ఏర్పాటు దిశగా మాజీ మావోల ఆలోచన!|EX MAOIST
పార్టీ, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ రద్దు|PEOPLES LIBERATION GERILLA ARMY
హోంమంత్రి అమిత్షాతో చర్చిద్దామన్న సీఎం|HOME MINISTER|CM|REVANTH REDDY
కేంద్రం ఓకే అంటే, బహిరంగ సభ ద్వారా ప్రకటన|CENTRAL GOVERNMENT
సీఎం రేవంత్తో మావోయిస్టు నేతల కీలక చర్చలు!
లొంగిన మావోయిస్టులకు త్వరలో రివార్డులు|REWARDS
ఆరోగ్య శ్రీ అమలుకు సీఎం రేవంత్ ఆదేశం|AAROGYA SRI
దేశ, తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక అరుదైన, చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుందా? దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉండి, సాయుధ పోరాటమే మార్గమని నమ్మిన మావోయిస్టు అగ్రనేతలు రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా ఆలోచన చేస్తున్నారా? మావోయిస్టు పార్టీ పేరుతోనే రాజకీయ పార్టీని పెట్టాలనుకుంటున్నారా? ఇందుకు మావోయిస్టు పార్టీతోపాటు, పార్టీ, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీని రద్దు చేయడానికి కూడా సిద్ధమయ్యారా? కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితోనే రాజకీయ పార్టీగా మారి, ఇక జనారణ్యంలోనే సమస్యలతో యుద్ధం చేస్తారా? ఆపరేషన్ కగార్ విజయవంతమై, అతి కొద్ది రోజుల్లోనే ఆఖరి ఘట్టం ముగిసిన వెంటనే, ఈ కొత్త మావోయిస్టు రాజకీయ పార్టీ ఆవిష్కరణ జరిగే విధంగా మాజీ మావోయిస్టులు ఆలోచిస్తున్నారా? జనజీవన స్రవంతిలో కలిసిన తర్వాత మావోయిస్టు పార్టీ సీనియర్ నాయకులంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈ అంశాలు ప్రస్థావనకు వచ్చినట్లుగా అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.
మొన్న లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేతలు హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో సీఎంతో ప్రత్యేకంగా సమావేశమైన సంగతి తెలిసిందే. దాదాపు గంటసేపు సాగిన సమావేశంలో మావోయిస్టు నేతలు తమ అంతరంగాన్ని సీఎంతో ఆత్మీయంగా ఆవిష్కరించారు. వారి సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలోనే రాజకీయ పార్టీ విషయం కూడా చర్చకు వచ్చింది. నాలుగున్నర దశాబ్దాల పాటు అడవిని నమ్ముకొని పోరాటం చేసిన కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇటీవలే డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడు, సెంట్రల్ మిలటరీ కమిషన్ ఇన్ఛార్జీ తిప్పిరి తిరుపతి(దేవ్జి), కేంద్ర కమిటీ సభ్యులు మల్లా రాజిరెడ్డి(సంగ్రామ్), రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు(జగన్), రాష్ట్ర కమిటీ సభ్యుడు నూనె నర్సింహారెడ్డి (గంగన్న) ముఖ్యమంత్రిని కలిశారు. వీరితోపాటు గతంలోనే లొంగిపోయిన కేంద్ర కమిటీ సభ్యులు పుల్లూరి ప్రసాద్, పోతుల పద్మావతి కూడా ఉన్నారు. ఈ భేటీలో మావోయిస్టు నేతలు ఒక సంచలన ప్రతిపాదన చేశారు. కేంద్ర ప్రభుత్వం అంగీకరిస్తే సాయుధ పోరాటాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో కొనసాగిస్తామని పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీని రద్దు చేస్తామని దేవ్జి, రాజిరెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటి వరకు అనుసరించిన పోరాట పంథాను వదిలి, చట్టపరంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమాన్ని కొనసాగించాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. అంతేకాకుండా, ప్రభుత్వాలు సహరిస్తే రాజకీయ పార్టీగా మార్చేందుకు కూడా సిద్ధమని వారు తెలిపారు. ఈ ప్రతిపాదనపై స్పందించిన రేవంత్ రెడ్డి, ఈ అంశం తన పరిధిలో లేదని త్వరలోనే కేంద్ర హోంమంత్రి అమిత్షాను కలిసినప్పుడు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తాను అని హామీ ఇచ్చారు. కేంద్రం ఓకే అంటే కేంద్ర హోంమంత్రిని ఇక్కడికి పిలిపించి, ఒక భారీ సభ ఏర్పాటు చేసి ఈ విషయాన్ని ప్రకటిస్తామని సీఎం చెప్పారు.
మావోయిస్టు నేతలు తమ పునరావాసం, ఇతర మౌలిక వసతుల గురించి ముఖ్యమంత్రి కీలక అభ్యర్థనలు చేశారు. లొంగిపోయిన మావోయిస్టులకు తక్షణమే ఆరోగ్య శ్రీ సదుపాయం కల్పించాలని సీఎం ఆదేశించారు. ప్రస్తుతం లొంగిపోయిన వారికి 30 ఏళ్ల క్రితం నాటి రివార్డు సొమ్మునే ఇస్తున్నారని, ఇతర రాష్ట్రాల్లో ఇది ఎక్కువగా ఉందని తెలిపారు. దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని డీజీపీని ఆదేశించారు. ఇళ్ల స్థలాలు ఇవ్వడంపై క్యాబినెట్లో చర్చిస్తామని, అయితే వ్యవసాయ భూమి ఇవ్వడం సాధ్యం కాదని సీఎం స్పష్టం చేశారు.
ఏవైనా రాజకీయ అంశాలు ఉంటే ప్రభుత్వ సలహాదారు కేశవరావును, ఆర్థికపరమైన అంశాల కోసం వేం నరేందర్రెడ్డిని కలవాలని సీఎం సూచించారు. జన జీవన స్రవంతిలో కలిసిన నేతలకు ఎలాంటి భద్రతా పరమైన ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. హింస దేనికీ పరిష్కారం కాదని, ప్రజాస్వామ్య పద్ధతిలోనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని ఆయన హితవు పలికారు. సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ జిల్లా గద్వాల్కు చెందిన సుజాతక్కతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఎన్కౌంటర్లో మరణించిన మల్లోజుల కోటేశ్వరరావు భార్య అయిన ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
మొత్తానికి నెత్తురు చుక్క నేల రాలకుండా, మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటులో కీలకంగా వ్యవహరించిన తెలంగాణ సీఎం, వారి పునరావసంతోపాటు, ప్రజాస్వామిక పంథాలో రాజకీయ పార్టీగా పోరాటానికి కూడా సహకరించడం, ఆయన ముందే మాజీ మావోయిస్టు అగ్రనేతలు ప్రస్థావించడం చర్చనీయాంశంగా మారింది.

