నీటి నిర్వహణలో స్పష్టత, ప్రాధాన్యతా క్రమం, కార్యాచరణలే అభివృద్ధికి అసలైన బలమైన పునాదులు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తికాకుండానే కొత్త ప్రతిపాదనలను, ప్రణాళికలను సిద్ధం చేయడం, రాజకీయ వ్యాఖ్యలతో వివాదాలను రేకెత్తించడం మామూలైపోయింది. ఇది సాగు, మంచినీటి వంటి జీవనాధార విధానాలలో సరైన పంథా కాదు.
పోలవరం వంటి జాతీయ ప్రాజెక్టు పదేళ్ళైనా పూర్తికాకపోవడం ఆందోళనకరం. దీంతో ప్రాజెక్టు వ్యయభారం పెరుగుతూ కాలయాపనకు గురవుతోంది. ఏడాదికేడాది నిర్మాణ ఖర్చులు పెరుగుతుండగా, ఆశించిన ప్రయోజనాలు నెరవేడంలేదు. తాజాగా 2027 జూన్ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రకటించారు, కానీ, దానిక నుగుణంగా దశలవారీ కార్యాచరణ, నిధుల సమీకరణ, పారదర్శక అమలు అవసరం. పోలవరం పూర్తయితేనే సాగు, తాగునీరు, వరద నియంత్రణ, జలవిద్యుత్ వంటి అనేక ప్రయోజనాలు సాకారం అవుతాయి.
ఇదిలా ఉండగా, నల్లమల సాగర్ ప్రాజెక్టు వంటి కొత్త ప్రతిపాదనలు ముందుకు తెచ్చి, ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాలు, ఉద్రిక్తతలకు తావివ్వడం సముచితం కాదు. నీటి విషయాలు భావోద్వేగాలతో కాకుండా, శాస్త్రీయ అవగాహనతో, పరస్పర ప్రయోజనాలు, సహకారం, గౌరవంతో చర్చించాల్సినవి. నదీజలాల వినియోగంపై సంయుక్త సాంకేతిక కమిటీలు, డేటా ఆధారిత చర్చలు, పారదర్శక ఒప్పందాలు ఉండాలి. పరస్పర ఆరోపణలు, రాజకీయ ప్రయోజనాలకు తోడ్పడవచ్చు కానీ, ఆయా రాష్ట్రాలకు, రైతులకు మాత్రం ప్రయోజనం చేకూర్చవు.
అదేవిధంగా కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ లోపాలు, విచారణలు, దోషులు, శిక్షలు వంటివి వేగంగా తేల్చాల్సినవి ఆలస్యమవడం రాజకీయ సంకల్ప లోపం. అయితే, విమర్శలు చేయడం కంటే, సాంకేతిక లోపాలుంటే సమీక్షించి సరిదిద్దడం అవసరం. ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రాజెక్టులను రాజకీయ ప్రయోజనాల వాదోపవాదాల బలి పీఠం మీద నిలబెట్టడం సమంజసం కాదు.
ఇటీవల నీటి వినియోగంపై కొత్త పాలసీ, రెగ్యులేటరీ కమిషన్ ఏర్పాటు వంటి వార్తలు చర్చనీయాంశమయ్యాయి. నీటి సరఫరా ఖర్చులకు అనుగుణంగా యూజర్ ఛార్జీలు విధించాలనే ఆలోచన వస్తున్నది. నిర్వహణ ఖర్చుల దృష్ట్యా ఈ వాదనలో కొంత తార్కికత ఉన్నప్పటికీ, సాగునీటిపై అదనపు భారం రైతులకు పెనుభారమవుతుంది. ఇది రైతుల వ్యతిరేకతకు దారి తీసే ప్రమాదం ఉంది. అంతర్జాతీయ జల సూత్రాల ప్రకారం మంచినీరు, సాగునీరు, జలవిద్యుత్, పరిశ్రమల ప్రాధాన్యతా క్రమాన్ని పాటించాలి. వ్యవసాయ రంగం ఇంకా అస్థిర పరిస్థితుల్లోనే ఉండగానే, పరిశ్రమలకు ముందస్తు ప్రాధాన్యం ఇవ్వడం ఉపాధి అవకాశాలు పెంచుతాయి కానీ, దేశ, రాష్ట్రాల ప్రగతికి సరైన దశ, దిశను నిర్దేశించలేవు.
రైతాంగం లాభాల బాట పట్టే విధంగా, నీటి వినియోగాన్ని విరివిగా వినియోగించే వరిసాగు తగ్గించి ఉద్యాన పంటలు, తృణ ధాన్యాలు ప్రోత్సహించాలనే సూచనలు సూత్రప్రాయంగా మంచివే. నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచడం కాలానుగుణ అవసరం. అయితే భూసార అనుకూలత, నీటి లభ్యత, మార్కెట్ పరిస్థితులు, నిల్వ, ప్రాసెసింగ్ సదుపాయాలు వంటి అంశాలను సమగ్రంగా అధ్యయనం చేయకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం రైతులకు నష్టదాయకం. పంటల మార్పు ఒక దీర్ఘకాలిక వ్యూహంగా, ప్రోత్సాహకాలతో, అవగాహన కార్యక్రమాలతో అమలు చేయాలి. హడావుడిగా కాదు.
రాష్ట్రంలో గోదావరి, కృష్ణా, పెన్నా, వంశధార, నాగావళి వంటి అనేక నదులు, వేలాది చెరువులు ఉన్నా వాటి సామర్థ్య వినియోగం పూర్తిస్థాయిలో జరగడం లేదు. వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చడం, పరిగెత్తే నీటిని నిల్వ చేయడం, చెరువుల పునరుద్ధరణ, కాల్వల ఆధునీకరణ వంటివేవీ జరగడంలేదు. ‘నడిచే నీటిని నిలబెట్టాలి. నిలిచిన నీటిని భూగర్భ జలాలుగా మార్చాలి’ అనే ఆలోచన ఇప్పటికైనా కార్యరూపం దాల్చాలి.
రాజకీయాలకంటే ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పం, పరిపాలనా దృఢత్వం అవసరం. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, పారదర్శకంగా జల విధానం, రైతు కేంద్రంగా నిర్ణయాలు, రాష్ట్రాల మధ్య సామరస్యపూర్వక సయోధ్యలే నీటి వివాదాలకు శాశ్వత పరిష్కార మార్గాలు. సమగ్ర నీటి యాజమాన్య ప్రణాళికతోనే వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులు సుసాధ్యం. లేకపోతే కొత్త ప్రతిపాదనలు, పాత వివాదాలు, పెరుగుతున్న వ్యయభారాలే మిగిలిపోతాయి. పక్కా ప్రణాళికలు, ప్రాధాన్యతా క్రమంతో ‘సాగ’డమే శ్రేయస్కరం.

