాసంపై చర్చించాం. కేంద్రం కూడా సానుకూలంగా ఉంది,” అని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి
2024 జనవరి నుండి ఇప్పటివరకు సుమారు 721 మంది మావోయిస్టులు లొంగిపోవడం రేవంత్ సర్కార్ సాధించిన అతిపెద్ద విజయంగా చెప్పవచ్చు. “హింస ద్వారా ఏదీ సాధించలేం. అభివృద్ధి మార్గంలో పయనించి తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు కావాలి” అంటూ సీఎం తన ప్రసంగాన్ని ముగించారు.

