వరుస యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. కరోనా మొత్తం భూమినే అతలాకుతలం చేస్తే, ఇప్పుడు మధ్యప్రాచ్యంలో యుద్ధాలు, ఉద్రిక్తతల వల్ల మరోసారి చమురు సంక్షోభం ముంచుకొచ్చింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై ఈ ప్రభావం మరింత తీవ్రంగా ఉండనుంది.
భారత్ తన ముడి చమురు అవసరాల్లో 85% దిగుమతులపైనే ఆధారపడుతోంది. హార్మూజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో 20% రవాణా జరుగుతుంది. ప్రస్తుత యుద్ధం నేపథ్యంలో ఇరాన్ ఈ చమురు రావాణా మార్గాన్ని మూసివేసింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు కొరత ఏర్పడి, ధరలు అమాంతం పెరుగనున్నాయి. తద్వారా పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలు కూడా పెరుగుతాయి. దాంతో రవాణా ఖర్చులు పెరిగి, నిత్యావసరాల ధరలు కూడా ఎగబాకడం అనివార్యం.
చమురు ధరల పెరుగుదలతో వాణిజ్య లోటు పెరుగుతుంది. ఇప్పటికే దిగుమతులు ఎక్కువగా, ఎగుమతులు తక్కువగా ఉన్న నేపథ్యంలో డాలర్ డిమాండ్ పెరిగి రూపాయి విలువ పడిపోతుంది. రూపాయి బలహీనపడితే దిగుమతుల ఖర్చు మరింత పెరుగుతుంది. ఇది ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచే దుష్ప్రభావం కలిగిస్తుంది. ద్రవ్యోల్బణం 6 శాతానికి మించి పెరిగితే సామాన్యుల జీవన వ్యయం గణనీయంగా పెరుగుతుంది.
భారత్ ప్రతి ఏడాది 5–6 మిలియన్ టన్నుల కందిపప్పు, పెసరపప్పు వంటి పప్పుదినుసులను మయన్మార్, కెనడా, ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. అలాగే సోయా ఆయిల్ను అర్జెంటీనా, బ్రెజిల్, అమెరికా నుంచి, సన్ఫ్లవర్ ఆయిల్ను ఉక్రెయిన్, రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఈ సరుకులు ఎక్కువగా సూయెజ్ కాలువ, హార్ముజ్ జలసంధి మార్గాల ద్వారా వస్తాయి. ఈ మార్గాల్లో అంతరాయం కలిగితే నౌకలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. దాంతో రవాణా, బీమా ఖర్చులు పెరిగి చివరకు వినియోగదారులపై భారమవుతుంది. అలాగే జీడిపప్పు, పిస్తా, ఎండు ద్రాక్ష, ఆప్రికాట్ వంటి డ్రైఫ్రూట్స్ దిగుమతులు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. సరఫరా తగ్గితే ధరలు పెరగడం ఖాయం. ఇది మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం వేస్తుంది.
మన దేశ జనాభా 147 కోట్లకు చేరుకుంది. వివిధ నివేదికల ప్రకారం ఇప్పటికీ 28% మంది పేదరికంలో జీవిస్తున్నారు. దేశ సంపదలో సగానికి మించి, కేవలం 10% మంది ధనవంతుల చేతుల్లోనే కేంద్రీకృతమై ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ధరల పెరుగుదల పేదలు, దిగువ మధ్యతరగతి వర్గాలను మరింత కష్టాల్లోకి నెడుతుంది.
వ్యవసాయ రంగం బలహీనపడటం, నిరుద్యోగం పెరగడం, విద్యా–వైద్య సేవలు ఖరీదైనవిగా మారడం వంటి అంశాలు ఇప్పటికే సామాజిక ఒత్తిడిని పెంచుతున్నాయి. యుద్ధ ప్రభావంతో ద్రవ్యోల్బణంతో, జీవన వ్యయం పెరగడం వల్ల అప్పుల భారమూ అధికమవుతుంది. ఇది ఆత్మహత్యలు, సామాజిక అస్థిరత వంటి సమస్యలకు దారి తీసే ప్రమాదం ఉంది.
మరి ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? చమురు దిగుమతులను తగ్గించుకుంటూ, ప్రత్యామ్నాయ ఇంధన వనరులను ప్రోత్సహించాలి. పప్పుదినుసులు, నూనె గింజల ఉత్పత్తిని దేశీయంగా పెంచాలి. రైతులకు కనీస మద్దతు ధర, నిల్వ సదుపాయాలు, ప్రాసెసింగ్ యూనిట్లు కల్పించాలి. కీలక దిగుమతులపై సమయానుకూల నియంత్రణలు విధించి దేశీయ ఉత్పత్తిదారులను రక్షించాలి. పేదల కోసం నేరుగా నగదు బదిలీలు, ఆహార భద్రత పథకాలు బలోపేతం చేయాలి.
యుద్ధాలు తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలు కలిగించినా, వాటి ప్రభావాలు దీర్ఘకాలికంగా తీవ్రం. ప్రపంచీకరణ యుగంలో ఒక చోట సంక్షోభం మొత్తం ప్రపంచాన్ని తక్షణమే ప్రభావితం చేస్తుంది. కాబట్టి భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేయాలి. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి, దేశీయ ఉత్పత్తి, వినియోగాన్ని పెంచుకోవాలి.
సమయోచిత విధానాలు అమలు చేస్తే దాని ప్రభావాన్ని నియంత్రించడమే కాదు తగ్గించుకోవడం కూడా సాధ్యమే. సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని ఆర్థిక సంస్కరణలకు పూనుకుంటేనే దేశం దీర్ఘకాలికంగా ఆర్థికంగా బలపడుతుంది.

