స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాయి. ఇక రాజకీయాలు పక్కన పెట్టేయాలి. ప్రజలు ఎదురుచూస్తోన్న అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించాలి. గ్రామాలు, పట్టణాలు బలపడితేనే రాష్ట్రం, దేశం బలపడుతుంది. ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి ఎజెండాను రూపొందించి, అమలు చేయాలి.
గ్రామాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. పంచాయతీల్లో పారదర్శకత లేదు. నిధుల దుర్వినియోగం, స్థానిక స్థాయిలో పెరుగుతున్న అవినీతి గ్రామాభివృద్ధికి అడ్డంకులుగా మారాయి. అవినీతి రహిత పాలన గ్రామాల నుంచే ప్రారంభం కావాలి. పంచాయతీ వ్యవస్థను బలోపేతం చేయాలి. నిధుల కేటాయింపులు, అభివృద్ధి పనుల పురోగతి, ఖర్చుల వివరాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయాలి. సామాజిక ఆడిట్లను కఠినంగా అమలు చేస్తే బాధ్యతాయుత పరిపాలనకు మార్గం సుగమమవుతుంది.
గ్రామ సర్పంచ్ల పాత్ర అత్యంత కీలకం. కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు పరిపాలన, ఆర్థిక నిర్వహణ, పంచాయతీరాజ్ చట్టం, అభివృద్ధి కార్యక్రమాల అమలు విధానంపై సమగ్ర శిక్షణ ఇవ్వాలి. అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ గ్రామాభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసేలా వారిని సిద్ధం చేయాలి. రాజకీయ ప్రేరణలతో కాకుండా ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకునేలా దృఢమైన మార్గదర్శకాలు అవసరం.
మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. రోడ్లు దెబ్బతిన్నాయి, డ్రెయినేజీలు మూసుకుపోయాయి, చెత్త సేకరణలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఇంటింటికీ చెత్త సేకరణ పద్ధతి అమలులో ఉన్నా, నిర్వహణ లోపంతో ఫలితం కనిపించడం లేదు. పారిశుధ్య కార్మికుల కొరత, సరిపడా వాహనాల లేమి సమస్యలను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. పెద్ద రోడ్లను శుభ్రపరిచే యంత్రాలను వినియోగంలోకి తేవాలి. ఓపెన్ డ్రెయినేజీలను మూసివేసి ఆధునిక మురుగునీటి వ్యవస్థను అభివృద్ధి చేయాలి.
తాగునీటి సమస్య పట్టణాల్లోనే కాదు, శివారు కాలనీల్లోనూ తీవ్రంగా ఉంది. మిషన్ భగీరథ ప్రచారం పెద్దఎత్తున జరిగినా, అనేక ప్రాంతాల్లో సరఫరా వ్యవస్థ సక్రమంగా లేదు. పైప్లైన్ల లీకేజీలు, తరచూ జరిగే మరమ్మతులు, కొత్త కాలనీలకు కనెక్షన్ల లోపం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ దశలో అమృత్ 2.0 కింద చేపట్టిన పనులను వేగవంతం చేయడం అత్యవసరం. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకుంటేనే పనులు గడువులో పూర్తి అవుతాయి.
మున్సిపాలిటీల్లో విలీనమైన గ్రామాల పరిస్థితిని ప్రత్యేకంగా పరిశీలించాలి. పన్నుల భారం పెరిగినా, మౌలిక సదుపాయాలు మాత్రం అందుబాటులోకి రావడం లేదు. రోడ్లు, డ్రెయినేజీలు, వీధిదీపాలు, శ్మశాన వాటికలు వంటి ప్రాథమిక అవసరాలు ఇప్పటికీ నెరవేరలేదు. విలీన ప్రక్రియ అభివృద్ధికి దోహదపడాలి గానీ, అదనపు భారంగా మారకూడదు.
అక్రమ నిర్మాణాలు పట్టణ ప్రణాళికను సవాల్ చేస్తున్నాయి. అనుమతులు లేకుండా నిర్మాణాలు జరుగుతున్నా, నియంత్రణలో లోపం స్పష్టంగా కనిపిస్తోంది. పట్టణ ప్రణాళిక శాఖను బలోపేతం చేసి కఠినంగా అమలు చేస్తేనే శాస్త్రీయ పట్టణాభివృద్ధి సాధ్యమవుతుంది. లేదంటే భవిష్యత్తులో మరింత క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యే ప్రమాదం ఉంది.
ప్రజారోగ్యం పడకేసింది. దోమల విస్తృతి, వీధి కుక్కల సమస్య, కోతుల బెడద, పందుల సంచారం వంటి సమస్యలు గ్రామాల నుంచి పట్టణాల వరకు వ్యాపించాయి. ఫాగింగ్, శానిటేషన్ చర్యలు, పశుసంవర్ధక శాఖల సమన్వయం ద్వారా వీటిని నియంత్రించాలి. అంటువ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలి.
నిధుల విడుదల, వినియోగంలో రాజకీయ ప్రాధాన్యత కంటే అవసరాల ప్రాముఖ్యత ఉండాలి. అభివృద్ధి పనుల ఎంపికలో ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఈ-గవర్నెన్స్, డిజిటల్ మానిటరింగ్ వ్యవస్థల ద్వారా పనుల పురోగతిని పర్యవేక్షిస్తే పారదర్శకత పెరుగుతుంది.
ఈ సమస్యలన్నీ ఏళ్లుగా పేరుకుపోయిన నిర్లక్ష్య ఫలితమే. అయితే కొత్తగా ఎన్నికైన స్థానిక పాలకవర్గాలకు ఇది ఒక అవకాశం, ఒక సవాల్ కూడా. సమన్వయం, పారదర్శకత, కఠిన అమలు, ప్రజల భాగస్వామ్యం నాలుగు స్తంభాలు. రాజకీయ వాగ్దానాల నుంచి కార్యాచరణ దిశగా అడుగులు పడితేనే గ్రామాలు, పట్టణాలు నిజమైన అభివృద్ధి దిశగా సాగుతాయి. ఇదే ప్రజల ఆకాంక్ష.

