
ఎన్నికలంటే గెలుపోటములు సహజమే. అయితే కొందరికి ఓటమి రాజకీయంగా మాత్రమే కాదు… మానసికంగా కూడా తట్టుకోలేని బాధను మిగిల్చుతుంది. నల్లగొండ జిల్లా నార్కెట్పల్లి మండలం ఔరవాణి గ్రామపంచాయతీ ఎన్నికల ఫలితాలు అలాంటి హృదయవిదారక ఘటనకు దారితీశాయి. తొలి విడతలో జరిగిన ఈ ఎన్నికల్లో 1577 ఓట్లు ఉన్న గ్రామంలో నలుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధాన పార్టీల మద్దతుదారులతో పాటు ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా పోటీ చేశాడు. చివరకు కాంగ్రెస్ మద్దతుదారుడు జక్కల పరమేష్ విజయం సాధించగా, ఇండిపెండెంట్ అభ్యర్థి బాలరాజు గౌడ్ రెండో స్థానంలో నిలిచాడు. అయితే ఈ ఎన్నికల్లో గెలుపు కోసం బాలరాజు గౌడ్ రూ.10 లక్షలకుపైగా ఖర్చు చేశాడని గ్రామంలో చర్చ జరుగుతోంది. అనూహ్య ఓటమి అతన్ని తీవ్ర మానసిక వేదనకు గురిచేసింది. అప్పు చేసి ఎన్నికల్లో ఖర్చు పెట్టిన తన పరిస్థితిని వివరించుకుంటూ, ఓటు వేస్తామని చెప్పి మోసం చేశారంటూ గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ డబ్బులు తిరిగి ఇవ్వాలని వేడుకుంటున్నాడు. దేవుడి చిత్రపటం చేతబట్టి, భార్య పురుగుల మందు డబ్బా పట్టుకుని ఓటర్లను కోరడం గ్రామంలో కలకలం రేపింది. అందరూ ఓట్లు వేశామంటూ దేవుడిపై ప్రమాణం చేశారు… మరి నేను ఎలా ఓడిపోయాను? అంటూ అభ్యర్థి కన్నీటితో విలపించడం చూసి గ్రామస్తులూ విస్తుపోయారు. ఎన్నికల పోరు ఓ కుటుంబాన్ని ఎంత బాధలోకి నెట్టిందో… చూసిన ప్రజలు ఒక్కసారిగా విస్తుపోయారు.

