
గా యినాయకుని పండుగ రానే ఒచ్చింది. యినాయకుడంటే యెవరు? ఆది దేవుడు. అంటే అందరూ అందరికన్నా మొట్ట మెదలే మొక్కే దేవుడన్నట్లు. మనం యే కార్యం సేసుకున్నా, ముందు గీ యినాయకుడ్నే తలుసుకుంటం. దేవుడా! మమ్మల్ని కాపాడు. యిగ్నాలు లేకుండ సల్లంగ సూడంటం. గందుకే గీ యినాయకుని పండుగొస్తే సాలు, మస్తు మజాగ జరుపుకుంటం. ఇంటింటికీ గా రాగడి మట్టి యినాయకుడ్ని నిలుపుకుంటం. పూలూ, పత్రి తెచ్చి మొక్కుతం. పాశం ఒండుకుని, ఉండ్రాల్లు సేసుకుని, తీరొక్క కాయగూరలతో తింటం. గా బొజ్జ వినాయకుని పేరుతోని మన బొజ్జలు నింపుకుంటం. గట్లనే మూషిక వాహనుడు గాబట్టి, ఎల్కలకు కూడా ఉండ్రాల్లు, పాశబువ్వ డొప్పలల్ల పెడతం.
యిగ రాను రాను గీ పండుగ పెనం నుంచి పొయ్యిల పడ్డట్లు… ఇంట్ల నుంచి యీదిల బడ్డది. యిగ యీ యినాయకుడ్ని గా పడుసు పోరగాండ్లు, బుడ్డ బుడ్డ పోరగాండ్లు యీదికి ఒకటా రెండా.. యేడ బడితే గాడ, యెన్ని బడితే గన్ని, యిగ్రహాలు తెచ్చి పెడతాండ్లు. పీఓపీ అంటరు గద. గా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తోని సేసే, రకరకా రసాయ్నాలు కలిపే రంగులతోని అద్దినవి తెచ్చి పెడతాండ్లు. నవరాత్రులూ కొలసి, పూజలు సేసి, బంతి బోజనాలు పెట్టి, తీర్త పసాదాలు ఇస్తరు. ఇగ నిమజ్జనం సేసేటప్పుడు డీజేలు, డాన్సులు, డప్పులతోని ఊరేగింపులు జర్పుతరు. కొందరు గా తిక్క పోరగాండ్లు కాసంత సుక్కేసుకుని ఒక్కతీర్గ యెగురుతరు. గా పడుసోల్ల ఉర్రూతలతోని ఊరూరే గత్తరొచ్చినట్లు మోత మోగుద్దంటే నమ్ముండ్లి.
గిట్ల ఒక్క గా పట్నంలనే మూడు లచ్చల పీఓపీ యిగ్రహాలు పెడతాండ్లట. గియి గాక ఓ లచ్చ మట్టి యిగ్రహాలను గా పట్నం పెద్ద మున్సిపాల్టీ వోల్లు పంచుతాండ్లట. గీ లెక్కన అడుగు డిజిటలోల్లం గూడా మట్టి యినాయకుల్ని మస్తుగ పంచితిమి. యింక లెక్కకు రాని వాటి లెక్కలైతే తెల్వనే తెల్వదు. గీవీట్ని నిమజ్జనం సేయడాన్కి, 30 నిమజ్జన అడ్డాలల్ల, పెద్ద పెద్ద క్రేన్లు పెడ్తాండ్లట. పోయినసారే ఒక్క ఉస్సేన్ సాగర్లనే 5,800 పీఓపీ యర్ధాలను తీసిండ్లట. ఇగ గా పట్నంల ఈసారి యెట్లుంటదో యేందో మరి!
గీ ఒక్క హైదరాబాద్లనే గిట్లుంటే దేశమంతా ఎట్లుంటదో సోచాయించుండ్లి. గందుకే మనం మట్టి యిగ్రహాలనే పెట్టాలె. గవి గూడ సిన్నసిన్నంగనే ఉండాలె. ఇగ సెరువులు, కుంటల్ల వేయనే వద్దు. ఒకేల యేస్తే ఏటా ఎండాకాలంల గా మట్టిని పూడిక లెక్క తీయాలె. గిదంతా మనం సేయకపోతిమి. మన్నలి యేలేటోడు సేయకపాయె. ఇగ ఎట్లైతదుల్ల? గీ పీకులాట లేకుంట సూసుకోవాలె. యేలం యెర్రి లెక్క గాకుండా గా దిమాక్ తోని ఆలోసించాలె. పక్రుతికి, పర్యావరణానికి, గట్లనే గీ జనానికి, పరేషాన్ గాకుంట సూడాలె. ఎకో ఫ్రెండ్లీ అంటరు గద. మనం గూడ గట్లనే ఉండాలె. సమజైతాందా?

