దేశంలో ఒకేసారి వెలుగులోకి వచ్చిన రెండు సంఘటనలు రాజ్యాంగ వ్యవస్థల మధ్య సంబంధాన్ని, అలాగే చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేశాయి. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు చేసిన వ్యాఖ్యలు, ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థపై వచ్చిన వివాదాస్పద పాఠ్యాశంపై సుప్రీంకోర్టు స్పందనల, ఈ రెండు సందర్భాల్లోనూ, కేంద్ర ప్రభుత్వ వైఖరి ప్రశ్నార్థకంగానే మిగిలింది. ఒక కేసులో కోర్టు వ్యాఖ్యలు, అది కేవలం ఆ కేసుకు సంబంధించినది మాత్రమే కాదు. వ్యవస్థ లోపాలకు సూచిక. హెచ్చరిక కూడా.
కోర్టులు ప్రశ్నించడమంటే ప్రభుత్వాన్ని బలహీనపరచడం కాదు. బాధ్యతలను గుర్తుచేయడమే. అదే సమయంలో ప్రభుత్వం కూడా విమర్శలను స్వీకరించి, లోపాలను సరిదిద్దుకోవాలి. ప్రతిష్ఠను కాపాడుకోవడం అంటే విమర్శలను అణచివేయడం కాదు. విశ్వసనీయతను పెంపొందించుకోవడం.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
దేశ రాజకీయ-న్యాయ పరిణామాల్లో ఒకేసారి వెలుగులోకి వచ్చిన రెండు సంఘటనలు దేశ రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఉన్న సంబంధాన్ని, అలాగే చెక్స్ అండ్ బ్యాలెన్స్ ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేశాయి. ఒకటి ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు చేసిన వ్యాఖ్యలు కాగా, మరొకటి ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థపై వచ్చిన వివాదాస్పద పాఠ్యాశంపై సుప్రీంకోర్టు స్పందన. ఈ రెండు సందర్భాల్లోనూ కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలి ప్రశ్నార్థకంగానే మిగిలింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు గత కొంతకాలంగా జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారింది. ఈ కేసులో అప్పటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత వంటి ప్రముఖులను అరెస్ట్ చేయడం రాజకీయంగా ప్రకంపనలు రేపింది. దర్యాప్తు చేసిన సీబీఐ, ఈడిల చర్యలపై మొదటి నుంచే విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు వెలుబుచ్చిన తీర్పు, చేసిన వ్యాఖ్యలు రాజకీయ విమర్శలకు న్యాయ పరమైన బలాన్ని చేకూర్చాయి.
కేసులు నమోదు చేయడం, అరెస్టులు చేయడం, ఛార్జ్ షీట్లు దాఖలు చేయడం కచ్చితమైన సాక్ష్యాధారాలతో జరగాలి. లేకపోతే అది వ్యక్తుల స్వేచ్ఛపై దాడి చేయడమే అవుతుంది. రాజ్యాంగ పదవిలో ఉన్న ముఖ్యమంత్రిని, మాజీ ఉపముఖ్యమంత్రిని జైలులో పెట్టేంత తీవ్ర ఆరోపణలు ఉంటే, వాటికి తగిన సాక్ష్యాధారాలు ఉండాలి. ముందస్తు పర్మీషన్లు తీసుకోవాలి. అలా జరగకపోవడం వల్ల దర్యాప్తు సంస్థల విశ్వసనీయతకే భంగం కలిగింది. రాజకీయ కక్షసాధింపుల ఆరోపణలు మరింత బలపడ్డాయి.
అవినీతి, ఆర్థిక నేరాలపై కఠినంగా వ్యవహరించాల్సిన బాధ్యత సీబీఐ, ఈడిలదే. అదే సమయంలో నిష్పాక్షికత, చట్టపరమైన కట్టుదిట్టత, సాక్ష్యాలాధారిత దర్యాప్తు అత్యవసరం. లేకపోతే దర్యాప్తు సంస్థలు రాజకీయ ఆయుధాలుగా మారాయన్న అపవాదుకు జవాబివ్వడం కష్టమే. ఒక కేసులో కోర్టు తీవ్ర వ్యాఖ్యలు, అది కేవలం ఆ కేసుకు సంబంధించినది మాత్రమే కాదు. వ్యవస్థ లోపాలకు సూచిక. ఒక హెచ్చరిక కూడా.
ఇక ఎన్సీఈఆర్టి పాఠ్యాంశ వివాదం మరో కోణాన్ని వెలుగులోకి తెచ్చింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ప్రచురించిన ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే అంశం చేర్చడం వివాదమైంది. దీనిపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్వయంగా సుమోటోగా విచారణ చేపట్టింది. న్యాయవ్యవస్థ గౌరవం పోయేలా, ప్రజల్లో అపనమ్మకాన్ని కలిగించేలా పాఠ్యాంశాలు ఉండకూడదని కోర్టు ఆగ్రహించింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వివరణ ఇచ్చినప్పటికీ, ఆ అధ్యాయాన్ని వెనక్కి తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించడం ప్రభుత్వ పర్యవేక్షణ లోపాలను ఎత్తి చూపింది.
ఈ రెండు ఘటనల సారాంశమేంటంటే, దర్యాప్తు సంస్థలు రాజకీయ ప్రభావాలకు అతీతంగా ఉండాలి. విద్యా సంస్థలు సున్నిత అంశాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రభుత్వం తన ఆధీనంలో ఉన్న వ్యవస్థలపై ఆధిపత్యం కాకుండా సమగ్ర పర్యవేక్షణ కలిగి ఉండాలి. లేకపోతే కోర్టుల జోక్యం తప్పదు.
ఇక అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవడంలో ఎలాంటి సందేహం ఉండకూడదు. కానీ ఆధారాల్లేకుండా కేసులు నమోదు చేయడం, అరెస్టులు చేయడం, తర్వాత కోర్టులో నిలబడలేకపోవడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తుంది. అలాగే విద్యా రంగంలో సున్నిత అంశాలను చేర్చేటప్పుడు సమగ్ర చర్చ, నిపుణుల సలహాలు అవసరం.
ప్రజాస్వామ్యంలో న్యాయ, కార్యనిర్వాహక, శాసన వ్యవస్థల మధ్య పరస్పర నియంత్రణ అత్యంత కీలకం. కోర్టులు ప్రశ్నించడమంటే ప్రభుత్వాన్ని బలహీనపరచడం కాదు. బాధ్యతలను గుర్తుచేయడమే. అదే సమయంలో ప్రభుత్వం కూడా విమర్శలను స్వీకరించి, లోపాలను సరిదిద్దుకోవాలి. ప్రతిష్ఠను కాపాడుకోవడం అంటే విమర్శలను అణచివేయడం కాదు. విశ్వసనీయతను పెంపొందించుకోవడం.
ఇప్పటికైనా కేంద్రం సహా అన్ని ప్రభుత్వాలు సంస్థల స్వతంత్రతను కాపాడాలి, పారదర్శకతను పెంపొందించాలి. చట్టపరమైన ప్రమాణాలను కచ్చితంగా పాటించాలి. వ్యక్తులు కాదు, వ్యవస్థలు బలంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది.

