భారత న్యాయ వ్యవస్థ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఒక అపూర్వ ఘట్టం, దేశ అత్యున్నత న్యాస్థానంలో బుధవారం ఆవిష్కృతమైంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒక రాష్ట్ర అధినేతగానే కాకుండా, న్యాయ పరిరక్షకురాలిగా నల్ల కోటు ధరించి, సుప్రీంకోర్టులో వాదించి, యావత్ దేశాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఒక ముఖ్యమంత్రి స్వయంగా న్యాయవాదిగా వాదనలు వినిపించడం స్వతంత్ర భారత చరిత్రలో ఇదే ప్రథమం. చట్టసభలకూ, న్యాయవ్యవస్థకూ మధ్య ఉన్న సున్నిత రేఖలను చెరిపేస్తూ, ప్రజాక్షేత్రం నుండి నేరుగా న్యాయక్షేత్రానికి తరలిరావడం ప్రజాస్వామ్య పోరాట పటిమకు నిదర్శనం. న్యాయమూర్తుల ముందు ఆమె వినిపించిన గళం కేవలం ఒక రాజకీయ వాదన మాత్రమే కాదు. అది ప్రజాస్వామ్య పునాదులను కాపాడాలనే ఆవేదన. అరుదైన నివేదన.
మమతా బెనర్జీ, ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ’ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-సర్) ప్రక్రియకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 4, 2026న సుప్రీంకోర్టులో స్వయంగా వాదనలు వినిపించి చరిత్ర సృష్టించారు. ఒక ముఖ్యమంత్రి సుప్రీంకోర్టులో స్వయంగా వాదించడం ఇదే తొలిసారి. మమత న్యాయశాస్త్ర పట్టభద్రురాలు కావడంతో, ఆమె ‘పార్టీ ఇన్ పర్సన్’గా కోర్టు అనుమతి పొంది ఈ వాదనలు వినిపించారు.
2026 బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం ఆ రాష్ట్రంలో ఓటర్ల జాబితాను సమగ్రంగా సవరించేందుకు ‘సర్’ ను చేపట్టింది. ఈ ప్రక్రియ ద్వారా లక్షలాది మంది అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుండి అక్రమంగా తొలగిస్తున్నారని ఆమె ఆరోపించారు. కేవలం పశ్చిమ బెంగాల్ రాష్ట్రమే లక్ష్యంగా ఈ సవరణలు చేస్తున్నారని, అస్సాం వంటి ఈశాన్య రాష్ట్రాల్లో ఇలా జరగడం లేదని ఆమె వాదించారు. వెంటనే ‘సర్’ ప్రక్రియను నిలిపివేసి, 2025 నాటి ఓటర్ల జాబితా ఆధారంగానే 2026 ఎన్నికలు నిర్వహించాలని ఆమె సుప్రీంకోర్టును కోరారు.
ఢిల్లీ పాలకుల సూచనల మేరకు ఎన్నికల అధికారులు, బతికున్న వారిని కూడా చనిపోయినట్లుగా చూపి ఓటర్ల జాబితా నుండి వారి పేర్లు తొలగిస్తున్నారని మమత ధర్మాసనానికి వివరించారు. అలాగే ఎన్నికల అధికారులు ఆధార్ కార్డులను గుర్తింపు కార్డులుగా అంగీకరించడం లేదని, అదనపు పత్రాల కోసం ప్రజలను వేధిస్తున్నారని గళమెత్తారు.
కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతోనే ఎన్నికల సంఘం ఇలా వేధింపులకు పాల్పడుతూ, పక్షపాతంగా వ్యవహరిస్తోందని, ‘సర్’ ను “వాట్సాప్ కమిషన్” గా సంబోధించారు. ఈ సవరణ ప్రక్రియ తెచ్చిన విపరీతమైన ఒత్తిడి కారణంగా రాష్ట్రంలో 150 మంది ఓటర్లు, సిబ్బంది మరణించారని ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
మమతా బెనర్జీ వాదనలను విన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, దీనిపై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తగిన సంఖ్యలో గ్రేడ్-2 అధికారులను ఎన్నికల విధులకు కేటాయించాలని, తద్వారా మైక్రో-అబ్సర్వర్ల అవసరం ఉండదని కోర్టు సూచించింది. ఈ కేసు తదుపరి విచారణను 9 ఫిబ్రవరి, 2026కు వాయిదా వేసింది.
ప్రజాస్వామ్య వ్యవస్థలు నిర్వీర్యమవుతున్నాయని ఆందోళన చెందుతున్న వేళ, మమతా బెనర్జీ వేసిన ఈ అడుగు ఒక బలమైన ఆశావాదాన్ని చిగురింపజేసింది. ఒక సీఎం సామాన్య న్యాయవాదిగా వాదించడం రాజకీయ పోరాటం కాదు. న్యాయవ్యవస్థపై ఉన్న అచంచల విశ్వాసానికి ప్రతీక. పదవులు శాశ్వతం కాదని, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కే ప్రజాస్వామ్యంలో పరమావధి అని ఈ ఘటన చాటిచెప్పింది.
భవిష్యత్తులో పాలకులు వ్యవస్థల పట్ల బాధ్యతగా ఎలా ఉండాలో, హక్కుల కోసం ఎలా తెగించి పోరాడాలో నేర్పే పాఠం, గుణపాఠం ఈ ‘దీదీ’ సాహసం.

-గోపాల బాలరాజు, సీనియర్ జర్నలిస్టు
73370 82570

