ప్రజాస్వామ్యానికి ఎన్నికల ప్రక్రియే ప్రాణం. రాజ్యంగం ఆత్మ. ఓటు హక్కు ప్రజాస్వామిక రాజ్యాంగాలకు మూలం. అయితే, ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్- సర్) కార్యక్రమం చుట్టూ నెలకొన్న రాజకీయ వివాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిజంగా అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడితే అది రాజ్యాంగానికే విఘాతం. అదే సమయంలో బోగస్ ఓట్లు కొనసాగితే అది ప్రజాస్వామ్యానికి ముప్పే. అందువల్ల సవరణ కార్యక్రమం నిష్పాక్షికంగా, సాక్ష్యాధారాలతో, పారదర్శకంగా సాగాలి. ఎవరైనా తమ ఓటు కోల్పోయినట్లయితే వారికి తక్షణ ఉపశమనం కల్పించే వ్యవస్థ ఉండాలి. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కూడా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవాలి. విశ్వాసం బలపడాలంటే పారదర్శకత ఒక్కటే మార్గం.
డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్
ప్రజాస్వామ్యానికి ఎన్నికల ప్రక్రియే ప్రాణం. రాజ్యంగం ఆత్మ. ఓటు హక్కు ప్రజాస్వామిక రాజ్యాంగాలకు మూలం. అయితే, ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్- సర్) కార్యక్రమం చుట్టూ నెలకొన్న రాజకీయ వివాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో ఈ ప్రక్రియపై వ్యక్తమవుతున్న అభ్యంతరాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.
ఓటర్ల జాబితా ప్రక్షాళన అవసరం లేదని సాధారణంగా ఎవరూ చెప్పలేరు. కాలక్రమంలో మరణించినవారి పేర్లు, వలస వెళ్లినవారి వివరాలు, లేదా నకిలీ నమోదు, రెండు, మూడు చోట్ల ఓట్లు వంటి అంశాలు జాబితాలో ఉంటున్నాయి. అందుకే ఎన్నికల కమిషన్ నిర్దిష్ట వ్యవధిలో సమీక్ష చేపట్టింది. ఈ ప్రక్రియలో పారదర్శకత, సమగ్రత, పౌరుల హక్కుల పరిరక్షణ అత్యంత కీలకం.
పశ్చిమ బెంగాల్లో ‘సర్’పై అభ్యంతరాలు న్యాయస్థానాల మెట్లెక్కాయి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీయే స్వయంగా సుప్రీంకోర్టులో నల్లకోటు వేసుకుని మరీ వాదించారు. జ్యుడిషియల్ పర్యవేక్షణలో ప్రక్రియ కొనసాగాలని సుప్రీం ఆదేశించింది. ఒకవైపు ప్రక్రియను అడ్డుకోరాదని సూచిస్తూనే, మరోవైపు న్యాయపరమైన పర్యవేక్షణ అవసరాన్ని గుర్తు చేసింది.
వీటికతీతంగా, రాజకీయ పార్టీల్లో మాటల యుద్ధం ముదురుతోంది. మమత, సర్ ను ఉద్దేశపూర్వక చర్యగా విమర్శిస్తుండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు ఎన్నికల కమిషన్పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. రాహుల్ గాంధీ ‘ఓట్ చోరీ’ నినాదంతో ప్రచారం చేపట్టారు. అధికార బీజేపీ ప్రతిపక్షాల చర్యలను ఖండిస్తూనే, సర్ ను ఓట్ల ప్రక్షాళనగా సమర్థిస్తోంది.
ఒకవేళ నిజంగా అర్హులైన ఓటర్ల పేర్లు తొలగించబడితే అది రాజ్యాంగానికే విఘాతం. అదే సమయంలో బోగస్ ఓట్లు కొనసాగితే అది ప్రజాస్వామ్యానికి ముప్పే. అందువల్ల సవరణ కార్యక్రమం నిష్పాక్షికంగా, సాక్ష్యాధారాలతో, పారదర్శకంగా సాగాలి. ఎవరైనా తమ ఓటు కోల్పోయినట్లయితే వారికి తక్షణ ఉపశమనం కల్పించే వ్యవస్థ ఉండాలి.
బెంగాల్ తరహాలోనే, బీహార్ వంటి రాష్ట్రాల్లోనూ అవకతవకల అనుమానాలు వ్యక్తమైనప్పటికీ నిరూపితం కాలేదని అధికార వర్గాలు వాదిస్తున్నాయి. అలాగని విపక్షాల అనుమానాలు పూర్తిగా నిరాధారమని కూడా కొట్టిపారేయలేం. అనుమానం వ్యక్తం చేయడం తప్పు కాదు. కానీ దాన్ని సాక్ష్యాధారాలతో, బాధ్యతాయుతంగా నిరూపించగలగాలి. రాజ్యాంగ సంస్థలపై నిరాధార ఆరోపణలు ప్రజల నమ్మకాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది.
దేశ సరిహద్దు రాష్ట్రాల్లో శరణార్థుల అక్రమ వలసలపై చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత. అదే సమయంలో నిజమైన భారత పౌరులు ఇబ్బంది పడకూడదు. పత్రాల ధృవీకరణ ప్రక్రియలో మానవ హక్కులు, సహజ న్యాయం, పరిపాలనా పారదర్శకత తప్పనిసరి. అధికారులపై ఒత్తిళ్లు, విధి నిర్వహణలో లోపాలు వంటి ఆరోపణలు వస్తే అవి సీరియస్గా పరిశీలించాలి.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై కూడా ఇలాగే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కాలక్రమేణా సాంకేతిక సమీక్షలు, న్యాయపరమైన పరిశీలనలు ఆ వ్యవస్థపై విశ్వాసాన్ని బలోపేతం చేస్తున్నాయి. అదే విధంగా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కూడా ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవాలి. విశ్వాసం బలపడాలంటే పారదర్శకత ఒక్కటే మార్గం.
రాజకీయ పార్టీలు తమ తాత్కాలిక ప్రయోజనాల కంటే దేశ ప్రజాస్వామ్య స్థిరత్వాన్ని ప్రాధాన్యంగా చూడాలి. ప్రతి ఎన్నిక ముందు ఏవేవో వివాదాలు రేకెత్తడం ఆరోగ్యకరమైన ధోరణి కాదు. ఒకవేళ లోపాలు ఉన్నాయనుకుంటే చట్టపరమైన మార్గాల్లో పోరాడాలి. మొత్తం వ్యవస్థను అవమానించడం సమస్యకు పరిష్కారం కాదు.
సర్ పై జరుగుతున్న వివాదం ఒక అవకాశంగా మారాలి. ప్రక్రియ బలోపేతానికి. ఎన్నికల కమిషన్ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసి, ప్రజలకు అవగాహన కల్పించి, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను వేగవంతం చేయాలి. రాజకీయ పార్టీలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విశ్వాసాన్ని కాపాడటం అందరి బాధ్యత.

