
స్థానిక సంస్థల ఎన్నికల వేళ అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు విభిన్న రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం రఘోత్తంపల్లి గ్రామంలో ఒక అసాధారణ ఆఫర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్రామ వార్డు మెంబర్గా పోటీ చేస్తున్న శివాని విజయం సాధిస్తే, తమ వార్డులోని ప్రజలకు ఐదేళ్ల పాటు ఉచితంగా కటింగ్, షేవింగ్ సేవలు అందిస్తానని ఆమె భర్త శ్రీకాంత్ ప్రకటించారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికల వేడిలో డబ్బు, చీరలు, బహుమతులు పంపిణీ చేస్తూ ఓట్ల కోసం పోటీ పెరుగుతుండగా, ఈ ఫ్రీ కటింగ్ ఆఫర్ గ్రామంలో చర్చనీయాంశమైంది. స్థానికంగా సర్పంచ్, వార్డు మెంబర్ ప్రచారాలు ఊపందుకున్న తరుణంలో ఈ వినూత్న హామీ ఓటర్లను ఆకర్షిస్తోంది.

