అమెరికా–ఇరాన్ విభేదాలు, ఇజ్రాయెల్ భద్రతా ఆందోళనలు, ప్రాంతీయ అభద్రతా భావ రాజకీయాలు ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తున్నాయి. యుద్ధ వాతావరణం సృష్టించడం సులువు కానీ, దాని ఫలితాలను భరించడం మాత్రం దేశాలకు, ప్రజలకు మాత్రం చాలా కఠినం. ఈ నేపథ్యంలో ఇరాన్ భవిష్యత్ ఏంటన్న ప్రశ్న సహజంగానే ముందుకొస్తోంది.
1979 ఇరానియన్ విప్లవం తర్వాత ఇరాన్ రాజకీయ వ్యవస్థ మతాధారిత నాయకత్వంపై ఆధారపడింది. ఆ విప్లవానికి నాయకత్వం వహించిన అయతొల్లా రుహొల్లా ఖొమేనీ దేశాన్ని ఇస్లామిక్ గణతంత్రంగా మలిచారు. ఆయన మరణానంతరం అయతొల్లా అలీ ఖమేనీ సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరించి దశాబ్దాల పాటు దేశాన్ని నడిపించారు. ఇరాన్ రాజ్యాంగంలో సుప్రీం లీడర్కు అపార అధికారాలు ఉన్నాయి. సైన్యం, న్యాయవ్యవస్థ, విదేశాంగ విధానాలపై కీలక నియంత్రణ అధ్యక్షుడికే ఉంటుంది.
అమెరికా–ఇరాన్ సంబంధాలు విప్లవానంతరం నుంచే ఉద్రిక్తంగా మారాయి. అణు ప్రయోగాల చుట్టూ వివాదాలు పెచ్చరిల్లాయి. ఇరాన్ తన అణు కార్యకలాపాలు శాంతి ప్రయోజనాల కోసమేనని చెబుతుంటే, అమెరికా, ఇజ్రాయెల్ వంటి దేశాలు అవి తమ భద్రతకు ముప్పుగా అనుమానిస్తున్నాయి. అమెరికా అణు ఒప్పందం నుంచి ఇరాన్ వైదొలగడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది. అమెరికా ఆర్థిక ఆంక్షలు ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపాయి. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరిగాయి.
ఇక ప్రాంతీయ రాజకీయాల్లో కూడా ఇరాన్ కీలక పాత్ర పోషిస్తోంది. లెబనాన్లోని హిజ్బొల్లా, గాజాలోని హమాస్ వంటి గ్రూపులకు ఇరాన్ మద్దతు ఇస్తోందన్న ఆరోపణలు ఇజ్రాయెల్తో విభేదాలను మరింత ముదిరేలా చేశాయి. పశ్చిమాసియా ఇప్పటికే సున్నితమైన భౌగోళిక–రాజకీయ సమీకరణలతో కూడిన ప్రాంతం. ఇక్కడ ఒక చిన్న చిచ్చు కూడా విస్తృత యుద్ధానికి దారి తీసే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం తప్పదు. చమురు ధరలు పెరిగి, సరఫరా దారులు మూసుకుపోయి, వాణిజ్య మార్గాలు దెబ్బతినే ప్రమాదం ఉంది.
ఇక ఇరాన్ అంతర్గత పరిస్థితి కూడా సవాళ్లతో నిండి ఉంది. యువతలో మార్పు ఆకాంక్ష పెరుగుతోంది. మహిళా హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛలు, ఆర్థిక అవకాశాల కోసం నిరసనలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ కఠిన వైఖరి అంతర్గత అసంతృప్తులను పూర్తిగా అణచివేయలేకపోయింది.
ఇరాన్ రాజ్యాంగం ప్రకారం సుప్రీం లీడర్ పదవి ఖాళీ అయితే, మత పెద్దల మండలి అయిన ‘అసెంబ్లీ ఆఫ్ ఎక్స్ పర్ట్స్’ కొత్త నాయకుడిని ఎన్నుకుంటుంది. అందువల్ల పాలనా వ్యవస్థలో అకస్మాత్తుగా శూన్యత ఏర్పడే అవకాశాలు తక్కువ. అయినప్పటికీ, నాయకత్వ మార్పు సమయంలో రాజకీయ చర్చలు, వర్గాల మధ్య పోటీ, పోరాటాలు ఉధృతమయ్యే అవకాశం ఉంది. వారసత్వ రాజకీయాలు కూడా చర్చనీయాంశం కావచ్చు. అయితే అది ప్రజాభిప్రాయాన్ని ఎంతవరకు ప్రభావితం చేస్తుందన్నది చూడాలి.
ఈ విపత్కర, యుద్ధ విపరిణామాల్లో భారత్ వంటి దేశాలకు అన్ని దేశాలతో సమాన దౌత్యవిధానం అత్యంత అవసరం. భారత్ కు ఇరాన్ వ్యూహాత్మకంగా ముఖ్యమైన భాగస్వామి. చాబహార్ పోర్ట్, మధ్య ఆసియా ప్రాప్తి, ఇంధన భద్రత వంటి అంశాల్లో ఇరాన్ ఆసరా అవసరం. అదే సమయంలో అమెరికాతో వ్యూహాత్మక సంబంధాలు కీలకం. కాబట్టి ఏ దేశానికీ అనుకూలం కాకుండా, జాతీయ ప్రయోజనాలను కాపాడే విధంగా సమాన దూరం, సమన్వయం అవసరం.
ఇక ఇప్పుడు ఇరాన్ ముందు మూడు భవిష్యత్ మార్గాలున్నాయి. సంస్కరణల దిశగా అడుగులు వేయడం. కఠిన విదేశాంగ విధానాన్ని కొనసాగించడం. లేదా మితవాద–ఆచరణాత్మకంగా ప్రపంచంతో సమన్వయం పెంచుకోవడం. ఎప్పటికైనా యుద్ధం తాత్కాలిక రాజకీయ లాభాలు ఇవ్వవచ్చు. కానీ, దీర్ఘకాలంలో దేశాల్ని ఆర్థికంగా, సామాజికంగా బలహీనపరుస్తుంది. ప్రజల సంక్షేమం, ప్రాంతీయ స్థిరత్వం, ఆర్థిక పునరుద్ధరణ లక్ష్యాలుగా ఇరాన్ తన భవిష్యత్ వ్యూహాన్ని మలచుకోవాల్సిన సమయం ఇది.
చర్చలు, రాజీ, పరస్పరం ఇచ్చిపుచుకునే గౌరవాలే స్థిరమైన శాంతికి పునాది. ఇరాన్ కు మాత్రమే కాదు, అన్ని దేశాలకూ ఇదే వర్తిస్తుంది. ఈ అనిశ్చిత సమయంలో వివేకంతో విజయం సాధించాలి.

