ఇరాన్–అమెరికా–ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అనిశ్చితి అంచులపై నిలిపింది. ఇది కేవలం యుద్ధ దేశాలకే పరిమితం కాదు. ప్రపంచ ఇంధన భద్రతకు కీలక నాడి హార్ముజ్ జలసంధి చుట్టూ ముప్పు ముసురుకుంది. ఇది అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు పెను హెచ్చరికగా మారింది. ఈ జలసంధి మూసివేయడంతో చమురు సరఫరా నిలిచిపోయింది. సరఫరా తగ్గితే ధరలు పెరగడం, ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరుగడం, ద్రవ్యోల్బణం పెరిగితే కొనుగోలు శక్తి తగ్గడం, ప్రజల జీవన వ్యయం మరింత భారమవడం అనివార్యం.
ప్రపంచ రోజువారీ చమురు వినియోగంలో 20% హార్మూజ్ జలసంధి నుంచే సరఫరా అవుతోంది. ఈ మార్గం ద్వారా జరిగే చమురు ఎగుమతుల్లో 82% ఆసియాకు వెళ్తున్నాయి. ఇందులో భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా వాటా 67%గా ఉంది. భారత్ ముడి చమురులో 90% మిడిల్ ఈస్ట్ దేశాల నుంచే వస్తోంది. అందులోనూ గణనీయంగా గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, ఇరాక్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఖతార్ ల నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇందులో 40% హార్మూజ్ జలసంధి నుంచే వస్తున్నాయి.
ప్రపంచ వాణిజ్యాన్ని పర్యవేక్షించే సంస్థ ’కెప్లర్’ గణాంకాల ప్రకారం, ఫిబ్రవరి 24 నాటికి రోజుకు 2.6 మిలియన్ బ్యారెళ్ల చమురు హార్ముజ్ మార్గం ద్వారా భారతదేశానికి చేరేది. అమెరికా దాడుల నేపథ్యంలో ప్రపంచ చమురు ధరలు బ్యారెల్కు 72.87 డాలర్లకు పెరిగాయి. ఒకే రోజులో 6 డాలర్లు పెరిగాయి.
బ్యారెల్కు రూ.10 పెరిగితే, మనదేశ దిగుమతులపై 140 బిలియన్ డాలర్లు అంటే రూ.1.27 లక్షల కోట్లు అదనంగా చెల్లించాల్సి వస్తుందని అంచనా. ఇది మన ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తోంది. ఇప్పటికే ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, రూపాయి మారకం విలువ తగ్గడం వంటి ఒత్తిళ్ళలో ఉన్న తరుణంలో చమురు ధరల పెరుగుదల మరింత సంక్లిష్టతను తీసుకువస్తుంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ద్వారా రవాణా వ్యయం పెరుగుతుంది. ఆహార పదార్థాల నుంచి పరిశ్రమల ఉత్పత్తుల వరకు మొత్తం జీవన ప్రక్రియకు వ్యాపిస్తుంది.
దేశం వద్ద 70–75 రోజుల వినియోగానికి సరిపడా చమురు నిల్వలు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో నిల్వ చేసిన వ్యూహాత్మక పెట్రోలియం నిల్వలు తాత్కాలిక ఉపశమనాన్ని కల్పిస్తాయి. అదనంగా, రష్యా వంటి ప్రత్యామ్నాయ వనరుల నుంచి సరఫరా కొనసాగుతున్నది. ఇవి తాత్కాలిక రక్షణ మాత్రమే. హార్ముజ్ మార్గం దీర్ఘకాలం మూతపడితే, నిల్వలు క్రమంగా ఖాళీ అవుతాయి. ధరల ఒత్తిడి పెరుగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో కొనుగోలు పోటీ తీవ్రమవుతుంది.
అమెరికా, ఇరాన్, రష్యా, గల్ఫ్ దేశాలతో సంబంధాలను సమన్వయం చేసుకోవడం అవసరం. తటస్థ వైఖరితో జాతీయ ప్రయోజనాలను రక్షించుకోవడం కీలకం. ఆఫ్రికా, లాటిన్ అమెరికా వంటి దేశాల నుంచి దిగుమతులను పెంచడం, పునరుత్పాదక ఇంధనాలపై దృష్టి సారించడం, విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడం వంటి చర్యలు మాత్రమే భవిష్యత్ సంక్షోభాలను తగ్గించగలవు.
ప్రస్తుత పరిస్థితి యుద్ధం మరింత విస్తరించే సంకేతాలు ఇస్తోంది. లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, గల్ఫ్ లో మిస్సైల్ హెచ్చరికలు, అంతర్జాతీయ నౌకాశ్రయాలపై భద్రతా ఆందోళనలు ప్రపంచానికి అప్రమత్త సంకేతాలే. ఈ సంక్షోభం త్వరగా చల్లారకపోతే, ఇది కేవలం ప్రాంతీయ యుద్ధం కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపే పరిణామంగా మారే ప్రమాదం ఉంది.
హార్ముజ్ జలసంధి చుట్టూ ఏర్పడిన ఈ సంక్షోభం భారత్కు కఠిన పరీక్ష. దీర్ఘకాలంలో ఇంధన భద్రతను పటిష్ఠం చేయడం తప్పనిసరి. సమయోచిత వ్యూహం, చురుకైన రాజనీతి చర్యలు, ప్రత్యామ్నాయ ఇంధనాల ప్రోత్సాహం ఈ సంక్షోభం నుంచి భారత్ను రక్షించగల మార్గాలు.

