ప్రజాభిప్రాయానికి ప్రతిబింబమా?
సీఎం రేవంత్ పనితీరుకు పట్టమా?
ప్రజల్లో పుంజుకున్న కాంగ్రెస్!
గ్రామాల్లో బలంగానే బీఆర్ఎస్!!
గ్రామీణుల్లో పాగా వేస్తున్న బీజేపీ!?
పార్టీలను కాదని, స్వతంత్రులవైపు ప్రజల మొగ్గు?
హైదరాబాద్, డిసెంబర్ 11 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి దశలో 84.28 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 57,57,277 మంది ఓటర్లలో 45,15,141 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళలు23,15,796 మంది, పురుషులు 21,99,367 మంది, ఇతరులు 78మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో అత్యధికంగా 90శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యంపై గ్రామీణ ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరోసారి రుజువు చేశాయి. స్వగ్రామ అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారానికి, నాయకత్వాన్ని ఎన్నుకోవడంలో గ్రామీణులు చూపిన ఆసక్తి, ఎక్కువ శాతం పోలింగ్ రూపంలో ప్రతిఫలించింది. మరోవైపు అధికార కాంగ్రెస్, ఎన్నికేదైనా, తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఇంకోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నాయకత్వాన్ని పటిష్టం చేసుకుంటూ, హవాను కొనసాగిస్తున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ మూడింట రెండు వంతుల మెజార్టీని సాధించింది. కాంగ్రెస్ ఓడిన అనేక స్థానాల్లో ఆపార్టీ రెబెల్సే ఉన్నారు. ఆ విధంగా కాంగ్రెస్ 2383కి పైగా గ్రామ పంచాయతీలను గెలుచుకోగా, బీఆర్ఎస్1146కి పైగా స్థానాలతో సరిపెట్టుకుంది. 181 పంచాయతీలు గెలిచిన బీజేపీ గతంలో ఎన్నడూ లేనంతగా గ్రామాల్లో పాగా వేసింది. 455 సర్పంచ్ లు గెలిచి, స్వతంత్రులు తమ సత్తా చాటారు. వీటిలో సీపీఎం 14, సీపీఐ 16 చోట్ల గెలిచాయి. ఇవన్నీ గ్రామాల్లో రాజకీయాల్లో మారుతున్న సమీకరణలకు సంకేతాలుగా నిలుస్తున్నాయి.
ప్రభుత్వ పథకాలకు పాజిటివ్ ప్రజాభిప్రాయమా?
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కు వచ్చిన భారీ ఆధిక్యం ప్రభుత్వంపై, ప్రస్తుతం ప్రభుత్వం చేపడుతున్న పథకాలపైన గ్రామీణుల్లో ఉన్న నమ్మకానికి ప్రతిబింబంగా చూడొచ్చు. ముఖ్యంగా రైతులకు సాగు నీరు, గ్రామీణ రహదారులు, డీవోల్యూషన్ నిధులు, స్థానిక నేతల చురుకుదనం వంటి అంశాలు గ్రామ స్థాయిలో కాంగ్రెస్ పై పోజిటివ్ వైబ్ను సృష్టించినట్లు కనిపిస్తోంది.
గ్రామీణ ఓటు బ్యాంకు లక్ష్యంగా ఇందిరమ్మ చీరెల పంపిణీని వేగంగా పూర్తి చేయడం, మెరుగైన నాణ్యమైన చీరెలను అందించామని చేసిన ప్రచారం మహిళా ఓటర్లలో బాగానే వర్కౌట్ అయినట్లుగా కనిపిస్తోంది. ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, రైతులకు రాయితీలు వంటి పథకాలు కూడా ఓటర్లను ఆకట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇక పెట్టుబడులు, ఫ్యూచర్ సిటీ ప్రణాళిక, ఉపాధి అవకాశాల పెరుగుదల వంటి అంశాలు కూడా ప్రజలను ఆకర్షించాయనుకోవాలి.
సీఎం రేవంత్ పనితీరుకు పట్టమా?
మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డి ఇమేజ్ను పార్టీ బలంగా ఉపయోగిస్తోంది. అంతేగాక ప్రభుత్వాధినేతగా సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ కు ఈ ఫలితాలు తార్కాణంగా చూడొచ్చు. ప్రభుత్వాన్ని నడిపిస్తున్న తీరు, పరిపాలనలో పాదర్శకత, సమర్థత, ప్రభుత్వ పథకాలిస్తున్న సత్ఫలితాలు, ప్రతిపక్షాలపై సీఎం సాధిస్తున్న పై ‘చేయి’కి, పట్టుకు ఇవి నిదర్శనాలు. అయితే, సాధారణంగా స్థానిక ఎన్నికల్లో పలితాలు ప్రభుత్వంలో ఉన్న పార్టీకి సానుకూలంగా ఉంటాయనే అభిప్రాయం ఉంది. అయినప్పటికీ, ప్రభుత్వ, సీఎం పనితీరుని తక్కువగా చూడటం సరికాదు.
గ్రామాల్లో బలంగానే బీఆర్ఎస్
అదే సమయంలో బీఆర్ఎస్ 1125 పంచాయతీల్లో గెలిచిన తీరు ఆ పార్టీకి గ్రామాల్లో ఉన్న బలమైన కేడర్ నెట్వర్క్ ఇప్పటికీ ప్రభావవంతంగానే కొనసాగుతోందని తేట తెల్లం చేస్తోంది. బీఆర్ఎస్ రాష్ట్ర స్థాయిలో అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నా, గ్రామ రాజకీయాల్లో వారి పట్టు పటిష్టంగానే ఉన్నదని ఈ ఎన్నికలు తెలియజేశాయి.
గ్రామాల్లో పాగా వేస్తున్న బీజేపీ
బీజేపీ 502 గ్రామాల్లో గెలిచి, చూపిన ప్రభావాన్ని తక్కువ అంచనా వేయలేం. ఇప్పటి దాకా అతి కొద్ది పట్టణ ప్రాంతాలకే పరిమితమైన బీజేపీ గ్రామాల్లోనూ వేళ్ళూను కుంటోందనడానికి ఈ ఫలితాలే నిదర్శనం. బీజేపీకి గ్రామీణుల్లో, మధ్య, ఎగువతరగతికే కాకుండా, దిగువ తరగతి ప్రజల్లోనూ చొచ్చుకుపోతున్నది.
పార్టీలను కాదని, స్వతంత్రులవైపు ప్రజల మొగ్గు?
అయితే స్వతంత్రులు, 502 పంచాయతీలను గెలుచుకోవడం అత్యంత ఆసక్తికర పరిణామం. గ్రామాల్లో జాతీయ, రాష్ట్ర పార్టీలు కాకుండా స్థానికంగా వ్యక్తులు, వారి వ్యక్తిత్వాలు, సేవా గుణం, కుల సామాజిక సమీకరణలు ఇప్పటికీ పంచాయతీ ఎన్నికలకు బలమైన ఆయుధాలని చాటి చెబుతోంది.
ఇంకా ఈ ఫలితాలు, రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రజలు ఏ పార్టీపై పూర్తి స్థాయి విశ్వాసం ఉంచలేదని తేలిపోయింది. పార్టీలకతీతంగా, సమస్యలు వాటి పరిష్కారాలు, అభివృద్ధి ఆధారంగా, తమ నాయకుడిని ఎంచుకుంటున్నారని అర్థమవుతోంది.
ఇక రానున్న ఎన్నికలు త్రిముఖమే!
గ్రామ పంచాయతీ ఎన్నికలు సాధారణంగా స్థానిక సమీకరణలపైనే ఆధారపడి ఉంటాయి. అయినప్పటికీ, కాంగ్రెస్కు వచ్చిన మెజార్టీ స్థానాలు, ఆ పార్టీ అధికారానికి మొదటి దశలో వచ్చిన మద్దతుగా భావించవచ్చు. బీఆర్ఎస్కు వచ్చిన స్థానాలు గ్రామాల్లో ఆ పార్టీకి చెక్కు చెదరని బలాన్ని తెలియజేస్తున్నాయి. బీజేపీకి వచ్చిన స్థానాలు, భవిష్యత్ రాజకీయాల్లోకి ఆ పార్టీ దూసుకు వస్తున్న తీరును స్పష్టం చేస్తున్నాయి. స్వతంత్రుల గెలుపు గ్రామీణ రాజకీయాల స్వరూపం ఇంకా సంప్రదాయబద్ధాగానే ఉందని గుర్తు చేస్తోంది.
ఈ ఫలితాలు తెలంగాణ గ్రామీణ రాజకీయ సమీకరణాలు మరింత వేగంగా మారే అవకాశాన్ని సూచిస్తున్నాయి. అయితే మొదటి దశ ఎన్నికలు, మిగతా రెండు దశల పంచాయతీ ఎన్నికలకు ఫలితాలపై స్పష్టమైన ప్రభావాన్ని చూపడం ఖాయం.

