లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రే నెలల తరబడి జైలులో ఉండటం, మాజీ ఉప ముఖ్యమంత్రి రెండేళ్లకు పైగా నిర్బంధంలో ఉండటం, తెలంగాణ సీఎం కూతురు, మాజీ ఎంపీ, ప్రముఖ నాయకురాలు అరెస్టు కావడం వంటివన్నీ ప్రజాభిప్రాయంపై ప్రభావం చూపాయి. అయితే, విచారణ సుదీర్ఘకాలం సాగి, చివరకు అభియోగాలు నిలవకపోతే, ఆ కాలంలో ఆ వ్యక్తుల రాజకీయ, సామాజిక జీవితం, పరువు నష్టం, ఇమేజీ డ్యామేజీ అవడం, ప్రజల్లో, పార్టీపై ప్రభావం వంటి వాటికి బాధ్యులెవరు?
అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే వారిని నిర్దోషులుగా భావించవచ్చా? ఈ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పై కోర్టుకు, ఆపై కోర్టుకు, ఇంకో పై కోర్టుకు అప్పీలు చేసుకోవచ్చు. ఈ దశలో బలహీనపడిన కేసు, ఉన్నత న్యాయస్థానాల తీర్పులు వేర్వేరు దిశల్లో వెళ్లవచ్చు. చట్ట ప్రక్రియకు గౌరవం ఇవ్వాలి. కోర్టులు తుది నిర్ణయాధికారులు. కాబట్టి రాజకీయ వ్యాఖ్యానాల కంటే, న్యాయపరమైన స్పష్టత ముఖ్యం.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
దేశ రాజకీయాల్లో సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు పరిణామాలు ఇప్పుడు కీలక మలుపు తిరిగాయి. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కూతురు, మాజీ ఎంపీ, కల్వకుంట్ల కవిత సహా పలువురు నేతలకు భారీ ఊరట లభించింది. తాజాగా విచారణ చేపట్టిన రౌస్ అవెన్యూ కోర్టు నిందితులందరిపై నమోదైన సరైన ఆధారాలు లేకుండానే కేసులు నమోదు చేశారని, నిరూపించలేకపోయారని, ఈ కేసులో సీబీఐ అధికారులపై కేసులు పెట్టాలని కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. అభియోగాలు ఎన్నైనా మోపొచ్చు కానీ, వాటిని నిరూపించే సాక్ష్యాధారాలే ముఖ్యం.
కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీ దేశంలో అత్యున్నత విచారణ సంస్థలుగా పేరుగాంచాయి. వీటి చర్యలు చట్టబద్ధత, పారదర్శకత, వాస్తవాధారాలపై నిలబడాలి. అయితే ఈ కేసులో కోర్టు అడిగిన ప్రశ్నలకు ఆ రెండు సంస్థలు జవాబివ్వలేకపోయాయి. రాజకీయ కక్షతో పెట్టిన కేసుగా ఇప్పటి దాకా వస్తున్న ఆరోపణలు నిజమనే విధంగానే దర్యాప్తు సంస్థల తీరు ఉంది. వాటిని బలపరుస్తున్నట్లుగానే కోర్టు తీర్పును బట్టి తెలుస్తోంది. దర్యాప్తు సంస్థలు రాజకీయ ప్రభావాలకు అతీతంగా పనిచేయాలన్నది మూల సూత్రం. ప్రతిపక్ష నేతలపై కేసులు నమోదయ్యే ప్రతి సందర్భంలో “రాజకీయ ప్రతీకారం” అన్న ఆరోపణలు వినిపించడం కూడా సాధారణమైంది. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై ఈ విమర్శలు కొత్తవేమీ కావు.
దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పాగా, ఇతర రాష్ట్రాల్లో విస్తరణకు ప్రయత్నాలు, పంజాబ్ లో సాధించిన విజయం రాజకీయ సమీకరణాలను మార్చాయి. సరిగ్గా ఆ సమయంలోనే లిక్కర్ పాలసీ కేసు వెలుగులోకి రావడం, అరెస్టులు జరగడం అనుమానాలకు తావిచ్చింది. ముఖ్యమంత్రే నెలల తరబడి జైలులో ఉండటం, మాజీ ఉప ముఖ్యమంత్రి రెండేళ్లకు పైగా నిర్బంధంలో ఉండటం, తెలంగాణ సీఎం కూతురు, మాజీ ఎంపీ, ప్రముఖ నాయకురాలు అరెస్టు కావడం వంటివన్నీ ప్రజాభిప్రాయంపై ప్రభావం చూపాయి.
అయితే, న్యాయ ప్రక్రియలో అరెస్టు అనేది శిక్ష కాదు. అది విచారణలో భాగం మాత్రమే! కానీ విచారణ సుదీర్ఘకాలం సాగి, చివరకు అభియోగాలు నిలవకపోతే, ఆ కాలంలో వ్యక్తుల రాజకీయ, సామాజిక జీవితం దెబ్బతినడం సహజం. అనివార్యం. పరువు నష్టం, ఇమేజీ డ్యామేజీ అవడం, ప్రజల్లో, పార్టీపై ప్రభావం తిరిగి పూడ్చుకోవడం కష్టం. ఈ మొత్తానికి బాధ్యులెవరు?
మరోవైపు, అవినీతి ఆరోపణలు ఎదుర్కొనే వారిని పూర్తిగా నిర్దోషులుగా భావించవచ్చా? ఈ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ పై కోర్టుకు, ఆపై కోర్టును సవాల్ చేస్తూ ఇంకో పై కోర్టుకు, ఇలా సుప్రీం కోర్టు దాకా అప్పీలు చేసుకోవచ్చు. ఈ దశలో బలహీనపడిన కేసు, ఉన్నత న్యాయస్థానాల తీర్పులు వేర్వేరు దిశల్లో వెళ్లవచ్చు. చట్ట ప్రక్రియకు గౌరవం ఇవ్వాలి. కోర్టులు తుది నిర్ణయాధికారులు. కాబట్టి రాజకీయ వ్యాఖ్యానాల కంటే, న్యాయపరమైన స్పష్టత ముఖ్యం.
అయితే, ఈ కేసు పరిణామాల నేపథ్యంలో దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా పని చేస్తున్నాయా? లేదా? లేకపోతే, వాటి స్వతంత్రతను ఎలా కాపాడాలి? నియామక విధానంలో మార్పులు అవసరమా? పార్లమెంటరీ పర్యవేక్షణ బలోపేతం చేయాలా? లేక న్యాయపరమైన పర్యవేక్షణ సరిపోతుందా? ఈ ప్రశ్నలు ఇప్పుడు చర్చించాల్సిన ఆవశ్యకత ఉంది.
అవినీతి, అధికార దుర్వినియోగం కూడా ప్రమాదమే. ఒకదాన్ని అడ్డుకునే పేరుతో మరొకదాన్ని పెంపొందించ కూడదు. చట్టం ముందు అందరూ సమానమనే భావన బలపడాలి. అదే సమయంలో, చట్ట అమలు సంస్థలు కూడా తమ చర్యలకు జవాబుదారీగా ఉండాలి.
ఈ కేసు రాజకీయంగా ఎవరికీ లాభమో, ఎవరికి నష్టమో ఆయా పార్టీలు, నేతలు నిర్ణయించుకోవాలి. కానీ, సాక్ష్యాలు బలంగా ఉంటేనే కేసులు నిలబడతాయి. దోషులకు శిక్షలు పడతాయి. లేకపోతే అనుమానాలు పెరుగుతాయి. ఇలాంటి కేసుల నమోదులో రాజకీయ ప్రభావాలు? కక్షలు, ప్రలోభాలు? లొంగదీసుకోవడాలు వంటివేవున్నా, దర్యాప్తు సంస్థల స్వయం ప్రతిపత్తికి సవాల్ గా నిలుస్తున్నాయి. మన దేశంలో రాజకీయ కేసులు నిలబడవనే నానుడి మారోసారి రుజువైంది.

